తెలంగాణ

telangana

Ola electric: ఆమె చేతిలో 'ఓలా ఫ్యూచర్‌'

By

Published : Sep 13, 2021, 8:15 PM IST

Women Employees in Ola factory
ఓలా ఫ్యాక్టరీలో మహిళా ఉద్యోగులు ()

భారత్‌ మొబిలిటీ సేవల్లో సంచలనం సృష్టించిన ఓలా.. ఇప్పుడు విద్యుత్ స్కూటర్ల వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే తొలి ఈ-స్కూటర్​ను ఆవిష్కరించిన ఓలా ఎలక్ట్రిక్​.. బెంగళూరుకు కొద్ది దూరంలో 'ఓలాఫ్యూచర్‌ ఫ్యాక్టరీ' పేరుతో తయారీ యూనిట్​ నిర్మిస్తోంది. ఇందులో 10 వేల మందికిపైగా మహిళలు పని చేయనున్నట్లు తెలిపారు సంస్థ సీఈఓ భవిష్​ అగర్వాల్​. తొలి బ్యాచ్​ మహిళా ఉద్యోగులను ఫ్యాక్టరీలోకి ఆహ్వానించిన భవీష్ పలు కొత్త విషయాలు వెల్లడించారు.

ఆన్​లైన్​ క్యాబ్‌ సేవల్లో తనదైన ముద్ర వేసిన ఓలా.. భవిష్యత్తు స్వచ్ఛ ఇంధన వాహన విపణిని ఒడిసిపట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదల చేసింది. మరోవైపు బెంగళూరుకు కొద్దిదూరంలో 'ఓలాఫ్యూచర్‌ ఫ్యాక్టరీ' పేరిట అతిపెద్ద తయారీ యూనిట్‌ను నిర్మిస్తోంది. 500 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్తు దిచక్ర వాహన తయరీ కేంద్రంగా చెబుతున్నారు. సెకనుకు రెండు ఈ-స్కూటర్లను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భారత్‌తో పాటు ప్రపంచ విపణిని ఒడిసిపట్టాలని పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు.

నిర్మాణ దశలో ఓలా తయారీ యూనిట్​

మహిళలకు పెద్దపీట..

ఇంతటి గురుతర బాధ్యతను మహిళలకే అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ ప్రకటించారు. ఓలాఫ్యూచర్‌ ఫ్యాక్టరీని పూర్తిగా మహిళలే నిర్వహిస్తారని తెలిపారు. 10 వేల మందికి పైగా మహిళలు ఇందులో పని చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఇటీవల నియమించుకున్న తొలి విడత మహిళా ఉద్యోగులను భవీష్‌ ఫ్యాక్టరీలోకి స్వాగతించారు.

మహిళల వృద్ధి ఎంతో అవసరం..

ఓలా ఎలక్ట్రిక్ తయారీ యూనిట్​

ప్రపంచంలో మహిళలు మాత్రమే నిర్వహిస్తున్న అతిపెద్ద ఫ్యాక్టరీ ఓలాఫ్యూచరేనని భవీష్‌ తెలిపారు. అలాగే స్త్రీలు మాత్రమే పనిచేస్తున్న ఏకైక వాహన తయారీ కేంద్రం ఇదేనని పేర్కొన్నారు. మహిళలకు ఓలాలో పెద్దపీట వేయనున్నామన్నారు. అందులో భాగంగా తీసుకున్న తొలి నిర్ణయం ఇదేనన్నారు. 'స్వయం సమృద్ధ భారత్‌లో స్వయం సమృద్ధ మహిళలు కూడా ఉండాల్సిన అవసరం ఉందన్నా'రు.

ఓలా తయారీ పూర్తయితే ఇలా ఉండనుంది..

ఓలాఫ్యూచర్‌ ఫ్యాక్టరీలో ప్రతి వాహనం మహిళల చేతుల్లోనే తయారవుతుందని భవీష్‌ తెలిపారు. అందుకు కావాల్సిన శిక్షణనిచ్చామన్నారు. ఉత్పత్తి రంగంలో మహిళల పాత్ర ఇప్పటి వరకు 12 శాతానికి మాత్రమే పరిమితమైందన్నారు. పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా అవకాశాలు కల్పిస్తే భారత జీడీపీ 27 శాతం ఎగబాకుతుందని పలు అధ్యయనాలు వెల్లడించినట్లు గుర్తుచేశారు.

ఇదీ చదవండి:కార్లపై హ్యుందాయ్ అదిరే ఆఫర్లు- కొన్ని రోజులు మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details