తెలంగాణ

telangana

Tollywood Drugs case : నందును 7 గంటలు, కెల్విన్‌ను 6 గంటల పాటు విచారించిన ఈడీ

By

Published : Sep 7, 2021, 10:30 AM IST

Updated : Sep 7, 2021, 10:33 PM IST

actor
ఈడీ

10:29 September 07

Tollywood Drugs case : ఈడీ విచారణకు హాజరైన నటుడు నందు

కెల్విన్​ను ప్రశ్నిస్తున్న అధికారులు...

మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు సినీ నటుడు నందుతో పాటు మత్తు మందుల సరఫరాదారు కెల్విన్​ను ప్రశ్నించారు. దాదాపు 7 గంటల పాటు నందును ప్రశ్నించిన ఈడీ అధికారులు... బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. అందులో అనుమానాస్పద లావాదేవీల గురించి అడిగి వివరాలను తెలుసుకున్నారు. నందు ఈనెల 20న ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ... ముందుగా వస్తానని ఈడీ అధికారులను కోరాడు.

ఇందుకు అంగీకరించిన ఈడీ అధికారులు ఈరోజు విచారణకు రావాలని సూచించారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్న నందును ఈడీ అధికారులు ప్రశ్నించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి కెల్విన్, వాహబ్, కుద్దూస్​లను తీసుకొచ్చారు. ఉదయం 5 గంటల సమయంలో ఈడీ అధికారులు కెల్విన్, వాహబ్, కుద్దూస్ ఇంటికి వెళ్లారు. ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించిన అనంతరం ముగ్గురిని కార్యాలయానికి తీసుకొచ్చారు.

ముగ్గురి బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. వీళ్ల ఖాతాలోకి ఇతరుల ఖాతాల నుంచి భారీగా డబ్బు వచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలను ఈడీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. కెల్విన్‌ను 6 గంటలపాటు ప్రశ్నించారు. ఎక్సైజ్ సిట్ అధికారుల దర్యాప్తు కూడా కెల్విన్ కేంద్రంగానే నడిచింది. 2017 జూలై నెలలో కెల్విన్​ను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి రూ.30 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అతని చరవాణిలో ఉన్న నెంబర్ల ఆధారంగా దర్యాప్తు నిర్వహించారు. 

రేపు ఈడీ ముందుకు ముమైత్ ఖాన్..!

ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి, నటి రకుల్ ప్రీత్ సింగ్​లను విచారించారు. ఇవాళ నందును ఈడీ అధికారులు ప్రశ్నించారు. రేపు నటి ముమైత్ ఖాన్, దగ్గుబాటి రానా ఈడీ ముందుకు వచ్చే అవకాశముంది.

అభియోగపత్రం..

ఇదిలా ఉండగా.. మాదక ద్రవ్యాల విక్రేత కెల్విన్​పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు అభియోగపత్రం దాఖలు చేశారు. కెల్విన్​ను 2016లో బోయిన్​పల్లి వద్ద టాస్క్ ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేసి, ఎల్ఎస్​డీ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల వివరాలతో 2016 ఆగస్టులో కెల్విన్​పై బోయిన్​పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సీసీఎస్​లోని నార్కోటిక్స్ విభాగానికి కేసు బదిలీ అయింది. పోలీసులు కెల్విన్​ను లోతుగా విచారణ జరపకపోవడం, సకాలంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయక పోవడంతో బెయిల్​పై విడుదలయ్యాడు. ఆ తర్వాత ఏడాదే మళ్లీ ఎక్సైజ్ పోలీసులు కెల్విన్​ను అరెస్టు చేశారు. ఎక్సైజ్ పోలీసులు కెల్విన్​ను విచారణ జరిపినపుడు టాలీవుడ్ లింకులు సహా అనేక విషయాలు వెలుగు చూశాయి. అయితే అయిదేళ్ల తర్వాత సీసీఎస్​లోని నార్కోటిక్స్ విభాగం ఇటీవల నాంపల్లి కోర్టులో అభియోగపత్రం పత్రం దాఖలు చేశారు. ఛార్జ్ షీట్​ను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు.. అక్టోబర్​ 11న విచారణకు హాజరు కావాలని కెల్విన్​ను ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది.

Last Updated :Sep 7, 2021, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details