తెలంగాణ

telangana

Loan App Case: 12 సంస్థలకు చెందిన 105 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌ జప్తు..

By

Published : Aug 3, 2022, 7:48 PM IST

Loan App Case in Hyderabad: లోన్​యాప్​ కేసు వ్యవహారంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో తాజాగా ఈడీ అధికారులు పలు రుణ సంస్థలకు చెందిన ఆస్తులను అటాచ్​ చేశారు. ఆయా సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న 105 కోట్ల రూపాయలను జప్తు చేశారు.

105 crore bank balance of 12 companies was confiscated by ED in Loan App Case
105 crore bank balance of 12 companies was confiscated by ED in Loan App Case

Loan App Case in Hyderabad: లోన్​ యాప్ కేసులో ఈడీ అధికారులు పలు రుణ సంస్థలకు చెందిన ఆస్తులను అటాచ్ చేశారు. 12 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు, ఫిన్ టెక్ సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న 105 కోట్ల రూపాయలను జప్తు చేశారు. ఇండిట్రేడ్ ఫిన్​కార్ప్, అగ్లో ఫిన్​ట్రేడ్​తో పాటు మరో 10 సంస్థలకు చెందిన 233 బ్యాంకు ఖాతాలను గుర్తించిన ఈడీ అధికారులు.. ఆయా ఖాతాల్లోని నగదును జప్తు చేశారు. దివాలా తీసిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లతో కొన్ని ఫిన్​టెక్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఫిన్​టెక్ సంస్థల వెనుక కొంతమంది చైనీయులున్నట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది.

చైనా నుంచి ఫిన్​టెక్ సంస్థల ద్వారా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లలో పెట్టుబడులు పెట్టారు. లోన్ యాప్స్ రూపొందించి... వాటి ద్వారా స్వల్పకాలిక రుణాలు ఇచ్చారు. 7 నుంచి 30 రోజుల్లో చెల్లించే విధంగా అతి తక్కువ వ్యవధిలోనే రుణాలు మంజూరు చేశారు. లోన్ యాప్ డౌన్​లోడ్ చేసుకొని అందులో కేవలం ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ నమోదు చేస్తే రుణాలు మంజూరు చేశారు. 12 సంస్థలు కలిసి ఏకంగా 4430 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చినట్లు ఈడీ అధికారులు తేల్చారు. 819 కోట్ల రూపాయల లాభం ఆర్జించినట్లు గుర్తించారు. అత్యధిక వడ్డీ వసూలు చేస్తూ రుణగ్రహీతలను పీడించారు. రుణం తిరిగి చెల్లించని వాళ్ల సామాజిక మాధ్యమ ఖాతాలను తీసుకొని వాటికి ఇష్టారీతిన సందేశాలు పంపించారు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది.

హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్​లో లోన్ యాప్ ఆగడాలపై 3 ఎఫ్ఐఆర్​లు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్​ల ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదివరకు 4 ఎన్బీఎఫ్సీలకు చెందిన 158.9 కోట్ల రూపాయలను ఈడీ అధికారులు జప్తు చేశారు. ఇప్పటి వరకు ఈడీ అధికారులు లోన్ యాప్​ల వ్యవహారంలో మొత్తం 264.3 కోట్ల రూపాయలను జప్తు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details