తెలంగాణ

telangana

ప్రియురాలిని వేధించాడని ప్రిన్సిపల్​ హత్య.. సుత్తితో తలపై కొట్టి..

By

Published : Dec 16, 2022, 11:39 AM IST

తన ప్రియురాలిని వేధించాడనే కోపంతో పాఠశాల ప్రిన్సిపల్​ తలపై సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది. మరోవైపు, బ్రౌన్ షుగర్​తో పట్టుబడిన ఓ వ్యాపారిని లంచం ఇవ్వమని వేధింపులకు గురిచేశారు పోలీసులు. దీంతో మనస్తాపానికి గురైన వ్యాపారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అమానవీయ ఘటన బంగాల్​లో వెలుగుచూసింది.

young man killed government school principal
పాఠశాల ప్రిన్సిపల్​ను హత్య చేసిన యువకుడు

ఛత్తీస్​గఢ్​ బిలాస్​పుర్​లో దారుణం జరిగింది. ప్రిన్సిపల్​ను సుత్తితో కొట్టి హత్య చేశాడు ఓ యువకుడు. మృతుడిని 61 ఏళ్ల ప్రదీప్​గా పోలీసులు గుర్తించారు. గురువారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. నిందితుడు ఉపేంద్ర కౌశిక్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ జరిగింది
ప్రిన్సిపల్​ ప్రదీప్​ రాత్రి ఇంటికి వెళ్తుండగా నిందితుడు కౌశిక్​ అతడిని వెంబడించాడు. మృతుడు తన ఇంటి గేట్​ దగ్గరికి చేరుకున్న సమయంలో అతడితో వాగ్వాదానికి దిగాడు కౌశిక్​. తర్వాత అతడి తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన ప్రియురాలిని వేధింపులకు గురిచేసేవాడని అందుకే అతడిని హత్య చేశానని ఒప్పుకున్నాడు.

పోలీసుల వేధింపులు తట్టుకోలేక
బంగాల్​ గంగారాంపుర్​లో దారుణం జరిగింది. బ్రౌన్ షుగర్​తో పట్టుబడిన ఓ వ్యాపారి నుంచి రూ.1,20,000 లంచాన్ని డిమాండ్ చేశారు పోలీసులు. వారికి తక్షణమే రూ.72 వేలు లంచంగా ఇచ్చాడు వ్యాపారి కల్నల్ కిస్కు. మిగతా డబ్బులు మరుసటి రోజు ఇస్తానని చెప్పడం వల్ల పోలీసులు అతడిని వదిలిపెట్టారు. అనంతరం పోలీసుల ఒత్తిడి తట్టుకోలేక బాధితుడు ఇంటికి వెళ్లి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి చేరడం వల్ల తపస్ రాయ్​ అనే పోలీసును సస్పెండ్ చేశారు. అతడిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు బాధితుడి స్వస్థలం నందపుర్​కు వెళ్లగా గ్రామస్థులు నిరసన తెలిపారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం వల్ల పోలీసులను భారీ ఎత్తున మోహరించారు.

భర్తకు గవర్నమెంట్ జాబ్ ఇస్తామని..
హరియాణా.. ఫరీదాబాద్​లో ఘోరం జరిగింది. భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించి ఓ మహిళ నుంచి కిడ్నీను కాజేసింది ఓ ముఠా. ఈ ఘటనపై బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో ఓ డాక్టర్ సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 2020లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

18న మరో మర్డర్ చేస్తా..
ఛత్తీస్​గఢ్​ బెమెతేరాలో దారుణం జరిగింది. ఖైరీ గ్రామ సమీపంలోని గుర్తుతెలియని యువకుడి మృతదేహాం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. అయితే మృతదేహం దగ్గర గుర్తు తెలియని నిందితుడు తనను తాను రాజుగా పేపరుపై రాసి అక్కడ పడేశాడు. అలాగే తాను డిసెంబరు 18న మరో హత్య చేస్తానని అందులో రాశాడు. ఈ లేఖలు ప్రస్తుతం పోలీసులకు సవాల్​గా మారాయి. నిందితుడు హెచ్చరించినట్లు అతడు తదుపరి హత్య చేస్తాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఉదయం జరిగిందీ ఘటన.

ABOUT THE AUTHOR

...view details