తెలంగాణ

telangana

బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందే!.. రెజ్లర్లపై పోలీసుల తీరుపై మండిపడ్డ విపక్షాలు

By

Published : May 28, 2023, 11:03 PM IST

Wrestlers Protest India : భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్న రెజ్లర్లపై పోలీసులు దురుసుగా వ్యవహరించారు. ఈ తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. విపక్షాలతో పాటు క్రీడాకారులు పోలీసు చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు.

wrestlers-protest-india-protesting-wrestlers-detained-by-delhi-police
రెజ్లర్ల ఆందోళన

Wrestlers Protest India : భారత రెజ్లర్లు చేపట్టిన కొత్త పార్లమెంట్​ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్న రెజ్లర్లపై.. పోలీసులు దురుసుగా వ్యవహరించారు. పోలీసుల తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. జంతర్‌ మంతర్‌ నుంచి మార్చ్‌ నిర్వహించిన క్రీడాకారులు వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌, బజ్‌రంగ్‌ పునియాలను అడ్డుకున్న పోలీసులు.. వారిని నిర్బంధించి అక్కడి నుంచి తరలించారు. దీనిపై దిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్ స్వాతి మాలివాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు రాజకీయ పార్టీల నేతలు, క్రీడాకారులు.. పోలీసుల తీరుపై మండిపడ్డారు. కాగా తమ విధులకు ఆటంకం కలిగించారంటూ నిరసనల్లో పాల్గొన్న రెజ్లర్లపై కేసు నమోదు చేశారు పోలీసులు.

మండిపడ్డ విపక్షాలు
బీజేపీ ప్రభుత్వానికి అహంకారం మరింత ఎక్కువైందన్నారు కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా. ఆందోళన చేస్తున్న మహిళా క్రీడాకారులపై కనికరం లేకుండా అణచివేస్తున్నారని ఆమె మండిపడ్డారు. దేశ గౌరవాన్ని పెంచే మన క్రీడాకారులతో దురుసుగా ప్రవర్తించడం తప్పని అభిప్రాయపడ్డారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌లపై దిల్లీ పోలీసులు చేయిచేసుకోవడంపై బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వెలుబుచ్చారు. ప్రజాస్వామ్యం సహనంతోనే ఉందని.. కానీ, అణచివేత శక్తులు మాత్రం అసహనంతో ఉన్నాయని ఆమె మండిపడ్డారు.

తమపై వేధింపులకు వ్యతిరేకంగా చేపట్టిన రెజ్లర్ల ఆందోళనల్లో.. పోలీసులు అనుసరించిన తీరును నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) నేత సుప్రియా సూలే పూర్తిగా ఖండించారు. వారిపై చేయిచేసుకునేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చిందా..? దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. కమ్యూనిస్టు పార్టీ సైతం దీన్ని ఖండించింది. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను బస్సుల్లో ఎక్కించగా.. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మాత్రం కొత్త పార్లమెంటు భవనంలో కూర్చోవడం నిజంగా సిగ్గుచేటని సీపీఐ(ఎం) మండిపడింది.

రెజ్లర్ల ఆందోళన

మహిళా కమిషన్ చీఫ్​ ఆగ్రహం
డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ బ్రిజ్ భూషణ్‌ను వెంటనే అరెస్టు చేయాలని, క్రీడాకారులను వెంటనే విడుదల చేయాలని.. దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ను అక్కడి మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మాలివాల్‌ డిమాండ్‌ చేశారు. దాంతో రెజ్లర్లపై చేయిచేసుకున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

రెజ్లర్ల ఆందోళన

రైతుల నిర్బంధం
మరోవైపు, రెజ్లర్లు చేపట్టిన నిరసనకు మద్దతుగా భారతీయ కిసాన్‌ యూనియన్‌.. మహిళా మహా పంచాయత్‌’కు పిలుపునిచ్చింది. అయితే, ఇందులో పాల్గొనేందుకు పంజాబ్​, హరియాణా నుంచి బయలుదేరిన అనేక మంది రైతు నేతలను పోలీసులు నిర్బంధించారని బీకేయూ పేర్కొంది.

రెజ్లర్ల ఆందోళన
రెజ్లర్ల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details