తెలంగాణ

telangana

చెల్లి పెళ్లికి లీవ్ ఇవ్వలేదని ఆవేదన.. మతిస్తిమితం కోల్పోయి ఇంటికి దూరం.. మూడేళ్ల తర్వాత...

By

Published : Sep 11, 2022, 11:14 AM IST

చెల్లి పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాడు. డబ్బు కోసం కష్టపడి పని చేశాడు. కానీ ఇంతలోనే ఓ అనుకోని పరిస్థితి తన జీవితాన్నే మార్చేసింది. మూడేళ్లపాటు కుటుంబానికి దూరం చేసింది. మానసిక స్తిమితం కోల్పోయిన అతడ్ని ఓ ఫౌండేషన్​ చేరదీసి, అతని బాగోగులు చూసుకుంది. అతికష్టం మీద తన కుటుంబ సభ్యుల వద్దకు చేర్చింది. మూడేళ్ల తర్వాత తన కొడుకును చూసిన ఆనందంలో ఆ యువకుడి తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు.

young man rehabilitated in Mangalore returned home
young man rehabilitated in Mangalore returned home

స్వచ్ఛంద సంస్థలో శిబును కలిసిన తండ్రి

మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఓ సాధారణ యువకుడు అతడు. తన చెల్లి పెళ్లి కోసం డబ్బు సంపాదించాలని క్యాలెండర్ల తయారీ ఫ్యాక్టరీలో పని చేశాడు. పైసా పైసా కూడబెట్టుకుని చెల్లి పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాడు. కానీ ఇంతలోనే ఓ అనుకోని పరిస్థితి తన జీవితాన్నే మార్చేసింది. మానసిక స్తిమితం కోల్పోయి, దూరమయ్యాడు. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత కోలుకుని, అయిన వారికి చేరువయ్యాడు. తన కొడుకును చూసిన ఆనందంలో అతని తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. కుమారుడ్ని అక్కున చేర్చుకుని కంటతడిపెట్టారు. ఈ ఘటన కర్ణాటక మంగళూరులో జరిగింది.

తీవ్ర భావోద్వేగానికి లోనైన తండ్రీకొడుకులు
ఏడుస్తున్న కొడుకును ఓదార్చుతున్న తండ్రి

వివరాల్లోకి వెళ్తే... అలహాబాద్​కు చెందిన శిబు యానే ఆయుబ్ అనే వ్యక్తి తన చెల్లి పెళ్లి కోసం డబ్బులు సంపాదించడానికి శివకాశీలో ఓ క్యాలెండర్​ తయారీ కంపెనీలో పని చేస్తుండేవాడు. తన చెల్లికి పెళ్లి కుదిరిందనే వార్త తెలిసి ఇంటికి వెళ్లాలనుకున్నారు. కంపెనీ వారిని తన జీతం డబ్బులు, పెళ్లికి సెలవులు అడిగాడు. రెండింటికీ వారు నిరాకరించడం వల్ల మానసిక ఒత్తిడికి గురైన శిబు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయోమయంలో ఓ రైలు ఎక్కగా అది మంగళూరుకు చేరుకుంది. అప్పటికే అతని మానసిక పరిస్థితి క్షిణించింది. ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో అక్కడే వీధుల్లో తిరుగుతూ ఉండేవాడు. ఇది చూసిన వైట్ డవ్స్ అనే స్వచ్ఛంద సంస్థ అతడ్ని అక్కున చేర్చుకుంది.

ఆ సమయంలో శిబుకు తన పేరు తప్ప ఇంకేం గుర్తులేదు. దాదాపు మూడేళ్లు అతను ఆ పేరు తప్ప మరో మాట చెప్పేవాడు కాదని, చికిత్స పొందాక మునుపటిలా మారాడని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలిపారు. శిబుకు జ్ఞాపకశక్తి తిరిగి వచ్చిన తర్వాత, అలహాబాద్​లో అతను చదువుకున్న పాఠశాల పేరు చెప్పగలిగాడు. అతడు ఇచ్చిన క్లూ ద్వారా ఆ గురించి స్కూల్​ వారు ఆరా తీశారు. శిబు వాళ్ల గ్రామ సర్పంచ్ ద్వారా అతడి తండ్రి ఫోన్ నంబరు కనుగొన్నారు.

తల్లికి వీడియోకాల్​ చేస్తున్న శిబు తండ్రి

విషయం తెలుసుకున్న శిబు తండ్రి హుటాహుటిన మంగళూరుకు చేరుకున్నారు. మూడేళ్ల తర్వాత తన కొడుకును చూసిన కన్నీరు మున్నీరయ్యారు. దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. శిబు కోసం గత మూడేళ్లుగా దేశమంతా గాలించానని, అయినా అతడి ఆచూకీ తెలియలేదని శిబు​ తండ్రి అన్నారు. కన్నబిడ్డ దూరమైన బాధలో ఉన్న తల్లితో మంగళూరు నుంచే వీడియో కాల్​ మాట్లాడాడు శిబు.
కొడుకును చూసిన తల్లి ఎంతో ఆనందపడ్డారు. త్వరగా ఇంటికి వచ్చేయమని కోరారు. 'వైట్​ డవ్స్'​ సంస్థ చేసిన ఈ పనికి తాను రుణపడి ఉంటానని శిబు​ తండ్రి అన్నారు. తన కొడుకును తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయారు.

వీడియోకాల్​ సంభాషణలో కన్నీరు మున్నీరైన తల్లి
స్వచ్ఛంద సంస్థలోని వారికి అభివాదం చేస్తున్న తండ్రీకొడుకులు
ఇంటికి వెళ్తున్నానని తన మిత్రులకు బై చెబుతున్న శిబు

ఇదీ చదవండి:'రాహుల్‌ గాంధీ యాత్ర చేసేది ఆ పనికోసమే'.. షా, ఇరానీ విమర్శలు

12 అడుగుల కింగ్​ కోబ్రా కలకలం.. ఇంట్లోకి వెళ్తుండగా..

ABOUT THE AUTHOR

...view details