తెలంగాణ

telangana

వీళ్లు చిటికేస్తే.. అఫ్గాన్​లో 'అంతర్యుద్ధం' తథ్యం!

By

Published : Sep 7, 2021, 5:51 PM IST

అఫ్గానిస్థాన్​లో మరికొన్ని రోజుల్లో తాలిబన్ల ప్రభుత్వం కొలువుదీరనుంది. అయితే తాలిబన్లు కాబుల్​ను ఆక్రమించుకున్న నాటి నుంచి దేశంలో 'అంతర్యుద్ధం'పై(civil war in afghanistan) ఊహాగానాలు జోరందుకున్నాయి. 2001లో అమెరికా అండతో తాలిబన్ల రాజ్యాన్ని కూల్చింది కూడా ఈ అంతర్యుద్ధమే! మరి ఇప్పుడూ అదే పునరావృత్తం అవుతుందా? అన్న సందేహాలు ఉన్నాయి. అయితే అఫ్గాన్​ సంక్షోభం.. అంతర్యుద్ధానికి దారితీస్తుందా అంటే.. అది 'యుద్ధవీరుల' నిర్ణయాలపైనే ఆధారపడి ఉంది. ఇంతకీ ఎవరీ యుద్ధవీరులు?(afghan warlords)

afghan crisis
అఫ్గాన్​ సంక్షోభం

అగ్రరాజ్య సైన్యం సామాను సర్దుకుని వెళ్లిపోయింది. ప్రజాస్వామ్యం, ఎన్నికలు, ప్రతిపక్షం అనే వాటికి చోటు లేకుండా పోయింది. మరి.. అఫ్గానిస్థాన్​ను తమదైన శైలిలో పాలించేందుకు సిద్ధమైన తాలిబన్లను ఎదిరించేదెలా? వారిని గద్దె దించడం సాధ్యమేనా? ఇందుకు వినిపిస్తున్న జవాబు.. అంతర్యుద్ధం.

అంతర్యుద్ధం.. అఫ్గానిస్థాన్​కు కొత్తేమీ కాదు. 2001లోనూ జరిగింది అదే. అయితే.. అప్పటి తాలిబన్ల ప్రభుత్వాన్ని(taliban government) కూల్చింది అమెరికా దళాలు, అక్కడి ప్రజలు మాత్రమే కాదు.. అఫ్గాన్​ స్థానిక కమాండర్లు, రాజకీయ నేతలు కూడా! అందుకే.. పంజ్​షేర్​ వంటి ప్రాంతాలపై పట్టున్న స్థానిక నేతలు ఇప్పుడు మరోమారు కీలకమయ్యారు. వారు తీసుకునే నిర్ణయాలు తాజా సంక్షోభాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందోనన్న చర్చకు కారణమయ్యారు.

వాస్తవానికి కాబుల్​ను ఆక్రమించుకునేందుకు తాలిబన్లు భారీ ప్రణాళికలే రచించారు. ఇందులో భాగంగా.. వేర్వేరు రాష్ట్రాల్లోని స్థానికులు, తెగలపై పట్టు ఉన్న కీలక నేతలు, సంఘాలను కానుకలు, ఇతర ప్రలోభాలతో సంతృప్తి పరిచారు. తమకు అడ్డంకిగా ఉండకూడదని స్పష్టం చేశారు. అయితే కొత్త ప్రభుత్వంలో తాలిబన్ల కింద పనిచేసేందుకు వీరు అంగీకరించకపోవచ్చు. తాలిబన్ల నూతన వ్యవస్థకు వ్యతిరేకంగా, సొంత ప్రయోజనాలు చేకూరే విధంగా వీరు నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదు.

ఈ పరిణామాలతో తాలిబన్లకు చిక్కులు తప్పవని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు(afghanistan latest news).

ఇస్లామిక్​ స్టేట్​ ఖోరాసన్​..

తాలిబన్లకు ఇస్లామిక్​ స్టేట్​ ఖోరాసన్​ కాస్త తలనొప్పిగా మారింది. అయితే కాబుల్​ విమానాశ్రయం వద్ద పేలుళ్లకు పాల్పడి వార్తల్లో నిలిచినప్పటికీ..ఐసిస్​-కే (isis k afghanistan attack) శక్తిసామర్థ్యాలు వాస్తవానికి తక్కువే. కేవలం 5వేల మందితో తూర్పు అఫ్గాన్​లోని నంగర్హర్​, కునార్​ రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. నియామకాలు, భారీస్థాయి పేలుళ్లకు పాల్పడి ప్రపంచం దృష్టిలో పడాలని ఐసిస్​-కే భావించినా.. రాజకీయ వ్యవస్థకు, జాతీయ భద్రతకు సవాళ్లు విసిరే స్థాయికి ఐసిస్​-కే చేరుతుందా అంటే అనుమానమే! గ్రామాల్లో ఈ సంస్థకు ఆదరణ ఉందా? తాలిబన్లను కాకుండా వాటి ప్రత్యర్థులైన ఐసిస్​-కేకు పాకిస్థాన్​ సహాయం చేస్తుందా? అన్న ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానాలు లేవు. అందువల్ల ఐసిస్​-కే నుంచి తాలిబన్లకు ఇప్పటికైతే పెద్ద ముప్పులేదనే చెప్పుకోవచ్చు.

ఇదీ చూడండి:-Kabul Airport: తాలిబన్ల వశమయ్యాక కాబుల్​ ఎయిర్​పోర్ట్ ఇలా...

పంజ్​షేర్​ సింహాలు...

తాలిబన్లకు ప్రధాన అడ్డంకి పంజ్​షేర్​ సింహాలు(taliban panjshir), నార్తన్​ అలయన్స్​ నుంచే. పంజ్​షేర్​ను దక్కించుకునేందుకు గతంలో తాలిబన్లు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. తాజా సంక్షోభంలో.. పంజ్​షేర్​లో తాము పైచేయి సాధించామని తాలిబన్లు ప్రకటించినా, ఈ వ్యవహారంపై ఇంకా స్పష్టత లేదు.

పంజ్​షేర్​కు నాటి యుద్ధవీరుడు అహ్మద్​ షా మసూద్​ తనయుడు అహ్మద్​ మసూద్(ahmad massoud latest news)​ నాయకత్వం వహిస్తున్నారు. గత ప్రభుత్వంలోని ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్​.. మసూద్​తో చేతులు కలిపారు. అయితే విదేశీ శక్తుల నుంచి సహాయం అందకపోవడం వల్ల తాలిబన్ల విషయంలో పంజ్​షేర్​ సింహాలు వెనకబడ్డాయి. అందువల్ల తాలిబన్లతో సంప్రదింపులు జరిపేందుకు మసూద్​ ముందుకొచ్చినట్టు తెలుస్తోంది.

మసూద్​

ఇదీ చూడండి:-Afghan Crisis: మీడియాకు తాలిబన్ల వార్నింగ్​- 'మసూద్' వార్తలపై నిషేధం!

మరోవైపు ఉజ్బెక్​ వారసత్వానికి చెందిన జనరల్​ అబ్దుల్​ రషీద్​ దోస్తుమ్​.. ఉత్తర అఫ్గానిస్థాన్​పై పట్టుసాధించేందుకు 1980 నుంచి ప్రయత్నిస్తున్నారు. నార్తన్​ అలయన్స్​ వ్యవస్థాపకుల్లో ఈయన ఒకరు. 2001లో తాలిబన్లను గద్దె దించేందుకు అమెరికాకు సహాయం చేశారు. అనంతరం అగ్రరాజ్యం అండతో ఏర్పడిన ప్రభుత్వంలో అనేక పదవులను చేపట్టారు. ప్రతీకారం తీర్చుకునేందుకు రషీద్​పై తాలిబన్లు రెండుసార్లు హత్యాయత్నం చేశారు. వాటి నుంచి ఆయన తప్పించుకున్నారు. అయితే ఆగస్టులో కాబుల్​ కోట కూలిన అనంతరం ఉజ్బెకిస్థాన్​కు వెళ్లిపోయారు.

అబ్దుల్​ రషీద్​ దోస్తుమ్​

1980లో ముజాహిదీన్​ కమాండర్​గా విధులు నిర్వర్తించిన మహమ్మద్​ నూర్​, రషీద్​తో చేతులు కలిపారు. తాలిబన్లపై పోరు కోసం గతంలో నార్తన్​ అలయన్స్​లో చేరారు. వీరిద్దరూ మసూద్​కు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసినవారే. అయితే పంజ్​షేర్​ తాలిబన్ల వశమైతే వీరి ఆలోచనలు మారే అవకాశం ఉంది. సైనిక చర్యల కన్నా, రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ నూర్​ ఇప్పటికే ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇందుకు నిదర్శనం.

మహమ్మద్​ నూర్​

ఇస్మాయిల్​ ఖాన్​..

ఇక పశ్చిమ అఫ్గానిస్థాన్​లోని హెరాత్​ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్మాయిల్​ ఖాన్​కు(ismail khan afghanistan) ఇరాన్​ మద్దతిస్తోంది. ఆయనకు ప్రత్యేక సైన్యం కూడా ఉంది. 1980లలో ముజాహిదీన్​ దళాలకు నాయకత్వం వహించిన ఖాన్​.. అనంతరం 1992లో హెరాత్​ గవర్నర్​గానూ పనిచేశారు. ఆ తర్వాత రాజకీయంగా ఆయన ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. ఆయనపై తాలిబన్లు హత్యాయత్నం చేశారు. గత ఆగస్టులో తాలిబన్లు విజృంభించగా.. ఇస్మాయిల్​ సైన్యం పరారైంది. మరి అది తాలిబన్లకు భయపడేనా? లేక వారితో రహస్య ఒప్పందం కుదుర్చుకోవడం వల్లేనా? అన్న ప్రశ్నలకు సమాధానం ప్రస్తుతానికి లేదు.

వాస్తవానికి ఖాన్​ను తాలిబన్లు ఆగస్టు 13న బంధించినట్టు తెలుస్తోంది. అది జరిగిన మూడు రోజులకు ఇరాన్​లోని మషాద్​ నగరంలో ఆయన ప్రత్యక్షమయ్యారు. ఇరాన్​ ఆయన్ను రక్షించిందని తెలుస్తోంది. మరి ఈ పూర్తి వ్యవహారంలో ఇరాన్​ వైఖరి ఏంటన్నదీ ప్రశ్నార్థకమే.

ఇస్మాయిల్​ ఖాన్​

గుల్​బుద్దిన్​ హెక్మత్యార్..

1980లలో హెజ్బ్-ఇ-ఇస్లామీని స్థాపించారు గుల్​బుద్దిన్​ హెక్మత్యార్​. పాకిస్థాన్​, అమెరికా సహాయంతో సోవియెట్లపై పోరాడారు. విధ్వంసకర సైనిక నేతగా ఈయనకు పేరుంది. 1996లో దేశాన్ని తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకునే కొంత కాలం ముందు వరకు ప్రధానిగా పనిచేశారు హెక్మత్యార్(gulbuddin hekmatyar news)​.

గుల్​బుద్దిన్​ హెక్మత్యార్

ఇదీ చూడండి:-గర్భంతో ఉన్న మహిళా పోలీస్ దారుణ హత్య- తాలిబన్ల పనే!

2001లో తాలిబన్ల ప్రభుత్వం కూలిన అనంతరం పాకిస్థాన్​కు పరారయ్యారు హెక్మత్యార్​. నాటి కర్జాయ్​ ప్రభుత్వంపై దాడులకు తన దళాలను ఉసిగొల్పి అమెరికా 'కిల్​ లిస్ట్​'లో చేరారు. 2016లో అజ్ఞాతంలో నుంచి తిరిగొచ్చి, ప్రజాస్వామ్య ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇప్పుడు తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో హెక్మత్యార్​ వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా తాలిబన్లతో కలిసి పనిచేస్తానని​ ఇప్పటికే ప్రకటించేశారు.

ఆర్థిక సంక్షోభమే ముగింపు!

50ఏళ్లుగా అఫ్గాన్​ ప్రజలు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో 'అధికారం' కోసం ఆధిపత్యాన్ని చెలాయించాలనుకునే వారు చాలా మంది ఉంటారు. అయితే ప్రత్యర్థులు బలహీనపడటం, సంప్రదింపులకు సిద్ధంగా ఉండటం వల్ల వారి నుంచి తాలిబన్లకు ప్రస్తుతానికైతే ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చు! (afghan crisis latest)

మరి వారందరూ జట్టుగా కలిసి తాలిబన్లపై విరుచుకుపడితే? ఈ విషయాన్ని కొట్టిపారేయలేం. సేవ, భద్రత అంశాల్లో తాలిబన్లు విఫలమైతే అసంతృప్తి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అసంతృప్తి వర్గాలు ఒక్క చోట చేరితే మాత్రం తాలిబన్లకు ముప్పు తప్పదు!

ఇదే జరిగితే తాలిబన్​ దళాలపై ఎక్కువ ప్రభావం ఉన్నా- లేకపోయినా, దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం కుప్పకూలిపోతుంది. అంతర్జాతీయంగా నిధులు అందకపోవడం వల్ల తాలిబన్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికే అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఏటీఎంలు ఇప్పటికే ఖాళీగా కనిపిస్తున్నాయి. అనేకమంది పేదరికంలోకి కూరుకుపోతున్నారు.

ఆర్థిక అవసరాల కోసం పౌరులను తాలిబన్లు హింసిస్తే మాత్రం.. మసూద్​, రషీద్​, ఖాన్​, హెక్మత్యార్​ తమ తిరుగుబాటు వ్యూహాలకు పదును పెట్టే అవకాశం ఉంది!

ఇదీ చూడండి:-పాకిస్థాన్​కు వ్యతిరేకంగా అఫ్గాన్​లో ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details