తెలంగాణ

telangana

MURDER: వ్యాపారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. కారణం అదే!

By

Published : Aug 11, 2021, 11:32 AM IST

Updated : Aug 11, 2021, 2:16 PM IST

medak murder case, police about medak realtor murder case
వ్యాపారి హత్య కేసు ఛేదించిన పోలీసులు, మెదక్‌లో వ్యాపారి హత్య కేసు ఛేదన ()

11:29 August 11

మెదక్ జిల్లాలో వ్యాపారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. కారణం అదే!

బంధువుల ఆందోళన

మెదక్ జిల్లాలో వ్యాపారి ధర్మాకర్ శ్రీనివాస్‌ను కారులో దహనం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక ఆధారాల సాయంతో ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను గుర్తించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణంగా తేల్చారు. సాక్ష్యాలను మాయం చేసేందుకే కారు డిక్కీలో శ్రీనివాస్ మృతదేహం పెట్టి నిప్పుపెట్టినట్లు వివరించారు.

నాలుగు బృందాల దర్యాప్తు

కేసు దర్యాప్తునకు రంగంలోకి దిగిన 4 ప్రత్యేక బృందాలు... ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కృత్రిమ దంతాల ఆధారంగా కారులోని మృతదేహం మెదక్‌కు చెందిన శ్రీనివాస్‌దే అని ఆయన కుటుంబసభ్యులు గుర్తించారు. తన భర్తకు స్థిరాస్తి వివాదాలతోపాటు, వివాహేతర సంబంధాలు సైతం ఉన్నాయని.. ఆ విషయంలో తమకు గతంలో గొడవలు కూడా అయినట్లు మృతుడి భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. శ్రీనివాస్ సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు.. సాయంత్రం 5 గంటల వరకు ఆయన ఫోన్ పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. మెదక్ జిల్లా జప్తి శివనూర్ వద్దకు వచ్చిన తర్వాత ఫోన్‌ సిగ్నల్స్ పోయినట్లు గుర్తించారు.


ఘటన ఇలా..

సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు ఈ కేసు ఛేదించారు. సోమవారం మధ్యాహ్నం శ్రీనివాస్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు.. సాయంత్రం 5 గంటల వరకు ఆయన ఫోన్ పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. మెదక్ జిల్లా జప్తి శివనూర్ వద్దకు వచ్చిన తర్వాత ఫోన్ సిగ్నల్స్ పోయినట్లు తేల్చారు. వెల్దుర్తి మండలం మంగళపర్తి వద్ద కారు దగ్ధమైన ప్రదేశానికి సమీపంలోని సీసీటీవీ(CCTV) కెమెరాల దృశ్యాల ఆధారంగా సోమవారం రాత్రి 10 గంటల 45 నిమిషాలకు మంటలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన రహదారుల వద్ద ఉన్న CCTV కెమెరాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు... డ్రైవింగ్ సీటులో వేరే వ్యక్తి ఉన్నట్లు నిర్ధారించుకున్నారు.


ఆర్థిక లావాదేవీలే..

ముగ్గురు వ్యక్తులు శ్రీనివాస్‌ను కత్తితో పొడిచి చంపినట్లు గుర్తించారు. అనంతరం, కారు డిక్కీలో శ్రీనివాస్ మృతదేహాన్ని పెట్టి మంగళపర్తి వద్దకు తీసుకువచ్చి దహనం చేసినట్లు తేల్చారు. సాక్ష్యాలను మాయం చేసేందుకే దహనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని విచారణలో వెల్లడైంది. 

బార్ వివాదం 

బార్‌లో వాటా ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడడంతోనే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. తూప్రాన్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న బార్‌లో తనకూ వాటా ఇవ్వాలని బార్ లైసెన్స్‌దారుడు శివను శ్రీనివాస్ గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని పేర్కొన్నారు. ఈ విషయంలో వారిద్దరి మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోందని తెలిపారు. తనకు బార్‌లో వాటా ఇవ్వకపోతే చంపేస్తానని శివను శ్రీనివాస్ బెదిరించినట్టు పోలీసులు వెల్లడించారు. అడ్డంకిని  తొలగించుకోవలన్న ఉద్దేశంతో శివ తన స్నేహితులతో కలిసి శ్రీనివాస్‌ను హత్య చేసి.. అతని కారులోనే తల, మొండెం వేరు చేసి డిక్కీలో వేసి పెట్రోల్ పోసి దహనం చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు వివరించారు. శ్రీనివాస్‌ను హత్య చేసిన ముగ్గురు నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్పీ చందన దీప్తి అభినందించారు.

బంధువుల ఆందోళన

శ్రీనివాస్‌ హత్య కేసులో నిందితులతో పాటు సూత్రధారులను కఠినంగా శిక్షించాలంటూ మృతుడి బంధువులు మెదక్‌లో ఆందోళనకు దిగారు. సోమవారం రాత్రి హత్యకు గురైన వ్యాపారి శ్రీనివాస్‌ అస్తికలకు... కుటుంబసభ్యులు, బంధువులు అంతిమసంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు పట్టణంలోని రాందాస్‌ చౌరస్తా వద్ద బైఠాయించారు. హత్యకు ప్రేరేపించిన డాక్టర్‌ దంపతులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేసుతో ప్రమేయమున్న పలువురిని పోలీసులు ఇంకా అదుపులోకి తీసుకోకపోవటం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి:MURDER: రియల్టర్ దారుణ హత్య... కారు డిక్కీలో వేసి కాల్చేశారు!

Last Updated :Aug 11, 2021, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details