తెలంగాణ

telangana

Road accidents in Telangana Today: రాష్ట్రంలో రక్తమోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

By

Published : Mar 2, 2022, 10:13 AM IST

Road accidents in Telangana Today : రాష్ట్రంలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో రహదారులు నెత్తురోడాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జాతరకు వెళ్తూ ఇద్దరు.. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్​ కారణంగా మరికొందరు మృత్యువాత పడ్డారు. మేడ్చల్​, సూర్యాపేట జిల్లాలో ఇద్దరు చొప్పున.. యాదాద్రి జిల్లా, హైదరాబాద్​లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఘటనల్లో పలువురు గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

road accidents in telangana
తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు

Road accidents in Telangana Today: రాష్ట్రంలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆస్పత్రి పాలయ్యారు.

డివైడర్​ను ఢీకొట్టి

Medchal Road Accident Today :: మేడ్చల్ చెక్ పోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు. మధ్యప్రదేశ్​కు చెందిన కొంతమంది యువకులు మారుతీ ఎకో వాహనంపై హైదరాబాద్​ వస్తుండగా... బావర్చి కూడలిలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన వాహనం డివైడర్​ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో కారులో మొత్తం తొమ్మిది మంది ఉన్నట్లు వెల్లడించారు. మద్యం మత్తే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదానికి గురైన కారు

జాతరకు వెళ్తూ.. అదుపు తప్పి

Suryapet Accident News Today : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి శివారులో... అతివేగం ఇద్దరు ప్రాణాలను బలిగొంది. తమ్మరబండ పాలెంకు చెందిన ముగ్గురు యువకులు అరవింద్​(22), హంజద్(20)​, అనిల్​... శివరాత్రి సందర్భంగా ద్విచక్ర వాహనంపై మేళ్లచెరువు జాతరకు వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో కిందపడి.... మరో వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టారు. ప్రమాదంలో హంజద్ అక్కడికక్కడే మృతిచెందగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అరవింద్​ ప్రాణాలు కోల్పోయారు. అనిల్, మరో వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో... వారికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

నిద్రమత్తు.. నిండు ప్రాణం

ఘటనలో నుజ్జునుజ్జయిన బస్సు ముందు భాగం

బస్సు డ్రైవర్​ నిద్రమత్తు ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ మండలం తుప్రాన్​పేట్ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి దుర్మరణం చెందారు. ఏపీలోని కాకినాడకు చెందిన సాఫ్ట్​వేర్​ ఉద్యోగి సురేశ్​ కుమార్.. హైదరాబాద్​ నుంచి కాకినాడకు కారులో వెళ్తున్నారు. ఆ సమయంలో హైదరాబాద్​ వైపు ఓ ప్రైవేట్​ ట్రావెల్స్ బస్సు వస్తోంది. బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో డివైడర్ ఎక్కి రాంగ్ రూట్​లోకి వెళ్లి కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సురేశ్​ అక్కడిక్కడే మృతి చెందగా.. అతని బంధువు రాజేశ్​​కు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఫ్లైఓవర్​ పైనుంచి

హైదరాబాద్ టోలిచౌకీ పైవంతెన పైనుంచి కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. టోలిచౌకిలోని సాలర్​ జంగ్​ కాలనీకి చెందిన సర్ఫరాజ్ హుస్సేన్.. స్థానికంగా మెడికల్ దుకాణంలో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి తన యజమానికి చెందిన ద్విచక్రవాహనం తీసుకుని టోలిచౌకి ఫ్లైఓవర్ పైనుంచి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. నిర్లక్ష్యంగా బైక్ నడపటమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:రెండు ప్రాణాల్ని బలి తీసుకున్న భూవివాదం.. సినీ ఫక్కీలో కాల్పులు

ABOUT THE AUTHOR

...view details