Black Marketing Of World Cup Tickets :భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు- బీసీసీఐకి బంగాల్ పోలీసులు నోటీసులు పంపారు. కోల్కతాలోని ఈడెన్ మైదానంలో ఆదివారం జరగనున్న భారత్-దక్షిణాఫ్రికా ప్రపంచకప్ మ్యాచ్కు సంబంధించి ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో చెప్పాలని నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించిన పత్రాలను శనివారం సాయంత్రం బీసీసీఐ ప్రెసిడెంట్ అందుకున్నారు. బోర్డుకి చెందిన సంబంధిత అధికారి నవంబర్ 5న కోలకతాలో భారత్-సౌతాఫ్రికా మధ్య జరగబోయే మ్యాచ్ కోసం బీసీసీఐ ఎన్ని టికెట్లను విక్రయించింది అనే పూర్తి వివరాలను మైదాన్ పోలీస్ స్టేషన్లో సమర్పించాలని బంగాల్ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
బ్లాక్లో టికెట్స్ సేల్..
World Cup Black Tickets :అయితే భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్కు సంబంధించిన టికెట్లను కొందరు దళారులు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని బంగాల్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ నోటీసులు అందుకున్నారు. మరోవైపు ఈ కేసుతో సంబంధమున్న 19 మందిని బంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 108 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్కు సంబంధించి ఇప్పటివరకు ఏడు కేసులు నమోదు చేశారు.
"అక్టోబర్ 31 మంగళవారం నేను విధుల్లో ఉండగా నాకు కొన్ని ఫిర్యాదులు అందాయి. అందులో నవంబర్ 5న జరిగే భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్కు సంబంధించి టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఉంది. కొందరు దళారులు వాటిని బ్లాక్లో అమ్ముతున్నారని తెలిసింది. ఈ కారణంతోనే బీసీసీఐకి నోటీసులు జారీ చేశాము. సంబంధిత అధికారి.. టికెట్స్ అమ్మకాలకు సంబంధించిన పూర్తి వివరాలతో మైదాన్ పోలీస్ స్టేషన్కు హాజరుకావాలని కోరాము."
- మైదాన్ పీఎస్ అధికారి