తెలంగాణ

telangana

'ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకం... పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయండి'

By

Published : Mar 6, 2022, 10:10 AM IST

AP Assembly Session: సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సభ్యులకు పటిష్ఠ భద్రతా ఏర్పాటు చేయాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. ఈ అసెంబ్లీ ప్రస్తుత సమావేశాలకు ఎంతో ప్రత్యేకత ఉందనే విషయాన్ని అధికారులు గుర్తించాలని పేర్కొన్నారు. ప్రజలందరి దృష్టి ఈ సమావేశాలపై ఉంటుందన్నారు.

AP Assembly Session
AP Assembly Session

AP Assembly Session: సభలో సభ్యులు అడిగే ప్రతీ ప్రశ్నకూ సమాధానాలు పంపడం ద్వారా వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ శాఖల అధికారులపై ఉందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం, శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేను రాజు స్పష్టం చేశారు. సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శనివారం అసెంబ్లీ కమిటీహాలులో వివిధ ప్రభుత్వ శాఖలు, పోలీసు ఉన్నతాధికారులతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు.

ప్రతి ఒక్కరి దృష్టి ఈ సమావేశాలపైనే: సభాపతి సీతారాం

అసెంబ్లీ ప్రస్తుత సమావేశాలకు ఎంతో ప్రత్యేకత ఉందనే విషయాన్ని అధికారులు గుర్తించాలని ఏపీ శాసనసభాపతి సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజలందరి దృష్టి ఈ సమావేశాలపై ఉంటుందన్నారు. సభలో అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఇవ్వడం ద్వారా సభ్యుల గౌరవాన్ని కాపాడటంలోనే గౌరవం ఉందనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. శాసనసభ్యులు అడిగిన ప్రశ్నల్లో పురపాలక, ఆర్థిక, పౌరసరఫరాలు, హోం శాఖల నుంచి రావాల్సిన సమాధానాలే ఎక్కువగా పెండింగులో ఉన్నాయని వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సమావేశాలకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీని ఆదేశించారు. సచివాలయం చుట్టూ ఖాళీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో నాలుగువైపులా పటిష్ఠమైన బందోబస్తుతో పాటు అధునాతన సమాచార, సాంకేతిక వ్యవస్థతో గట్టి నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు, శాసనమండలి ఓఎస్‌డీ కె.సత్యనారాయణరావు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.

విద్య, ఆర్థిక శాఖల సమాధానాలే ఎక్కువ పెండింగ్‌: ఛైర్మన్‌ మోషేను రాజు

సభ్యులకు సకాలంలో సమాధానాలు ఇచ్చే సత్సంప్రదాయాన్ని అధికారులు కొనసాగించాలని ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ మోషేను రాజు చెప్పారు. గత సమావేశాల్లో మండలి సభ్యుల ప్రశ్నలకు పాఠశాల విద్య, ఆర్థికశాఖల నుంచి రావాల్సిన సమాధానాలు ఎక్కువగా పెండింగులో ఉన్నాయన్నారు. గతంలో అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలను ఈ సమావేశాలు పూర్తయ్యేలోపు పంపాలని అధికారులను ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో సమావేశాలు కొనసాగేలా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఏపీ డీజీపీ రాజేంద్రనాథరెడ్డిని ఛైర్మన్‌ ఆదేశించారు. సభ్యులు బసచేసే ప్రాంతాల్లో, వారు సమావేశాలకు హాజరయ్యేందుకు అసెంబ్లీకి వచ్చేంతవరకు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీల వైద్యబిల్లుల చెల్లింపుపై ఆర్థికశాఖ ప్రత్యేకదృష్టి సారించాలని సూచించారు.

ఇదీచూడండి:Governor Vs Government: 'ప్రభుత్వ వివరణ హాస్యాస్పదంగా ఉంది'

ABOUT THE AUTHOR

...view details