తెలంగాణ

telangana

Corona effect: గంటల వ్యవధిలోనే భార్యాభర్తల మృతి

By

Published : Jun 1, 2021, 11:52 AM IST

కరోనా ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భార్య కరోనాతో మృతి చెందగా...భర్త వృద్ధాప్యంతో మృతి చెందిన విషాదకరమైన ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. భార్యాభర్తలు గంటల వ్యవధిలోనే మృత్యువాత చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

husband and wife died in same day at mahabubabad
గంటల వ్యవధిలోనే భార్యాభర్తల మృతి

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన చిరగాని నర్సయ్య(86), చిరగాని సోమక్క(70) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, నలుగురు కుమారులు. నర్సయ్య గత కొంత కాలంగా వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. కాగా గత నెల మొదటి వారంలో వీరి పెద్ద కుమారుడు కొవిడ్‌ బారిన పడి కోలుకున్నారు. అనంతరం సోమక్కకు కరోనా సోకింది. శ్యాసకోస సమస్యతో గత నెల 14న తొర్రూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది.

చికిత్సపొందుతూనే సోమక్క మృతి

ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు.. సోమక్కని వరంగల్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల పాటు చికిత్సను అందించారు. ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు నిర్ధరించిన వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచాలని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకొచ్చి నిత్యం ఆక్సిజన్‌ అందిస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై ఈరోజు తెల్లవారుజామున సోమక్క మృతి చెందింది.

అంత్యక్రియలు చేసొచ్చేలోపు నర్సయ్య...

కొవిడ్‌ నేపథ్యంలో కుటుంబ సభ్యులే మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల అనంతరం ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులకు నర్సయ్య చనిపోయిన విషయం తెలిసింది. తల్లిదండ్రులిద్దరూ ఒకేరోజు మృతి చెందడం జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తర్వాత నర్సయ్యకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఇద్దరు ఒకే రోజు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదం నెలకొంది.

ఇదీ చదవండి :Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ

ABOUT THE AUTHOR

...view details