ఇద్దరు బాలికలను వేధించినకేసులో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి నాలుగు నెలల జైలు శిక్ష విధించింది సింగపూర్ కోర్టు. సుశీల్ కుమార్ అనే చెఫ్.. రెండు కేసుల్లోనూ దోషిగా తేలాడని స్థానిక మీడియా తెలిపింది. రెండు ఘటనల్లోనూ బాలికలకు ముద్దులు పెడుతూ, హత్తుకుంటూ.. ప్రేమిస్తున్నానంటూ అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలింది.
ఇదీ జరిగింది
గతేడాది ఆగస్టు 2న బాధిత బాలిక ఇంటి నుంచి రైల్వే స్టేషన్కు వెళ్తోంది. ఇంతలో అక్కడికి వచ్చిన సుశీల్ కుమార్.. బాలికతో మాటలు కలిపాడు. అడ్రస్ అడుగుతున్నాడేమో అని భావించిన బాలిక అతడితో మాట్లడింది. అనంతరం బాలిక అనుమతి లేకుండా భుజాలపై చేతులు వేసి తన దగ్గరకు లాక్కున్నాడు. ఆమెను హత్తుకుని చెంపపై ముద్దు పెట్టాడు. ఆమెతో సెల్ఫీలు దిగి.. ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఏదైనా అవసరం ఉంటే తనకు ఫోన్ చేయమని చెప్పి.. మరోసారి ముద్దు పెట్టి వెళ్లాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిన బాలిక.. పరుగెత్తికెళ్లి తల్లికి జరిగిన విషయాన్నంతా చెప్పింది. దీంతో బాలికతల్లి అతడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విచారణలో మరిన్ని విషయాలు బయట పడ్డాయి. నిందితుడు.. వాట్సాప్లో కూడా బాలికను వేధించినట్లు తేలింది. బాలికకు వాట్సాప్లో రెండు సార్లు వీడియో కాల్ చేయడానికి ప్రయత్నించాడు. కిస్ ఎమోజీలను పంపించినట్లు తెలిసింది. దీంతో అతడిని అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత రోజు స్టేషన్ బెయిల్పై విడుదలయ్యాడు.