తెలంగాణ

telangana

Saidabad Incident: రాజు కోసం ప్రత్యేక బృందాలు.. ఇంకా దొరకని ఆచూకీ

By

Published : Sep 16, 2021, 10:33 AM IST

ఆటోలు, రైళ్లు, బస్సులు ఇలా వెతకని చోటు లేదు. జన సమర్థ ప్రాంతాల్లో పోస్టర్లు వేసినా.. రూ.10 లక్షల రివార్డు ప్రకటించినా ఇప్పటి దాకా ఫలితం లేదు. ఒక్కరు, ఇద్దరు కాదు ఏకంగా వెయ్యి మంది పోలీసులు గాలిస్తున్నా అతడి జాడ లేదు. ఇది ఏ గజదొంగనో.. ఉగ్రవాదినో పట్టుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు కాదు. సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు కోసం పోలీసులు శ్రమిస్తున్న తీరు.

Saidabad Incident
రాజు కోసం ప్రత్యేక బృందాలు

సైదాబాద్‌ ఠాణా పరిధిలోని ఆరేళ్ల బాలికను పైశాచికంగా హత్యాచారం చేసి పారిపోయిన రాజును పట్టుకునేందుకు రాజధాని నగరాన్ని వేలమందితో కూడిన ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతున్నాయి. మద్యం దుకాణాలు, బార్లు, కల్లుకాంపౌండ్ల వద్దకు పోలీసులు వెళ్లి ఆరా తీస్తున్నారు. మరోవైపు పోలీసులు ప్రకటించిన రెండు ఫోన్‌ నంబర్లకు వందలకొద్దీ కాల్స్‌ వస్తున్నాయి. నిందితుడిని పోలి ఉన్న వ్యక్తుల ఫొటోలు పంపుతున్నారని ఉత్తర మండలం సంయుక్త కమిషనర్‌ ఎం.రమేష్‌రెడ్డి తెలిపారు. రాజు వివరాలున్న ఫొటోలను హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లోని బస్సులు, ఆటోలకు అతికించారు. హైదరాబాద్‌ పోలీసులు గణేశ్‌ మండపాల వద్ద మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. గుండు చేయించుకుంటే ఎలా ఉంటాడనే చిత్రాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు.

రాజు.. ఓ ఉన్మాది...

హంతకుడు పలకొండ రాజు మద్యానికి బానిసై పైశాచికంగా ప్రవర్తించేవాడని తెలుసుకున్నారు. ఉన్మాదిలా ప్రవర్తించేవాడని గుర్తించారు. మేనకోడలు పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. చస్తానంటూ బెదిరించి ఆమె తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుని తర్వాత ఆమెను విపరీతంగా కొట్టేవాడని బంధువులు పోలీసులకు చెప్పారు. ఒకరోజు మద్యం తాగి పీక మీద కాలుపెట్టి చంపబోతే ఆమె భయంతో పాపను తీసుకుని పారిపోయిందని ఓ పోలీస్‌ అధికారి వెల్లడించారు.

గతంలోనూ కేసు..

నిందితుడు రాజుపై గతంలోనూ చైతన్యపురి పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. ఆటోను దొంగిలించిన కేసులో గతేడాది అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. అనంతరం బెయిల్​పై బయటకు వచ్చాడు. రాజుకు తండ్రి లేకపోవడంతో, తల్లి కూలీ పనులు చేస్తూ కొడుకును పోషించింది. కేవలం 3వ తరగతి వరకే చదివిన రాజు ఎక్కువగా హైదరాబాద్​లోనే ఉంటాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అప్పుడప్పుడు సొంత గ్రామమైన జనగామ జిల్లా కడకొండ్లకు వెళ్లొస్తుంటాడని చుట్టుపక్కల వారు పోలీసులకు వివరించారు. లేబర్ అడ్డాల్లోనూ రాజు ఒకరిద్దరితోనే మాట్లాడతాడని... వాళ్లతో కలిసి కూలీ పనిచేయగా వచ్చే సొమ్మును పంచుకుంటారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇదీ చూడండి:Saidabad rape case : సైదాబాద్‌ కేసు నిందితుడి కోసం గాలింపు.. వేషం మార్చినా గుర్తుపట్టేలా ఫొటోలు

ABOUT THE AUTHOR

...view details