తెలంగాణ

telangana

CM KCR: సచివాలయ పనులను వేగవంతం చేయండి: కేసీఆర్​

By

Published : Aug 7, 2021, 2:42 PM IST

Updated : Aug 7, 2021, 8:12 PM IST

cm-kcr-inspect-new-secretariat-construction-works
cm-kcr-inspect-new-secretariat-construction-works

14:41 August 07

సచివాలయ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్​

  నిర్మాణంలో ఉన్న నూతన సచివాలయ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రహదార్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఆర్కిటెక్టులు, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి సచివాలయ ప్రాంతాన్ని సీఎం సందర్శించారు. సచివాలయ ప్రాంగణం అంతా కలియతిరిగారు. పనులు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించిన కేసీఆర్... ఇంజినీర్లు, అధికారుల ద్వారా పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఆయా పనులు పూర్తయ్యే సమయం, తదితర వివరాలను ఆరా తీశారు. 

   అనంతరం సచివాలయ ప్రాంగణంలోనే పనుల పురోగతిపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. పనులు జరుగుతున్న తీరు, లక్ష్యాలు, తదితరాలపై సమీక్షించిన ముఖ్యమంత్రి.. పనులను మరింత వేగవంతం చేయాలని చెప్పారు. సచివాలయం వెలుపల రెయిలింగ్ ఉన్న ప్రాంతాన్ని సైతం సీఎం కేసీఆర్ పరిశీలించారు. 

6 అంతస్తుల్లో

హుస్సేన్​సాగర్‌కు అభిముఖంగా 6 అంతస్తుల్లో... 6 నుంచి 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సమీకృత భవనాన్ని నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి... మంత్రుల కార్యాలయాలు, పేషీలు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, విభాగాలన్నింటినీ అనుసంధానించేలా నిర్మాణం చేపట్టారు. ఒక శాఖకు చెందిన మొత్తం వ్యవస్థ ఒకే చోట ఉండేలా ప్రణాళిక రూపొందించారు. విశాలమైన సమావేశ మందిరాలు, హాళ్లు, వరండాలతో సచివాలయం నిర్మిస్తున్నారు. అన్ని హంగులతో..అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి లోపాలు లేకుండా అత్యాధునిక హంగులతో ఈ భవనాన్ని కడుతున్నారు.  

సెన్సార్ పరిజ్ఞానం

సమీకృత భవనాన్ని కేవలం సచివాలయ కార్యాలయాల కోసం మాత్రమే నిర్మితమవుతుంది. బ్యాంకులు, తపాలా కార్యాలయం, శిశు సంరక్షణా కేంద్రం, ఆసుపత్రి, క్యాంటీన్లు, ప్రార్థనా మందిరాల్ని దక్షిణం వైపు విడిగా నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులకు ఉత్తరం వైపు, ఉద్యోగులకు తూర్పు దిశలో సందర్శకులకు దక్షిణం వైపు ప్రత్యేకంగా ప్రవేశద్వారాలు ఏర్పాటు చేస్తారు. పర్యావరణహితం..పూర్తి పర్యావరణహితంగా, గ్రీన్ బిల్డింగ్స్ ప్రమాణాలకు అనుగుణంగా భవన నిర్మాణం జరగుతోంది. దారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా నిర్మాణం చేపడుతున్నారు. పూర్తి ఆటోమేటిక్ విధానాన్ని, సెన్సార్ పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు.  

విడిగా పార్కింగ్ వసతి

సౌరవిద్యుత్, వాననీటి సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. విశాలమైన పచ్చికబయళ్లతో అందమైన ఫౌంటెన్లు సహా వాహనాలు నిలిపేందుకు బహుళ అంతస్థుల పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తారు. ఉద్యోగుల వాహనాలకు, సందర్శకుల వాహనాల కోసం విడిగా పార్కింగ్ వసతి కల్పిస్తారు. వచ్చే రాష్ట్రావతరణ దినోత్సవం నాటికి సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి:National Handloom Day: తెలంగాణ నేతన్న దేశంలోనే ప్రత్యేకం: కేటీఆర్

Last Updated :Aug 7, 2021, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details