ETV Bharat / sports

'పద్మశ్రీ సహా అవార్డులన్నీ వెనక్కి ఇచ్చేస్తాం'.. ప్రభుత్వానికి రెజ్లర్ల వార్నింగ్​

author img

By

Published : May 4, 2023, 2:19 PM IST

Updated : May 4, 2023, 2:50 PM IST

జంతర్​మంతర్​ వద్ద దిల్లీ పోలీసుల వ్యవహార శైలిపై రెజ్లర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పద్మశ్రీ సహా తాము గెలుచుకున్న అవార్డులు, పతకాలను వెనక్కి ఇచ్చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

wrestlers protoest
wrestlers protoest

దిల్లీ జంతర్​మంతర్​ వద్ద పోలీసులు వ్యవహరించిన శైలిపై రెజ్లర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దిల్లీ పోలీసుల వ్యవహారశైలితో ఆగ్రహానికి గురైన రెజ్లర్లు.. పద్మశ్రీ సహా తాము గెలుచుకున్న అవార్డులు, పతకాలను వెనక్కి ఇచ్చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇలాంటి అవమానాలను ఎదుర్కున్నప్పడు ఆ గౌరవాలు పొంది లాభంలేదన్నారు. సాక్షి మాలిక్​తో పాటు తనతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని స్టార్‌ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌ తీవ్ర ఉద్వేగానికి గురైంది. ఇలాంటి రోజును చూసేందుకేనా తాము పతకాలు సాధించిందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. "మేం నేరస్థులం కాదు. కానీ పోలీసులు మమ్మల్ని అలాగే పరిగణిస్తున్నారు. నన్ను వేధించారు. నేలపైకి తోసేశారు" అని ఫొగాట్‌ ఆవేదన వ్యక్తం చేసింది. వినేశ్​ ఫొగాట్​, సాక్షి మాలిక్​ సహా సంగీత ఫొగాట్​ సోదరుడు దుశ్యంత్​కు గాయాలయ్యాయి.

ఈ సందర్భంగా మరో స్టార్ రెజ్లర్​ బజ్‌రంగ్‌ పునియా మాట్లాడుతూ.. "మేం గెలుచుకున్న పతకాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం" అని ఉద్వేగానికి గురయ్యాడు. వినేశ్​ ఫొగాట్​, సాక్షి మాలిక్​, బజ్​రంగ్​ పునియా దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారమైన ఖేల్​రత్న అవార్డును పొందారు. సాక్షి, బజ్​రంగ్​ నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని అందుకున్నారు.

ఏమైనా ఉంటే హైకోర్టుకు వెళ్లండి : సుప్రీం
మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్​పై విచారణను పూర్తి చేసింది సుప్రీంకోర్టు. భద్రత అంశాలపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే హైకోర్టు లేదా సంబధితం కోర్టుకు వెళ్లాలని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్​, జస్టిస్​ పీఎస్​ నరసింహా, జస్టిస్​ జేబీ పార్దీవాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

అవన్నీ అవాస్తవాలు
పోలీసులు మద్యం సేవించారని, రెజ్లర్లపై దాడి చేశారన్న ఆరోపణల్ని దిల్లీ పోలీసులు ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారని తెలిపారు. మరోవైపు.. జంతర్ మంతర్​ వద్ద నిరసన దీక్ష చేపట్టిన రెజ్లర్లకు సంఘీభావం తెలిపేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి హస్తినకు వస్తున్న రైతు సంఘాల నేతలు, కాప్​ పంచాయతీ సభ్యుల్ని దిల్లీ పోలీసులు సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు.

కాంగ్రెస్​ X బీజేపీ..
జంతర్​మంతర్​ వద్ద దిల్లీ పోలీసులు వ్యవహరించిన శైలిపై కాంగ్రెస్​ మండిపడింది. దేశం కోసం ఆడే క్రీడాకారుల పట్ల ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రెజ్లర్లు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్న వీడియోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. వారి వాదన విని, న్యాయం చేయాలని సూచించారు.
రెజ్లర్ల వ్యవహారంలో కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. అవినీతి ఆరోపణలు, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న వారు ధర్నా జరుగుతున్న చోటుకు వెళ్తే.. నిరసన విశ్వసనీయ తగ్గిపోతుందని అన్నారు కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖి. రెజ్లర్లకు కాంగ్రెస్, ఆప్​ నేతల మద్దతు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

అర్ధరాత్రి గొడవ..
అంతకుముందు భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్ల దీక్షా శిబిరం వద్ద బుధవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు జరిగాయి. పోలీసులు, రెజ్లర్ల మధ్య తలెత్తిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. తోపులాటలో అధికారులు తమపై దాడి చేస్తూ.. దూషించారని నిరసన తెలుపుతున్న అథ్లెట్లు ఆరోపించారు. ఈ ఘర్షణలో రెజర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్​తో పాటు పలువురికి తలపై గాయాలయ్యాయని తెలిసింది.

రెజర్ల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి మడత మంచాలు తీసుకొచ్చారు. వారికి అవి ఇచ్చేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వాటిని అనుమతించలేదు. అయినా రెజర్ల మద్దతుదారులు, సోమనాథ్‌ అనుచురులు.. ట్రక్కు నుంచి పడకలను బయటకు తీయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే రెజర్లు-సోమనాథ్‌ అనుచురులకు.. పోలీసుల‌తో గొడవ జరిగింది.

Last Updated : May 4, 2023, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.