తెలంగాణ

telangana

తుదిదశకు జాతీయ పార్టీ ఏర్పాటు కసరత్తు, నేడు ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

By

Published : Oct 2, 2022, 6:39 AM IST

Updated : Oct 2, 2022, 8:23 AM IST

KCR National Party updates: జాతీయపార్టీ ఏర్పాటుపై నేడు తెరాసనేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పేరు, జెండా, అజెండాపై స్పష్టతనిచ్చే అవకాశముంది. జాతీయపార్టీ ప్రకటన తర్వాత నిర్వహించాల్సిన కార్యక్రమాలపైనా దిశానిర్దేశం చేయనున్నారు. ఈనెల 5న తెరాస విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి మద్దతుగా తీర్మానం చేయనున్నారు. అదేరోజు ప్రగతి భవన్‌లో వివిధరాష్ట్రాల నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

KCR National Party updates
KCR National Party updates

KCR National Party updates: జాతీయపార్టీ ఏర్పాటుపై తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు తుదిదశకు చేరింది. ముఖ్యనేతలతో నేడు సమావేశం నిర్వహించి.. సమాలోచనలు చేయనున్నారు. అందుకోసం రాష్ట్ర మంత్రులు, తెరాస జిల్లాల అధ్యక్షులను ప్రగతిభవన్‌లో మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. భోజన అనంతరం పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమై కీలక అంశాలను చర్చించనున్నారు.

దసరారోజు జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసేందుకు గులాబీ దళపతి సిద్ధమవుతున్నారు. అదేరోజు తెరాస ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు, రాష్ట్రకార్యవర్గ సమావేశం జరగనుంది. జాతీయపార్టీ ఏర్పాటు చేయాలని తెరాస విస్తృతస్థాయి సమావేశం తీర్మానం చేయనుంది. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే 33 జిల్లాల అధ్యక్షులు ముక్తకంఠంలో కోరారు. ఐతే ఇప్పటివరకు ఈ అంశాలపై సమాలోచనలు మాత్రమే చేస్తున్న కేసీఆర్.. పార్టీ నేతలకు వివరాలు వెల్లడించలేదు. నేటి సమావేశంలో జాతీయ పార్టీ పేరు, జెండా, అజండా వంటి అంశాలపై తుదిచర్చలు జరిపి నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

ఈనెల 6 లేదా 7న బహిరంగ సభ: జాతీయపార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసినప్పటి నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఫ్లెక్సీలు బాణాసంచా సందడి వంటి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పార్టీ నేతలతో కార్యచరణ సిద్ధం చేయనున్నారు. దసరారోజు వివిధరాష్ట్రాలకు చెందిన రైతు,కార్మికసంఘాలు, పార్టీలనేతల్ని ప్రగతిభవన్‌లో భోజనానికి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 6 లేదా 7న భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు.

స్పష్టత వస్తుందా..!: జాతీయపార్టీకి భారత రాష్ట్రీయ సమితి, నవభారత్ పార్టీ వంటి పేర్లను పరిశీలించిన కేసీఆర్ ఇవాళ పార్టీలతో చర్చించి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఐతే రాష్ట్రస్థాయిలో తెలంగాణ రాష్ట్ర సమితి కొనసాగుతుందా లేదా తెరాస పేరునే మార్చబోతున్నారా అనే విషయంపైనా నేడు స్పష్టతరానుంది. జాతీయ పార్టీకి గులాబీ జెండా, కారు గుర్తునే కొనసాగించాలని దాదాపు నిర్ణయించారు.

ఇక సుడిగాలి పర్యటనలు:దేశమంతటా తెలంగాణ మోడల్ అనే నినాదం, అజెండాతో తొలి అడుగువేసేందుకు గులాబీదళపతి సిద్ధమవుతున్నారు. భాజపా, కాంగ్రెస్‌కి సమదూరం పాటిస్తూ వివిధ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలకు కేసీఆర్ ప్రణాళికలు చేస్తున్నారు. పర్యటనల కోసం సొంతంగా విమానం కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. భాజపా, కేంద్రంపై ప్రధానంగా దాడిచేస్తూ రైతు, దళిత, కార్మిక,యువత, మహిళల అంశాలపై ఉద్యమానికి శ్రీకారంచుట్టేలా వ్యూహాలు రచించారు. పలురాష్ట్రాలకు సమన్వయకర్తల్ని నియమించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు, విరాళాల సేకరణ వంటి కార్యక్రమాలను వివిధ దశల్లో చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated :Oct 2, 2022, 8:23 AM IST

ABOUT THE AUTHOR

...view details