Upcoming Electric Scooter In India 2023 : భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకున్న ఈవీ తయారీ సంస్థలు.. వినియోగదారుల కోసం సరికొత్త స్కూటర్లను రూపొందిస్తున్నాయి. దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థలు సైతం ఈ స్కూటర్లను తయారు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వాటిలో కొన్ని సంస్థలు వాహనాలకు అన్ని రకాల ట్రయల్స్ను పూర్తి చేసి.. కొద్ది రోజుల్లోనే వాటిని విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. కాగా త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే.. ఐదు వాహనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ..
కొద్ది వారాల్లోనే ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ను వినియోగదారులు ముందుకు తీసుకురానుంది టీవీఎస్. సరికొత్త ఫీచర్లతో తయారు చేసిన 'టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ'ని 2023 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించింది సంస్థ. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందన్న ఆంచనాలతో వస్తుంది టీవీఎస్. 4.56kWh బ్యాటరీ సామర్థ్యాన్ని ఈ స్కూటర్ కలిగి ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. దాదాపు 145 కిలోమీటర్లు వరకు ప్రయాణం చేయవచ్చు. 'టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ' స్కూటర్ గరిష్ఠంగా 82 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వాయిస్ అసిస్ట్ వంటి కొత్త అదనపు ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
సుజుకి ఈ-బర్గ్మాన్..
సుజుకి ఈ-బర్గ్మాన్ స్కూటర్ను 2023 మార్చిలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది సంస్థ. భారత్లో దీని టెస్ట్ రైడ్లు సైతం చాలా సార్లు జరిగాయి. అన్నీ సవ్యంగా సాగితే.. 2024లో సుజుకి ఇ-బర్గ్మాన్ స్కూటర్ భారత రోడ్లపై చూడొచ్చు. కాకపోతే దీని విడుదలకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. స్కూటర్ ఫీచర్ల గురించి కూడా పూర్తి వివరాలు వెల్లడికాలేదు. 4kW బ్యాటరీ సామర్థ్యంతో స్కూటర్ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 44 కిలో మీటర్లు వరకు ప్రయాణం చేయవచ్చని సమాచారం. గరిష్ఠ వేగం 60 కిలోమీటర్లు.
రెండు కొత్త హోండా ఎలక్ట్రిక్ స్కూటర్లు..
ఈవీ వాహనాల తయారీ రంగంలోకి హోండా కూడా ప్రవేశించింది. 2024లో రెండు విద్యుత్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సంస్థ సిద్ధమైంది. ఈ రెండు ఈవీ స్కూటర్లను భారత్లోనే తయారు చేస్తోంది హోండా. మొదటి స్కూటర్కు యాక్టివా ఎలక్ట్రిక్ అని పేరు పెట్టే అవకాశం ఉంది. మొదటి స్కూటర్ ఫిక్స్డ్ బ్యాటరీని కలిగి ఉంటుందని.. రెండో స్కూటర్ మార్చుకునే బ్యాటరీతో వస్తుందని సమాచారం.
యమహా ఎలక్ట్రిక్ స్కూటర్- నియో, E01..
ఈ మధ్యకాలంలో జరిగిన తమ డీలర్ల ఈవెంట్లో 'నియో' ఈ స్కూటర్ను ప్రదర్శించింది యమహా. త్వరలోనే భారత మార్కెట్లోకి సైతం స్కూటర్ను విడుదల చేయనుంది. అయితే దీనికి సంబంధించిన కచ్చితమైన వివరాలు మాత్రం వెల్లడికావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రెండు ఈవీ స్కూటర్ల ఉత్పత్తి జరుగుతూనే ఉంది. ఈ రెండు స్కూటర్లు ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'నియో'ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 60 నుంచి 70 కిలోమీటర్లు వరకు ప్రయాణం చేయవచ్చు.
యమహా ఎలక్ట్రిక్ స్కూటర్- నియో
యమహా ఎలక్ట్రిక్ స్కూటర్-E01
రివర్ ఈ-స్కూటర్..
రివర్ ఈ స్కూటర్ను బెంగళూరు కేంద్రం పనిచేసే.. ఓ స్టార్టప్ కంపెనీ తయారు చేస్తోంది. తమ మొదటి స్కూటర్ను 2023 మధ్యకాలంలో.. భారత్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది సంస్థ. కొద్ది రోజుల క్రితమే ఈ స్కూటర్ టెస్ట్ రైడ్ సైతం పూర్తి చేసుకుంది. సాధారణ టైర్లతో పోలిస్తే.. రివర్ ఈ స్కూటర్ టైర్లు కాస్త పెద్దవిగా ఉంటాయి. స్కూటర్కు సంబంధించిన మరిన్ని ఫీచర్లు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.