తెలంగాణ

telangana

ఎంపీ సెల్‌ఫోన్‌ మిస్సింగ్‌.. సెల్ఫీ దిగిన మహిళ ఇంట్లో సోదాలు.!

By

Published : Jul 6, 2022, 8:49 AM IST

MP Bharat Mobile Missing : ఏపీలోని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ సెల్‌ఫోన్ చోరీకి గురవ్వడం.. ఓ మహిళను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. మంత్రి రోజాను విమానం ఎక్కించేందుకు ఎంపీ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి డ్వాక్రా ఉత్పత్తుల స్టాల్​ను సందర్శించారు. ఈ క్రమంలో ఎంపీతో.. ఓ మహిళ సెల్ఫీ తీసుకున్నారు. అదే ఆమెకు అపవాదు తెచ్చిపెట్టింది.

MP Mobile Missing
MP Mobile Missing

MP Bharat Mobile Missing : ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్‌ సెల్‌ఫోన్‌ మిస్సింగ్‌పై వివాదం చోటుచేసుకుంది. ఏపీ రాష్ట్ర మంత్రి రోజాకు వీడ్కోలు పలికేందుకు మంగళవారం ఆయన రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ ఓ మహిళ ఆయనతో సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం తన సెల్‌ఫోన్‌ చోరీకి గురైందని కోరుకొండ పోలీసులకు ఎంపీ ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. సిగ్నల్స్‌ ఆధారంగా గాడాల సమీపంలోని ఓ కాలనీలో నివసిస్తున్న శిరీష ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో వెతికినా ఫోన్‌ కనిపించకపోవడంతో వెనుతిరిగారు. ఈ సంఘటనపై శిరీష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును దుయ్యబట్టారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, మహిళనని చూడకుండా పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఇంట్లో దుస్తులు, సామగ్రి కింద పడేశారని తెలిపారు. తనకు జరిగిన అవమానంపై ముఖ్యమంత్రి కార్యాలయానికి, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు. సెల్‌ఫోన్‌ కనిపించడం లేదని ఎంపీ ఫిర్యాదు చేయడంతో సెల్‌టవర్‌ సిగ్నల్స్‌ ఆధారంగా శిరీష ఇంటికి వెళ్లి అడిగామని ఎస్సై కట్టా శారదాసతీష్‌ తెలిపారు. ఆమె ఇంట్లో ఉన్న మహిళలతోనే తనిఖీలు నిర్వహించామని, దురుసుగా ప్రవర్తించలేదని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details