తెలంగాణ

telangana

ఉద్యోగులకు 'యాహూ' బిగ్​ షాక్​.. 20 శాతం మంది ఇంటికి..

By

Published : Feb 10, 2023, 12:43 PM IST

ప్రముఖ టెక్​ దిగ్గజం యాహూ తమ ఉద్యోగులకు షాక్​ ఇచ్చింది. తమ సంస్థలోని యాడ్​ టెక్​ విభాగంలో 20 శాతం మంది ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో తక్షణమే 12 శాతం మంది జాబర్లకు లేఆఫ్​లు ఇవ్వగా.. మిగతా 8 శాతం మందిని వచ్చే ఆరు నెలల్లో తొలగిస్తామని తెలిపింది.

yahoo layoffs
యాహూ లేఆఫ్స్

టెక్‌ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల పరంపర కొనసాగుతోంది. తాజాగా యాహూ సైతం తమ సిబ్బందిని తగ్గించుకోనున్నట్లు ప్రకటించింది. దాదాపు 20 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు గురువారం ప్రకటించింది. ముఖ్యంగా యాడ్‌- టెక్‌ విభాగంలోని ఉద్యోగుల్లో సగం మంది ఇంటిబాట పట్టనున్నారు.

గురువారం ఆఫీసు కార్యకలాపాలు ముగిసే సమయానికే కంపెనీలో 12 శాతం అంటే 1,000 మందిని తొలగిస్తున్నట్లు యాహూ తమ ఉద్యోగులకు తెలియజేసింది. మరో 8 శాతం అంటే 600 మందికి వచ్చే ఆరు నెలల్లో ఉద్వాసన పలుకుతామని పేర్కొంది. ఆర్థిక పరిస్థితుల వల్ల ఉద్యోగులను తొలగించడం లేదని యాహూ సీఈఓ జిమ్‌ లైన్‌జోన్‌ చెప్పడం గమనార్హం. లాభదాయకతలేని కంపెనీ బిజినెస్‌ అడ్వర్టైజింగ్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తమ కీలక ప్రకటనల వ్యాపారమైన డీఎస్‌పీలో పెట్టుబడులను తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు యాహూ తెలిపింది. ద్రవ్యోల్బణం, మాంద్యం నేపథ్యంలో చాలా సంస్థలు వాణిజ్య ప్రకటనలపై వ్యయాన్ని భారీగా తగ్గించుకుంటున్నాయి. యాహూ ను 2021లో ప్రైవేటు ఈక్విటీ సంస్థ ‘అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌’ ఐదు బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details