తెలంగాణ

telangana

రాష్ట్రపతి ఎన్నికల్లో 98.90% ఓటింగ్.. దిల్లీకి బ్యాలెట్ బాక్సులు!

By

Published : Jul 18, 2022, 6:50 PM IST

Updated : Jul 18, 2022, 7:01 PM IST

President poll 2022
President poll 2022 ()

Presidential election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో 98.90 శాతం ఓటింగ్ నమోదైంది. ఎనిమిది మంది ఎంపీలు ఓటు వేయలేదని అధికారులు తెలిపారు. మరోవైపు, బ్యాలెట్ బాక్సులను దిల్లీకి తరలిస్తున్నారు. సోమవారం రాత్రి నాటికే ఇవి పార్లమెంటుకు చేరుకుంటాయని అధికారులు స్పష్టం చేశారు.

President poll 2022: రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఉదయం 10గం.లకు ప్రారంభం అయిన ఓటింగ్ సాయంత్రం 5గం.లకు ముగిసింది. మొత్తం ఏడు గంటల పాటు కొనసాగిన ఈ పోలింగ్​లో.. 98.90 శాతం ఓట్లు పడ్డాయి. ఎనిమిది మంది ఎంపీలు వివిధ కారణాల వల్ల ఓటు వేయలేకపోయారు. పోలింగ్ కోసం వివిధ రాష్ట్రాలకు పంపించిన బ్యాలెట్ బాక్సులు సోమవారం రాత్రి లోపు పార్లమెంటుకు చేరుకోనున్నాయి. వాయు, రోడ్డు మార్గాల్లో బ్యాలెట్ పెట్టెలను దిల్లీకి తరలిస్తున్నట్లు రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ వెల్లడించారు. బ్యాలెట్ బాక్సులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు.

  • మొత్తం 736 చట్టసభ్యులకు (727 ఎంపీలు, 9మంది ఎమ్మెల్యేలు) పార్లమెంట్​లో ఓటేసేందుకు ఎన్నికల సంఘం అనుమతించింది.
  • అందులో 728 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 8 మంది ఎంపీలు వివిధ కారణాల వల్ల ఓటింగ్​కు గైర్హాజరయ్యారు.
  • మొత్తం 98.90 శాతం ఓటింగ్ నమోదైంది.

పార్లమెంటు భవనంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్​లో తొలుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా చివరి ఓటు వేశారు. కొవిడ్​తో బాధపడుతున్నప్పటికీ కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ఆర్కే సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పీపీఈ కిట్ ధరించి పార్లమెంట్​కు ఓటేసేందుకు వచ్చారు. మరోవైపు, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్​సెల్వం సైతం పీపీఈ కిట్​లో అసెంబ్లీకి వెళ్లి ఓటేశారు.

నిర్మలా సీతారామన్
పీపీఈ కిట్​లో ఆర్కే సింగ్
పన్నీర్​సెల్వం

క్రాస్ ఓటింగ్?
జులై 21న పార్లమెంట్ హౌస్​లో రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ముర్ముకు మొత్తం 44 పార్టీలు మద్దతిచ్చాయి. 63 శాతం ఓట్లతో ముర్ము విజయం సాధించే అవకాశం ఉంది. క్రాస్ ఓటింగ్ జరిగితే ద్రౌపది ముర్ము ఓటు శాతం మరింత పెరగనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి జులై 25న ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఇదీ చదవండి:

Last Updated :Jul 18, 2022, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details