తెలంగాణ

telangana

వీడని యుద్ధ భయాలు.. సెన్సెక్స్​ 1,491 పాయింట్లు పతనం

By

Published : Mar 7, 2022, 3:37 PM IST

Updated : Mar 7, 2022, 4:03 PM IST

ఉక్రెయిన్​పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1,491 పాయింట్లు, నిఫ్టీ 382 పాయింట్లు క్షీణించాయి.

stock markets closing news
స్టాక్​ మార్కెట్ వార్తలు

Stock market news: Stock market news: స్టాక్​ మార్కెట్లు సోమవారం సెషన్​ను భారీ నష్టాలతో ముగించాయి. ఉక్రెయిన్‌-రష్యా పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఉక్రెయిన్‌లో రష్యా దాడుల తీవ్రతను పెంచింది. చమురు బ్యారెల్‌ ధర 130 డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు అలముకున్నాయి. రష్యాపై ఇప్పటి వరకు కఠిన ఆర్థిక ఆంక్షలు ప్రయోగించిన పాశ్చాత్య దేశాలు.. తాజాగా ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న చమురునూ ఆంక్షల పరిధిలోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే వాహనరంగాన్ని కలవరపెడుతున్న చిప్‌ల కొరత మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు మదుపర్లను తీవ్రంగా ప్రభావితం చేశాయి.

రూపాయి విలువ ఈరోజు జీవితకాల కనిష్ఠానికి పతనమైంది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు ఎగబాకడంతో పాటు బాండ్లు, స్టాక్స్‌ ధరలు పడిపోవడంతో రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ఈ రోజు దాదాపు 1 శాతం మేర నష్టపోయిన రూపాయి డాలరుతో పోలిస్తే మారకం విలువ 76.96 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది.

దీంతో బీఎస్​ఈ సెన్సెక్స్ 1,491 పాయింట్లు కోల్పోయి 52,843 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా అదే బాటలో పయనించి 382 పాయింట్ల నష్టంతో 15,863 వద్ద స్థిరపడింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 53,204 పాయింట్ల అత్యధిక స్థాయి, 52,367 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,945 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,711 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

భారతీ ఎయిర్​టెల్​, హెచ్​సీఎల్​ టెక్​, టాటా స్టీల్​, ఇన్ఫోసిస్​ షేర్లు లాభాలను ఆర్జించాయి.

ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, మారుతీ, బజాజ్​ ఫైనాన్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ నాలుగో డేటా సెంటర్‌

Last Updated :Mar 7, 2022, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details