తెలంగాణ

telangana

jalshakti Department letter: ఆ 11 ప్రాజెక్టులనూ పరిశీలించాకే నిర్ణయం.. రాష్ట్రానికి జల్​శక్తి శాఖ లేఖ

By

Published : Dec 26, 2021, 5:45 AM IST

Updated : Dec 26, 2021, 6:27 AM IST

jalshakti Department letter: గోదావరి నదీ యాజమాన్య బోర్డు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఆమోదం పొందనివిగా పేర్కొన్న 11 ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టినవేనని, వీటిని ఆమోదం పొందని జాబితా నుంచి తొలగించాలన్న తెలంగాణ విజ్ఞప్తిని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అంగీకరించలేదు. కేంద్ర జలసంఘం ఒక్కో ప్రాజెక్టును పరిశీలించి.. వీటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్‌ అవస్తి రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఇటీవల రాసిన లేఖలో అంశాల వారీగా సమాధానమిచ్చారు.

union jaisakthi department
union jaisakthi department

jalshaktiDepartment letter: గోదావరి పరివాహక ప్రాంతంలోని 11 ప్రాజెక్టుల ఆమోదంపై రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. గోదావరిలో 75 శాతం నీటి లభ్యత కింద ఉన్న 1486.155 టీఎంసీలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే తెలంగాణలో 967.94 టీఎంసీల ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని కేంద్రానికి రాసిన లేఖలో రాష్ట్రం పేర్కొంది. గోదావరి బేసిన్‌లో ఆమోదం లేనివిగా పేర్కొన్న 11 ప్రాజెక్టులు తెలంగాణ ఏర్పడకముందే ప్రారంభమయ్యాయని...ఇందులో 758.76 టీఎంసీల ప్రాజెక్టులను కేంద్ర జలసంఘం ఆమోదించిందని తెలిపింది. మరో 148.82 టీఎంసీల ప్రాజెక్టులకు జలసంఘంలోని హైడ్రాలజీ డైరెక్టరేట్‌ అంగీకారం తెలపగా 60.346 టీఎంసీలను భవిష్యత్తు ప్రాజెక్టులకు రిజర్వుగా పెట్టుకొన్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులకు నీటి లభ్యత సంబంధించినంత వరకు కేంద్ర జలసంఘం ఒక్కో ప్రాజెక్టును వేర్వేరుగా చూస్తుందని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ వివరణ ఇచ్చింది. ఆమోదం తెలిపిన 758.76 టీఎంసీల ప్రాజెక్టుల వివరాలతో పాటు హైడ్రాలజీ డైరెక్టరేట్‌ అంగీకరించిన 148.82 టీఎంసీలకు సంబంధించి కూడా 967.94 టీఎంసీల కేటాయింపు ఉందనడానికి ఆధారం చూపాలని కోరింది. 11 ప్రాజెక్టులలో 5 డీపీఆర్‌లను తెలంగాణ సమర్పించిందని... ఇవి పరిశీలనలో ఉన్నాయని మిగిలిన ఆరింటి వివరాలను ఇస్తే మదింపు చేస్తామని కేంద్రం పేర్కొంది.

'ఆమోదంలేని జాబితా నుంచి తొలగించాలి'

కాళేశ్వరం అదనపు టీఎంసీ పని కొత్తది కాదని.. కేంద్ర జలసంఘం ఈ ప్రాజెక్టుకు కేటాయించిన 240 టీఎంసీలను వినియోగించుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పనులు చేపట్టామని రాష్ట్రం తెలిపింది. దీనికి కేంద్రం ఆమోదం అవసరం లేదని ఆమోదంలేని జాబితా నుంచి తొలగించాలని కోరింది. మొత్తం 240 టీఎంసీల నీటిని వాడుకోవడానికే అదనపు టీఎంసీ పని అయినా, ప్రాజెక్టు నిర్వహణలో మార్పులుంటాయన్న కేంద్రం.. నీటి లభ్యతను అంచనా వేసేందుకు హైడ్రలాజికల్‌ పరిశీలన చేపట్టాలని తెలిపింది. అదనపు టీఎంసీతో సహా అవసరమైన వివరాలను గోదావరి బోర్డుకు అందజేయాలని సూచించింది.

రాష్ట్రం లేఖపై కేంద్రం వివరణ...

గూడెం ఎత్తిపోతల పథకం ఆమోదం పొందిన కడెం ప్రాజెక్టులో భాగమని.. 3,300 ఎకరాల ఆయకట్టుకు నీరందించే కందకుర్తి ఎత్తిపోతల చిన్న పథకమని ఈరెండింటికీ ఆమోదం అవసరం లేదని రాష్ట్రం తెలిపింది. వీటిని గోదావరి బోర్డు పరిశీలించాల్సి ఉందన్న కేంద్రం... రాష్ట్ర ప్రభుత్వం వీటి వివరాలను అందజేయాలని కోరింది. రామప్పలేక్‌-పాకాల లేక్​ లింక్‌ దేవాదులలో భాగమని కొత్తగా అనుమతి అవసరం లేదన్న రాష్ట్ర వాదనపై లేఖలో కేంద్రం వివరణ ఇచ్చింది. తుపాకులగూడెం బ్యారేజీ డీపీఆర్‌లో దీని ప్రస్తావన ఉందని.. గోదావరి బోర్డు, జలసంఘం పరిశీలించాలని కేంద్రం తెలిపింది. తుపాకులగూడెం బ్యారేజి దేవాదుల ఎత్తిపోతలలో భాగం కాబట్టి కొత్తగా ఆమోదం అవసరం లేదని రాష్ట్రం పేర్కొంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను గోదావరి బోర్డుకు, కేంద్ర జలసంఘానికి సమర్పించారన్న కేంద్రం దీనికి సమక్క సాగర్‌ ప్రాజెక్టుగా పేరు పెట్టారని ఇది పరిశీలనలో ఉందని వెల్లడించింది. తుపాకులగూడెం ప్రాజెక్టు ద్వారా కంతనపల్లికి 50 టీఎంసీల వినియోగం సూత్రప్రాయంగా కేటాయించినా అది ఉనికిలో లేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది. ఈ అంశాలను ప్రాజెక్టు డీపీఆర్‌ పరిశీలనలో బోర్డు, జలసంఘం పరిశీలిస్తాయని కేంద్ర జలమంత్రిత్వశాఖ వివరణ ఇచ్చింది.

ఇదీచూడండి:Devadula Lift Irrigation: అడుగడుగునా జాప్యం.. 17 ఏళ్లయినా పూర్తికాని దేవాదుల ఎత్తిపోతల

Last Updated : Dec 26, 2021, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details