తెలంగాణ

telangana

Disha Encounter Case: 'ఆ సమయంలో కొన్ని తప్పుగా మాట్లాడాను': విచారణలో సజ్జనార్​

By

Published : Oct 12, 2021, 3:36 PM IST

Updated : Oct 12, 2021, 9:06 PM IST

దిశ కేసులోని నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌(justice sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ ఎండీ, అప్పటి సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ను కమిషన్​ రెండో రోజూ విచారిస్తోంది. ఎన్​కౌంటర్, ఆ తర్వాత పోస్టుమార్టం, మృతదేహాల తరలింపునకు సంబంధించిన వివరాలపై... కమిషన్ తరఫు న్యాయవాదులు సజ్జనార్​ను విచారిస్తున్నారు.

sirpurkar-commission-enquiry-sajjanar-on-disha-encounter-case
sirpurkar-commission-enquiry-sajjanar-on-disha-encounter-case

'దిశ’ అత్యాచార(disha case) కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై ఏర్పాటైన జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌(justice sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ ఎండీ, అప్పటి సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ను కమిషన్​ రెండో రోజూ విచారించింది. ఎన్​కౌంటర్ స్పెషలిస్ట్​ అని మీకు పేరుంది కదా... మీడియాలో ఆ మేరకు కథనాలు కూడా వచ్చాయి కదా అని సిర్పూర్కర్ కమిషన్ అడిగిన ప్రశ్నకు సజ్జనార్ అలాంటిదేమీ లేదని.. తాను ఎన్​కౌంటర్ స్పెషలిస్టును కాదని సున్నితంగా తోసిపుచ్చారు. ఎన్​కౌంటర్ స్పెషలిస్టు అంటే అర్థం ఏమిటనీ కమిషన్ అడిగిన ప్రశ్నకు.... తెలియదని సమాధానమిచ్చారు.

2008లో, 2016లో జరిగిన ఎన్ కౌంటర్లలో మీ పాత్ర ఉందా..? అని కమిషన్ ప్రశ్నించగా.... వరంగల్​లో ఎస్పీగా ఉన్నప్పుడు 2008లో కాకతాళీయంగా ఎన్​కౌంటర్ జరిగిందని... 2016లో జరిగిన ఎన్​కౌంటర్ సమయంలో నేను శాంతిభద్రతల విభాగంలో లేనని సజ్జనార్ సమాధానమిచ్చారు. 2019 డిసెంబర్ 6న ఉదయం జరిగిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ గురించి శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి చెప్పారని స్పష్టం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే చటాన్​పల్లిలోని ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సజ్జనార్ వివరించారు.

మెజిస్ట్రేట్​ సమక్షంలోనే పంచనామా..

సైబరాబాద్ కమిషనరేట్​కు న్యాయసలహాదారుగా వ్యవహరిస్తున్న అడ్వకేట్ సూచన మేరకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సమక్షంలో పంచనామా నిర్వహించినట్లు సజ్జనార్ సూచించారు. దిశ నిందితులు పోలీసుల నుంచి లాక్కుపోయిన రెండు తుపాకులు అన్​లాక్ చేసి ఉన్నాయని.. దిశకు సంబంధించిన చరవాణితో పాటు పవర్ బ్యాంకు స్వాధీనం చేసుకున్నామని విలేకరుల సమావేశంలో వెల్లడించారు కదా.. అని ప్రస్తావించగా.. పొరపాటున తప్పు చెప్పానని సజ్జనార్ ఒప్పుకున్నారు. మాతృభాష తెలుగు కాకపోవడంతో విలేకరుల సమావేశంలో కొన్ని తప్పులు దొర్లాయని సజ్జనార్ కమిషన్​కు వివరణ ఇచ్చారు.

కొనసాగుతోన్న విచారణ...

దిశ హత్యాచారం, నిందితుల అరెస్ట్, ఆ తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారించే ప్రక్రియను అంతా శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి పర్యవేక్షించారని సజ్జనార్ కమిషన్​ను తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను.. ప్రతి రోజు జరిగే సెట్ కాన్ఫరెన్స్​లో ప్రకాశ్ రెడ్డి వివరించారని పేర్కొన్నారు. ఎన్​కౌంటర్ జరిగిన తర్వాత పోస్టుమార్టం, మృతదేహాల తరలింపునకు సంబంధించిన వివరాలపై... కమిషన్ తరఫు న్యాయవాదులు సజ్జనార్​ను విచారిస్తున్నారు.

మొదటి రోజు విచారణలో...

దిశ హత్యాచార ఘటన గురించి శంషాబాద్ డీసీపీ తనకు చెప్పాడని.. కేసును అతనే పర్యవేక్షించాడని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (RTC MD Sajjanar) సిర్పుర్కర్ కమిషన్ (justice sirpurkar commission)​కు మొదటిరోజు విచారణలో వివరించారు. నిందితులను గాలించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారని.. కేసు పురోగతి గురించి శంషాబాద్ డీసీపీ ప్రతి రోజు ఉదయం జరిగే సెట్ కాన్ఫరెన్స్​లో చెప్పాడని సజ్జనార్ కమిషన్​కు తెలిపారు. ట్రాఫిక్ పర్యవేక్షణలో భాగంగా 2019 నవంబర్ 29న శంషాబాద్ విమానాశ్రయం వరకు వెళ్లి వస్తుంటే.. అదే రోజు నిందితులను పట్టుకున్న విషయాన్ని డీసీపీ చెప్పడంతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు మీడియాకు తెలిపానని కమిషన్ తరఫు న్యాయవాది అడిగిన ప్రశ్నకు సజ్జనార్ సమాధానమిచ్చారు.

పలువురి విచారణ పూర్తి..

కమిషన్ సభ్యులు ఇప్పటికే హోంశాఖ కార్యదర్శి రవిగుప్త, సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్, దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డితో పాటు పోస్టుమార్టం నిర్వహించిన దిల్లీ ఎయిమ్స్, గాంధీ ఆస్పత్రి వైద్యులు, క్లూస్​ టీం అధికారి వెంకన్నను విచారించారు. మృతుల కుటుంబ సభ్యుల వాంగ్మూలం కూడా నమోదు చేశారు. దిశ నిందితుల ఎన్​కౌంటర్(Disha encounter case)​ సయమంలో ఎదురుకాల్పుల్లో గాయపడ్డ పోలీసులకు చికిత్స అందించిన కేర్​ ఆస్పత్రి వైద్యుడిని కూడా కమిషన్​ విచారించింది. షాద్​నగర్ కోర్టు న్యాయమూర్తి శ్యాంప్రసాద్ రావును కూడా కమిషన్ విచారించింది.

సంబంధిత కథనాలు:

Last Updated : Oct 12, 2021, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details