తెలంగాణ

telangana

'జపోరిజియా ప్లాంట్​పై దాడికి జెలెన్‌స్కీనే కారణం'

By

Published : Mar 6, 2022, 5:01 AM IST

Updated : Mar 6, 2022, 6:41 AM IST

Zaporizhzhia Nuclear Plant: జపోరిజియా అణు విద్యుత్​ కేంద్రంపై రష్యా దాడి చేయడానికి తమ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీనే కారణం అని ఆరోపించారు ఉక్రెయిన్​ మాజీ ప్రధాని మైకోలా అజరోవ్‌. ఉక్రెయిన్‌ గగనతలాన్ని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించేలా నాటోను ఒప్పించేందుకే జెలెన్​స్కీ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

zaporizhzhia nuclear plant
zaporizhzhia nuclear plant

Ukraine Crisis: ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రమైన తమ దేశంలోని జపోరిజియాపై రష్యా బాంబులు వేయడానికి తమ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ కవ్వింపు చర్యలే కారణమని ఉక్రెయిన్‌ మాజీ ప్రధాని మైకోలా అజరోవ్‌ ఆరోపించారు. ఉక్రెయిన్‌ గగనతలాన్ని 'నో-ఫ్లై జోన్‌'గా అమలు చేయడానికి నాటోను ఒప్పించేందుకే ఆయన ఈ పని చేశారని రష్యాకు చెందిన 'స్పుత్నిక్‌' వార్తాసంస్థతో మాట్లాడుతూ అన్నారు.

జపోరిజియా దగ్గర తమ సైన్యం అణుధార్మికత కాలుష్యానికి పాల్పడేందుకు యత్నిస్తోందంటూ ఉక్రెయిన్‌ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిందని రష్యన్‌ ఆర్మీ శుక్రవారం ప్రకటించింది. తద్వారా తమని కవ్వించేందుకు ప్రయత్నించిందని ఆరోపించింది. అణు విద్యుత్తు కేంద్రం సమీపంలో గస్తీకాస్తుండగా.. రష్యన్‌ బలగాలపై ఉక్రెయిన్‌ సైనికులు దాడికి పాల్పడ్డారని చెప్పుకొచ్చింది. విద్యుత్తు కేంద్రం ఆవరణలో ఉన్న విద్య, శిక్షణా కేంద్రం నుంచి సైనికులు కాల్పులు జరిపారని పేర్కొంది. వీటిని తిప్పికొట్టే క్రమంలో తామూ కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించింది.

దీనిపై స్పందించిన అజరోవ్‌ "ఇది పూర్తిగా కవ్వింపు చర్య కిందకే వస్తుంది. ఐరోపాలోనే అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రం ఆవరణలో ఎట్టిపరిస్థితుల్లో ఇటు ఉక్రెయిన్‌గానీ, అటు రష్యాగానీ కాల్పులు జరపడానికి వీల్లేదు. ఏమాత్రం గురితప్పినా.. అది అతిపెద్ద అత్యవసర పరిస్థితిని దారితీసే ప్రమాదం ఉంది. ఇది పూర్తిగా ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసిన కవ్వింపు చర్యే. మరోవైపు జెలెన్‌స్కీ తక్షణ స్పందన కూడా దీన్ని ధ్రువీకరిస్తోంది. అమెరికా, యూకేకు వెంటనే తప్పుడు సమాచారాన్ని పంపడం కూడా అందుకు నిదర్శనం. ఈ కవ్వింపు చర్య ద్వారా ఉక్రెయిన్‌ గగన తలాన్ని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించేలా నాటోపై ఒత్తిడి తేవాలని ప్రయత్నించారు" అంటూ అజరోవ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఉక్రెయిన్‌ గగనతలాన్ని నో-ఫ్లై జోన్‌గా అమలు చేయడానికి నాటో శుక్రవారం తిరస్కరించింది. రష్యా అణుశక్తితో.. ఐరోపాలో విస్తృతస్థాయి యుద్ధానికి ఈ చర్య ప్రేరేపించే అవకాశం ఉందని హెచ్చరించింది. అమెరికా సహా ఇతర సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి నేతృత్వం వహించిన నాటో సెక్రటరీ-జనరల్‌ జెన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ అనంతరం మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.

14.5 లక్షల మంది వలస

ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు ఆ దేశం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి సంఖ్య 14.5 లక్షలకు చేరినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సంస్థ (ఐఓఎం) తెలిపింది. వారంతా వెళ్లిన దేశాల మంత్రిత్వశాఖల గణాంకాలను ఉటంకిస్తూ శనివారం ఈ వివరాలను వెల్లడించింది. అత్యధికంగా 7,87,300 మంది పోలండ్‌కు వలసవెళ్లారు. అలాగే 2,28,700 మంది మోల్దోవాకు, 1,44,700 మంది హంగరీకి, 1,32,600 మంది రొమేనియాకు, 1,00,500 మంది స్లోవేకియాకు వెళ్లిపోయినట్లు ఐఓఎం తెలిపింది. 138 దేశాలకు చెందిన వారు ఉక్రెయిన్‌ సరిహద్దులు దాటి పొరుగు దేశాలకు వెళ్లినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:'చనిపోతున్న బిడ్డల గురించి రష్యన్ తల్లులకు చెప్పండి'

Last Updated :Mar 6, 2022, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details