తెలంగాణ

telangana

Mirchi Price in Telangana : కొద్ది పంటకే గరిష్ఠ ధర.. మిగతా సరుకుకు 30-40% తగ్గింపు

By

Published : Jan 31, 2022, 7:19 AM IST

Updated : Jan 31, 2022, 9:05 AM IST

Mirchi Price in Telangana : ఓవైపు అకాల వర్షాలు.. మరోవైపు తామర పురుగు.. ఇంకోవైపు ఇతర తెగుళ్లతో మిర్చి పంట దిగుబడి తగ్గిపోయిందని రైతు బాధపడుతోంటే.. పండిన పంటకు కూడా సరైన ధర లేదని కుమిలిపోతున్నాడు. మార్కెట్​లో మిర్చి గరిష్ఠ ధర క్వింటాకు రూ.26వేల వరకు పలుకుతున్నా.. కొంత పంటకు మాత్రమే గరిష్ఠ ధర ఇస్తూ.. మిగతా సరుకుకు క్వింటాకు ఏకంగా రూ.5 వేల వరకు తగ్గిస్తున్నారని మిర్చి రైతు వాపోతున్నాడు. తమకున్న భూముల్లో మిర్చి వేస్తే అధిక దిగుబడి వచ్చి.. కాస్త లాభపడతామనుకుంటే.. ఓ వైపు ప్రకృతి.. మరోవైపు మార్కెట్ యాజమాన్యం తమ పొట్ట కొడుతున్నారని మిర్చి రైతులు ఆవేదన చెందుతున్నారు.

Mirchi Price in Telangana
Mirchi Price in Telangana

మిర్చి ధర పెరిగినా.. రైతుకు దిగులే

Mirchi Pricein Telangana : మార్కెట్‌లో మిర్చి గరిష్ఠ ధరలు క్వింటాకు రూ.18 వేల నుంచి 26 వేల వరకూ పలుకుతున్నా.. రాష్ట్రంలో ఎక్కువ మంది మిరప రైతులు సంతోషంగా లేరు. ఈ గరిష్ఠ ధరలు కొద్ది పంటకే దక్కుతుండడం, మిగతా సరకుకు క్వింటాకు ఏకంగా రూ.4-5 వేలు తగ్గిస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Red Chilli Price in Telangana : ఈ ఏడాది రాష్ట్రంలో భారీ ఎత్తున 3.59 లక్షల ఎకరాల్లో (సాధారణ విస్తీర్ణం 2.60 లక్షల ఎకరాలు) రైతులు మిరప సాగుచేశారు. దిగుబడి సైతం 7.71 లక్షల టన్నులు వస్తుందని 2 నెలల క్రితం మార్కెటింగ్‌ శాఖ అంచనా వేసింది. అనంతరం అధిక వర్షాలు, తామర పురుగుతో పాటు, ఇతర తెగుళ్లు ఆశించడంతో దిగుబడి 30-40 శాతం తగ్గుతుందని యంత్రాంగం అంచనాకు వచ్చింది. నాణ్యత సైతం తగ్గుతోంది.

Maximum Price for Mirchi in Telangana : రాష్ట్రంలో పెద్దవైన వరంగల్‌, ఖమ్మం మార్కెట్లకు ఇప్పటికే పెద్ద ఎత్తున పంట వస్తోంది. ఇందులో ప్రతి రోజూ గరిష్ఠ ధరతో కొంత సరకు కొని.. మిగతా పంటకు 30 నుంచి 40 శాతం తక్కువ ధర చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఈ నెల 24 వరకూ మార్కెట్లకు 20 వేల టన్నుల ఎండు మిర్చి వచ్చింది. గతేడాది ఇదే సమయానికి 6,162 టన్నులు వచ్చింది. ఈసారి చాలా ఎక్కువ పంట వచ్చినట్లు కనిపిస్తున్నా.. 4,500 టన్నులు గతేడాది నుంచి గోదాముల్లో నిల్వ చేసిన పంట అని మార్కెటింగ్‌ శాఖ పరిశీలనలో గుర్తించారు. నగరాల్లో మాల్స్‌ నిర్వాహకులు మార్కెట్లకు వచ్చి వండర్‌హాట్‌, బ్యాడిగి, తేజ వంటి 3, 4 రకాలను అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. వీటి దిగుబడి తక్కువగా ఉన్నందున అధిక ధర వస్తోందని, మిగతా రకాలకు అంత ధర రాకపోవచ్చని మార్కెటింగ్‌ వర్గాలువిశ్లేషిస్తున్నాయి.

వచ్చే 2 నెలల్లో ధరలే కీలకం!

Telangana Mirchi Farmers Problems : రాష్ట్రంలో రైతులు ఈ ఏడాది 22 రకాల మిరప వంగడాలను సాగుచేశారు. వీటిలో యూఎస్‌341, వండర్‌ హాట్‌, బ్యాడిగ, తేజ రకం సరకును మార్కెట్‌లో ఇటీవల క్వింటాకు రూ.18 వేల నుంచి 26 వేల వరకూ చెల్లించి వ్యాపారులు కొన్నారు. నాణ్యత లేని రకాలకు అతి తక్కువగా క్వింటాకు రూ.3 వేల నుంచి 12 వేల వరకూ ఇస్తున్నారు. ధరల కోతపై ఇటీవల రైతులు వరంగల్‌ మార్కెట్‌లో ధర్నా సైతం చేశారు. ఎకరా సాగుకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర పెట్టుబడి పెడితే చివరికి నష్టాలు మిగులుతున్నాయని వాపోయారు. అయితే మిరప పంట గత నెల రోజుల నుంచే మార్కెట్‌కు రావడం మొదలైందని, రాబోయే రెండు నెలలు పెద్దఎత్తున వస్తుందని, అప్పుడు వచ్చే ధరలు కీలకమని మార్కెటింగ్‌ అధికారులు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated :Jan 31, 2022, 9:05 AM IST

ABOUT THE AUTHOR

...view details