అఫ్గాన్లో మారుతున్న పరిణామాలపై వివిధ దేశాలతో భారత్ వరుస చర్చలు జరపుతోంది. ఇందులో భాగంగా.. రష్యా సెక్రటరీ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ నికోలాయ్ పాట్రూషెవ్తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ దిల్లీలో సమావేశమయ్యారు. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) చీఫ్ విలియమ్ బర్న్స్ భేటీ అయిన ఒక్కరోజు తర్వాత ఈ భేటీ జరగడం గమనార్హం.
అఫ్గాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడం సహా దక్షిణాసియాలో జైష్-ఏ -మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థలు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడంపై నికోలాయ్, అజిత్ డోభాల్ చర్చించారని సంబంధింత వర్గాలు తెలిపాయి. అయితే.. అఫ్గాన్ విషయంలో.. సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై వ్యతిరేక పోరాటంలో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
"అఫ్గాన్లో మానవతా పరిస్థితులపై, పౌరుల తరలింపుపై రష్యా, భారత్ ప్రతినిధులు చర్చించారు. శాంతియుత మార్గంలో అఫ్గాన్లోని సమస్యలను పరిష్కరించడానికి రష్యా, భారత్ కలిసి ఉమ్మడి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు. అఫ్గాన్ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు."