తెలంగాణ

telangana

MURDER: ప్రియుడిని మరచిపోలేక.. భర్తను అంతమొందించిన భార్య

By

Published : Jul 18, 2021, 10:14 PM IST

ఏపీలోని విశాఖ మధురవాడ ఎన్జీవోస్ కాలనీలో జరిగిన హత్య కేసును(Murder in madhuravada NGO'S colony) పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేసినట్లు డీసీపీ గౌతం శాలి(DCP goutham shali) వెల్లడించారు. మృతుడి భార్య రమ్య, ఆమె ప్రియుడు బాషా కలిసి సతీశ్‌ను చంపినట్లు తెలిపారు.

ప్రియుడిని మరచిపోలేక.. భర్తను అంతమొందించిన భార్య
ప్రియుడిని మరచిపోలేక.. భర్తను అంతమొందించిన భార్య

వారిద్దరిదీ చిన్ననాటి ప్రేమ.. పాఠశాల రోజుల్లోనే ప్రేమించుకుని విడిపోయారు. సుదీర్ఘ విరామం అనంతరం స్కూల్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మళ్లీ కలుసుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురించింది. అప్పటికే ఆమెకు పెళ్లై, పిల్లలూ ఉన్నారు. అయినప్పటికీ తన కుటుంబం కంటే ప్రియుడే ముఖ్యమనుకున్న ఆమె.. తన ప్రియుడితోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. వీరి సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది. ముందస్తు పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఈ అంశంపై కేసు నమోదు కాగా.. పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. తానే ఈ హత్య చేసినట్లు ఒప్పుకుంది. చివరికి తన ప్రియుడితో కలిసి కటకటాలపాలైంది.

రాడ్డుతో తలపై కొట్టి..

విశాఖ మధురవాడలోని దుర్గానగర్​లో సతీశ్ అనే వ్యక్తి.. తన భార్య రమ్య, పిల్లలతో కలిసి రాత్రి నడకకు వెళ్లాడు. రోడ్డుపై నడుస్తున్న సతీశ్​ను గుర్తు తెలియని వ్యక్తి రాడ్డుతో తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన సతీశ్​ను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించగా.. అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై మృతుడి భార్య రమ్య పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించారు.

రమ్య తీరుపై అనుమానం..

తన భర్తపై దాడికి పాల్పడ్డ సమయంలో తాను అతనితోనే ఉన్నానని చెప్పడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి రమ్య ఆరు అడుగుల దూరంలోనే ఉన్నానని చెప్పడం, భర్త సతీశ్​పై దాడి జరుగుతున్న సమయంలో ఆమె ప్రతిఘటించకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. ఈ కేసులో రమ్యపై అనుమానంతో పోలీసులు విచారించగా.. తానే ఈ హత్య చేశానని ఒప్పుకున్నట్లు విశాఖ డీసీపీ గౌతం శాలి వెల్లడించారు. సతీశ్ హత్యకు రెండు రోజుల ముందే రమ్య.. తన ప్రియుడు షేక్ బాషాతో కలిసి సీసీ కెమెరాలు లేని, నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుని హత్యకు పాల్పడినట్లు డీసీపీ తెలిపారు.

నిందితుల అరెస్ట్​..

హత్యకు పాల్పడిన నిందితులిద్దరి మధ్య చిన్నప్పుడే ప్రేమ వ్యవహారం ఉండేదని డీసీపీ గౌతం శాలి అన్నారు. సుధీర్ఘ సమయం అనంతరం.. పదో తరగతి స్నేహితుల వాట్సాప్ గ్రూప్ ద్వారా వీరిద్దరూ కలుసుకున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న రమ్య భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నారని, సతీశ్​ను హత్య చేసి రమ్య, బాషాలు ఒక్కటవ్వాలని ప్లాన్ వేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో రాత్రి నడకకు వెళుతున్న సతీశ్​ తలపై రాడ్డుతో కొట్టి హత్య చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, వారిని రిమాండ్​కు తరలించామని డీసీపీ గౌతమ్ శాలి వివరించారు.

ఇవీ చదవండి:lovers suicide: ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details