డైలాగులపై పట్టు రావాలని, సన్నివేశాలు పండాలని సినిమా స్క్రిప్ట్ తీసుకొని మొత్తం తన స్వహస్తాలతో తిరగరాసే కథానాయకుడు ఎవరు?.. ఆయన సినిమాపై పెట్టే శ్రద్ధ అది.
ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి వ్యాయామం పూర్తిచేసి 6గంటలకే తన పనులన్నీ పూర్తిచేసుకొని మేకప్ వేసుకొని 7గంటలకల్లా చిత్రీకరణకు సిద్ధంగా ఉండే నటుడెవరు? ..ఆయనకున్న క్రమశిక్షణకు ఉదాహరణిది.
సహనటుడు మద్యానికి బానిసై జీవితాన్ని పాడుచేసుకుంటుంటే.. మందలించి దారిలో పెట్టిన మహోన్నత స్నేహతత్వం ఎవరిది? ..ఆయనలోని మానవత్వానికి నిదర్శనమిది.
అలాంటి మహానటుడు నందమూరి తారక రామారావు సినీ ప్రపంచాన్ని వదిలి వెళ్లాడంటే ఎలా? వెళ్లలేదు. క్రమశిక్షణతో నడుచుకొనే ప్రతి నటుడిలోనూ ఆయన స్ఫూర్తి బతికే ఉంది. సినిమానే ప్రాణంగా జీవించే ప్రతి ఒక్కరిలోనూ ఆయన ప్రతిబింబం ప్రతిఫలిస్తూనే ఉంది. తోటి కళాకారులకు అండగా నిలుస్తున్న ప్రతి మానవతా హృదయంలోనూ నిలువెత్తు విగ్రహమై ఆయన నిలుచొనే ఉన్నారు.
నటనే శ్వాసగా, సినిమానే గుండెచప్పుడుగా, తెలుగు ప్రేక్షకులే దేవుళ్లుగా భావించిన నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు. 'మనదేశం'తో మొదలైన ఆయన సినీ ప్రస్థానం 'పాతాళభైరవి'తో దేదీప్యమానమైంది. ఆ 'తోటరాముడు'.. తర్వాత 'ఇంటింటి రాముడ'య్యాడు. 'మాయాబజార్'లో కృష్ణుడిగా ఆయన జీవిస్తే.. తెలుగు ప్రజలు ఆయన్ని గుండెల్లో శ్రీకృష్ణభగవానుడిగా ప్రతిష్టించుకున్నారు. అదీ ఆయన సమ్మోహన రూపానికి, అద్భుత నటనకు నిదర్శనం. 'రక్తసంబంధం' సినిమాలో సావిత్రికి అన్నగా నటిస్తే.. అభిమానులకు చిరకాల 'అన్న'గా నిలిచిపోయారు. చూపులేని వాడిగా, కురూపిగా తెరపైన కనిపించినా ప్రేక్షకులు ఆయన అభినయానికి ముగ్ధులయ్యారు.
ప్రయోగాలకు పెట్టింది పేరాయన. ద్విపాత్రాభినయం చేయడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో 5 పాత్రల్లోనూ మెప్పించారు. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం చేస్తూ.. నటించగల బహుముఖ సామర్థ్యం ఆయన సొంతం. 'దానవీర శూరకర్ణ'లో దర్శకుడిగా, నటుడిగా ఆయన విశ్వరూపం చూపించారు. 'శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర చరిత్ర' ఆయన నట, దర్శకత్వ ప్రతిభకు నిదర్శనమే. 'గుండమ్మ కథ'లో ఆయన అక్కినేనితో తెరపంచుకొని అప్పుడే మల్టీస్టారర్ చిత్రాలకు బీజం వేశారు. 1954లో ఉత్తమ చలన చిత్రాలకు జాతీయ బహుమతులు ఇవ్వడం ఆరంభమైనప్పుడు 'తోడుదొంగలు' సినిమాకు రాష్ట్రపతి ప్రశంసాపత్రం లభించింది. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ 'నేషనల్ ఆర్ట్ థియేటర్స్' సారథ్యంలోనే నిర్మించారు. సొంతంగా సినిమాలు నిర్మించడమే కాదు.. ఎంతో మంది ప్రతిభావంతులకు 'వెండితెర'పై కొత్త జీవితాన్నిచ్చారాయన. దర్శకులు ఎస్.కృష్ణారావు, యోగానంద్లను ఆయనే పరిచయం చేశారు. నాయికలు బి.సరోజాదేవి, గీతాంజలి వంటి వారు ఆయన చిత్రాల్లోనే తొలిసారి మెరిశారు.
సినిమానే జీవనం..
ఆయనకు సినిమా అంటే కళే కాదు.. జీవన విధానం. తన పెద్దకుమారుడు (రామకృష్ణ సీనియర్) చనిపోయినప్పుడు, ఆ బాధను మరిచిపోవడానికి ఎడతెరపి లేకుండా సినిమాలు చేశారు. ఆయనకు సినిమానే సాంత్వన.
క్యాన్సర్ మహమ్మారితో తనువు చాలించిన తన సతీమణి బసవతారకం పేరుతో ఒక మెడికల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాలో వచ్చే లాభాలను ఆ ట్రస్టుకు తరలిద్దామనుకున్నారు. ఆ సినిమా సరిగా ఆడలేదు అప్పుడు మోహన్బాబుకు 'మేజర్ చంద్రకాంత్' చేసి పెట్టి, తనకు అందిన పారితోషికంతో బసవతారకం ఆసుపత్రి భవంతులు కట్టించడం మొదలుపెట్టారు. ఆయనకు సినిమానే సేవ.