తెలంగాణ

telangana

కాళ్లు పట్టుకున్నా కనికరించలేదయ్యా, కన్నీరు పెట్టిస్తోన్న యువకుడి ఆత్మహత్య లేఖ

By

Published : Aug 21, 2022, 10:11 AM IST

ఏపీలో వైకాపా నేతల వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ దళిత యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.20 లక్షలు అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే, వాటిని పట్టుకోకుండా స్థానిక వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని, తనతోపాటు తన తల్లినీ వేధించారంటూ, ఎస్పీకి రాసిన ఆత్మహత్య లేఖ కంటతడి పెట్టిస్తోంది.

Harrasment death
Harrasment death

ఆంధ్రప్రదేశ్​లో వైకాపా నేతల వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ దళిత యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.20 లక్షలు అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే, వాటిని పట్టుకోకుండా అడ్డుపడుతున్నారని, తనతోపాటు తన తల్లినీ వేధించారని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. కావలి పట్టణం ముసునూరు ఎస్సీకాలనీకి చెందిన దుగ్గిరాల కరుణాకర్‌(36) చేపల చెరువును సబ్‌ లీజుకు తీసుకొని మత్స్య వృత్తితో జీవనం సాగిస్తున్నారు. రెండేళ్లుగా వరదలు, వర్షాల కారణంగా చేపలు కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.

ఈసారి వర్షాలు కురిసేలోపే చేపలు పట్టి విక్రయించాలని భావించగా, ముసునూరుకు చెందిన అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు. శ్రీశైలం ట్రస్టుబోర్డు సభ్యుడు, వైకాపా సేవాదళ్‌ ఏపీ కన్వీనర్‌ కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి పదేపదే అడ్డుకోవడంతో పాటు గత నెలలో చెరువులో మందు కలపడంతో పెద్దఎత్తున చేపలు మృత్యువాత పడ్డాయి. తీవ్ర ఒత్తిడికి లోనైన కరుణాకర్‌ అనారోగ్యానికి గురయ్యాడు. ప్రజాప్రతినిధులు, అధికారులను కలసి సమస్య వివరించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేదు. అప్పులెలా చెల్లించాలన్న ఒత్తిడి తట్టుకోలేక కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి కారణమైన వారి వేధింపులతో పాటు, కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి సూసైడ్‌ నోట్‌ రాశాడు. కరుణాకర్‌ ఆత్మహత్యపై జగదీశ్వర్‌రెడ్డి, సురేశ్‌రెడ్డిలపై కావలి గ్రామీణ పోలీసుస్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఐపీసీ 306 సెక్షన్ల కేసు నమోదైంది. ఎస్పీ విజయరావు ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ ఖాజావలి ఘటనాస్థలికి చేరుకొని విచారించారు.

పిల్లలను ఆదుకోండని ఎస్పీకి లేఖ :కరుణాకర్‌ రాసిన ఆత్మహత్య లేఖ.. చదివిన వారిని కంటతడి పెట్టించింది.‘ఆయ్యా.. అన్నగారిపాలెం పంచాయతీ లక్ష్మీపురం గ్రామ మత్య్సకారులకు రిజిస్టరైన చెరువులను సబ్‌ లీజుకు తీసుకొని చేప పిల్లలు పోసి, పెరిగిన తర్వాత అమ్ముకుంటున్నా. మా గ్రామానికి చెందిన కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి, అతని అనుచరుడు సురేశ్‌రెడ్డి మరికొందరు నేను చేపలు పట్టకుండా ఇబ్బందులకు గురిచేశారు. అప్పులపాలు చేశారు. దళితుడినని చూడకుండా మూడేళ్లుగా వేధించారు. నేను, నా తల్లి అతని ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. నాకిద్దరు ఆడ పిల్లలున్నారని చెప్పినా విన్లేదు. ఓపిక లేక ఆత్మహత్య చేసుకుంటున్నా. దీనికి కారణమైన వారిని అరెస్టు చేసి, నా కుటుంబానికి న్యాయం చేయండి. నాకు ఉన్న ఆస్తి ఇల్లు మాత్రమే. అదీ తాకట్టులో ఉంది. అది విడిపించి ఆడబిడ్డలకు ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.

వైకాపా నేతలు సమాజానికి శత్రువులుగా మారారు..జగన్‌ పాలనలో మరో ఎస్సీ యువకుడికి ఉరి పడిందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు రోజుకొకరు మరణించడం సర్వసాధారణంగా మారిందని శనివారం ట్విటర్లో మండిపడ్డారు. దీనిపై ప్రజల్లో చర్చ జరగాలని పిలుపునిచ్చారు. ‘కరుణాకర్‌పై జగదీశ్‌రెడ్డి ఆగడాలను జగన్‌రెడ్డి ముందే అడ్డుకట్ట వేసి ఉంటే... మరో ఎస్సీ సోదరుడి ప్రాణాలు పోయేవి కాదు. భూదందాలు, సెటిల్‌మెంట్లను దాటిన వైకాపా వాళ్ల ధనదాహం వ్యక్తుల ప్రాణాలనూ మింగేస్తోంది. సమాజానికి శత్రువులుగా మారిన వైకాపా రాక్షసులను కట్టడి చేయడంలో వైకాపా ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది’ అని మండిపడ్డారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details