తెలంగాణ

telangana

ఔషధనగరిని అడ్డుకుంటాం.. అణగారిన వర్గాలకు అండగా ఉంటాం

By

Published : Oct 12, 2020, 4:56 AM IST

Updated : Oct 12, 2020, 8:04 AM IST

తెరాస పతనం ఔషధనగరి నుంచే మొదలవుతుందని కాంగ్రెస్ నేతలు అన్నారు. కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌, ఔషధనగరి వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఆదివారం నిరసన సభ నిర్వహించారు. రాష్ట్రంలో అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులు, హత్యలు చూస్తుంటే గుండె బరువెక్కుతోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమారెడ్డి పేర్కొన్నారు. పీసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు ప్రీతం అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్‌ ప్రకాశం హాలులో సంకల్పం పేరుతో సభ నిర్వహించారు.

TPCC  protest against Pharma City in Yacharam of Rangareddy district
ఔషదనగరిని అడ్డుకుంటాం.. అణగారిన వర్గాలకు అండగా ఉంటాం

తెలంగాణ ప్రభుత్వం ఔషధనగరి ప్రారంభించడానికి ఏరోజు ముహూర్తం ఖరారు చేసినా రాష్ట్రవ్యాప్తంగా రైతులను సమీకరించి అడ్డుకుంటామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెరాస పతనం ఇక్కడి నుంచే మొదలవుతుందన్నారు. నేటితో (అక్టోబరు 11) ఔషధనగరి ప్రజాభిప్రాయ సేకరణ జరిగి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని బ్లాక్‌డేగా పాటిస్తూ కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌, ఔషధనగరి వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఆదివారం నిరసన సభ నిర్వహించారు. కాంగ్రెస్‌ నేతలు నల్ల కండువాలు ధరించి పాల్గొన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయండి..

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఔషధనగరిని అడ్డుకునేందుకు రాహుల్‌గాంధీ మద్దతు తీసుకుంటామని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే సేకరించిన భూములను రైతులకు తిరిగిస్తామన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయండని.. కానీ, ప్రభుత్వం నిర్ణయించిన సొమ్మును చెల్లించొద్దని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఔషధనగరిని అడ్డుకునే పోరాటంలో పోలీసులు పేల్చే తొలి తూటాను ఎదుర్కొనేందుకు ముందుంటానన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. వెయ్యి మంది రైతులతో దిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద దీక్షలు చేయడానికి సిద్ధం కావాలని సూచించారు.

ఔషధనగరి ఏర్పాటులో కేంద్రం పాత్రే ఎక్కువని, ఇప్పుడు భాజపా నేతలు గ్రామాలకు వచ్చి మొసలికన్నీరు కారుస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఔషధనగరిని వ్యతిరేకిస్తూ కిసాన్‌ సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభలో ఆమోదించారు.

గుండె బరువెక్కుతోంది..

రాష్ట్రంలో అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులు, హత్యలు చూస్తుంటే గుండె బరువెక్కుతోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమారెడ్డి పేర్కొన్నారు. పీసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు ప్రీతం అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్‌ ప్రకాశం హాలులో సంకల్పం పేరుతో సభ నిర్వహించారు. తెరాసకు ఎస్సీ,ఎస్టీలు ఓటు వేయొద్దని కోరుతూ సంకల్పం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో తెరాసను ఓడించాలని, కాంగ్రెస్‌ను గెలిపించాలని ఉత్తమ్​ కోరారు. రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీలను చంపుతున్నారు, ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నారు, భూములు గుంజుకుంటున్నారు, అత్యాచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ కంటే పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. ఎస్సీ,ఎస్టీలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు.

తన భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కుందనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన రైతు నర్సింహా కుటుంబసభ్యులు, హత్యకు గురైన భూపాలపల్లి జిల్లా మల్లారం గ్రామానికి చెందిన రాజబాబు కుటుంబసభ్యులు, సామూహిక అత్యాచారానికి గురైన 13 ఏళ్ల బాలిక కుటుంబసభ్యులు, ఆసిఫాబాద్‌లో ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు. వారిని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓదార్చారు. బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌తో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఇవీ చూడండి:కాంగ్రెస్​ సిద్ధాంతమే సామాజిక న్యాయం: ఉత్తమ్​

Last Updated : Oct 12, 2020, 8:04 AM IST

ABOUT THE AUTHOR

...view details