తెలంగాణ

telangana

సైన్యం చేతులను కాంగ్రెస్ కట్టేసింది: మోదీ

By

Published : Mar 9, 2019, 7:28 PM IST

Updated : Mar 9, 2019, 10:06 PM IST

కాంగ్రెస్​ హయాంలో సైన్యానికి స్వేచ్ఛ లేదని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి ఎన్నడూ కాంగ్రెస్​ మద్దతివ్వలేదని విమర్శించారు.

ప్రధాని నరేంద్రమోదీ

ముంబయి దాడుల విషయంలో సైన్యం చేతులను అప్పటి ప్రభుత్వం కట్టేసిందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. గ్రేటర్​ నోయిడాలో నాలుగో దశ మెట్రో పనులను ప్రారంభించారు ప్రధాని. అనంతరం కాంగ్రెస్​ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ప్రధాని నరేంద్రమోదీ

"భారత్​ కొత్త రీతి, కొత్త నీతితో నడుస్తోంది. ఉరీ దాడి తర్వాత లక్షిత దాడులతో సమాధానమిచ్చాం. ఉగ్రవాదులకు వారికి అర్థమయ్యే భాషలోనే బదులిచ్చాం. మన వీర సైనికులు ఉగ్రవాదుల ఇంట్లోకి చొరబడి వారిని హతమార్చారు. ముంబయిపై పాక్​ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడులు చేశారు. పాక్​లో ఉన్న ఉగ్రవాదుల ఆధారాలు దొరికాయి. విషయమేమిటంటే.. అప్పుడు మన సైన్యం ప్రతీకారానికి సిద్ధంగా ఉంది. అయితే కేంద్రం భరోసా ఇవ్వలేదు. సైన్యం కాళ్లు చేతులను కట్టేశారు. అందుకే ముంబయి దాడుల తర్వాత కూడా ఇంకా దేశంలో ఉగ్రచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

'పవర్​'లోనూ బలహీనమే

కాంగ్రెస్​ హయాంలో విద్యుత్​ ప్రాజెక్టులపైనా నిర్లక్ష్యం వహించారని ప్రధాని విమర్శించారు. భాజపా అధికారంలోకి వచ్చాక లక్ష మెగా వాట్ల ఉత్పత్తి పెరిగేలా ప్రాజెక్టులను అభివృద్ధి చేశామన్నారు మోదీ.

ప్రస్తుతం భారత్​ అన్ని రంగాల్లో దూసుకుపోతుందంటే కారణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటమేనని స్పష్టం చేశారు మోదీ. "దేనికీ స్పందించని ప్రభుత్వాన్ని ఆమోదిస్తారా? ప్రధాని నిద్రమత్తులో ఉంటే సహిస్తారా?" అని మోదీ ప్రజలను ప్రశ్నించారు. మోదీని తిడితే ప్రజలు ఓట్లు వేస్తారని ప్రతిపక్షాలు భ్రమ పడుతున్నాయని ఎద్దేవా చేశారు ప్రధాని.

ఇదీ చూడండి:'130 కోట్ల మంది ప్రజలే సాక్ష్యం'

Last Updated : Mar 9, 2019, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details