తెలంగాణ

telangana

పక్షవాతంతో సివిల్స్​లో విజయం.. కోచింగ్ లేకుండానే ఆరో ర్యాంక్.. కొడుకు ఏం చదివాడో తెలియకపోయినా..

By

Published : May 24, 2023, 7:25 AM IST

UPSC Civils Final Results 2022
UPSC Civils Final Results 2022 ()

యూపీఎస్​సీ-2022 పరీక్షల ఫలితాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతీయువకులు అత్యుత్తమ ర్యాంకులను సాధించి తమ సత్తా చాటారు. ఒకరు పక్షవాతంతో బాధపడుతూ ఐఏఎస్​ కావాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ర్యాంకు సాధించగా.. మరో యువతి కోచింగ్​ తీసుకోకుండానే మంచి ర్యాంకును సొంతం చేసుకున్నారు. మరోవైపు.. ఆర్టీసీ కండక్టర్​ కుమారుడు సైతం ఈ ఫలితాల్లో అసాధారణమైన ప్రతిభను కనబరిచి మంచి ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఇలా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఈ అభ్యర్థుల విజయగాథల గురించి ఓ సారి తెలుసుకుందామా?

UPSC Civils Final Results 2022 : దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొందరు యువత యూపీఎస్​సీ-2022 పరీక్ష ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచి తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. మరి వీరందరి కుటుంబ నేపథ్యాలతో పాటు వారి విజయగాథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

'నా కొడుకు ఏం చదివాడో తెలీదు కానీ.. ఈ రోజు వాడిని అందరూ మెచ్చుకొని.. మా ఊరికే పేరు-ప్రతిష్టలు తెచ్చావు అని అంటుంటే నా కళ్లలో నీళ్లు ఆగట్లేదు' ఈ అమాయకపు మాటలు సివిల్​ సర్వీసెస్​ పరీక్షల్లో 589వ ర్యాంకు సాధించి సత్తా చాటిన ఓ యువకుడి తల్లి అన్నవి. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక హుబ్లీ జిల్లాలోని అన్నిగేరి పట్టణానికి చెందిన సిద్ధలింగప్ప పుజారా ఎంతో కష్టంగా పరిగణించే సివిల్స్​ సర్వీసెస్​ పరీక్షల్లో తన ప్రతిభను కనబర్చారు. ఆయన తండ్రి కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(KSRTC)లో కండక్టర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. బీఈ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసిన సిద్ధలింగప్ప బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయనకు గతేడాది వివాహం కాగా.. ప్రస్తుతం బెంగళూరులో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. కన్నడ మాధ్యమంలో విద్యనభ్యసించిన సిద్ధలింగప్ప ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనప్పటికీ ఎంతో కష్టపడి చదివారు. దీని ఫలితంగా దేశంలోనే అత్యున్నత పరీక్షగా భావించే UPSCలో ఉత్తీర్ణత సాధించారు.

సివిల్స్ సాధించిన సిద్ధలింగప్ప
సిద్ధలింగప్ప పూజారా(పాత ఫొటో)

శివమొగ్గ యువతికి 617 ర్యాంకు!
శివమొగ్గ జిల్లాకు చెందిన మేఘన యూపీఎస్​సీ-2022 పరీక్షల్లో 617వ ర్యాంక్ సాధించారు. ఆమె తండ్రి ఐఎం నాగరాజ్​ విశ్రాంత ఐఎఫ్‌ఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన జిల్లాలోని వన్యప్రాణి విభాగం డీఎఫ్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్నారు.

సివిల్స్​లో మెరిసిన అంగన్​వాడీ కుమారుడు!
రెండోసారి పరీక్ష రాసి సివిల్​ సర్వీసెస్​ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు బెంగళూరుకు చెందిన డాక్టర్ భానుప్రకాశ్​. ఆయన ప్రస్తుతం బెంగళూరు నేలమంగళలోని సిద్ధార్థ ఆస్పత్రిలో పీడియాట్రిక్​ స్పెషలిస్టుగా పనిచేస్తున్నారు. నాలుగేళ్లుగా వైద్య వృత్తిలో ఉన్న భానుప్రకాశ్ యూపీఎస్​సీలో నెగ్గాలనే పట్టుదలతో రెండవ ప్రయత్నంలో ఆయన ఈ ఘనతను సాధించారు. కాగా, భానుప్రకాశ్ తల్లి అంగన్​వాడీ టీచర్​ కావడం గమనార్హం.

విజయం సాధించిన విజయపుర యువకుడు!
విజయపురా(బీజాపుర్​)కు చెందిన యలగూరేశ అర్జున నాయక సివిల్​ సర్వీసెస్​ పరీక్షల్లో 890వ ర్యాంకు సాధించారు. విజయపుర జిల్లా ముద్దెబిహాలలోని సరూర తండాకు చెందిన అర్జున తండ్రి ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. మొత్తంగా తాజాగా వెల్లడించిన యూపీఎస్​సీ ఫలితాల్లో కర్ణాటక రాష్ట్రం నుంచే ఏకంగా 20 మందికి పైగా అభ్యర్థులు విజయం సాధించడం విశేషం.

కోచింగ్​ తీసుకోలేదు.. అయినా సివిల్స్​లో 6వ ర్యాంక్​!
Navya James UPSC : ఓ యువతి ఎటువంటి కోచింగ్ తీసుకోకుండానే యూపీఎస్​సీ-2022 పరీక్ష ఫలితాల్లో ఏకంగా 6వ ర్యాంక్​ను సాధించారు. సెల్ఫ్​ ప్రిపరేషన్​తో పాటు నిరంతర సాధన కారణంగానే ఈ ఘనత సాధ్యమైందని చెబుతున్నారు కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన గహానా నవ్యా జేమ్స్. సెయింట్ థామస్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు ఆమె. నవ్య తల్లి దీపా జార్జ్​, తండ్రి జేమ్స్​ థామస్​ వృత్తిరీత్యా ఉపాధ్యాయులు.

సివిల్స్​లో ఆరో ర్యాంకు సాధించిన నవ్యా జేమ్స్

పక్షవాతంతో బాధపడుతున్నా పంజా విసిరింది!
Sherin Shahana Civil Service : కేరళ వయనాడ్‌కు చెందిన షెరిన్​ షహానా సివిల్ సర్వీసెస్​ పరీక్షల్లో 913వ ర్యాంక్‌ సాధించారు. ఆమె 2017లో తన ఇంటి టెర్రస్​పై నుంచి పడిపోవడం వల్ల తీవ్రమైన వెన్నెముక గాయం అయ్యింది. దీంతో ఆమె పక్షవాతానికి గురయ్యారు. అప్పటి నుంచి షెరిన్​ వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యారు. అయినా పట్టువదలకుండా శ్రమించి సివిల్స్​లో విజయం సాధించారు. సివిల్స్​లో ర్యాంకు సాధించడానికి కోచింగ్​ తనకు ఎంతగానో ఉపయోగపడిందని షెరిన్ చెప్పారు.

షెరిన్ షహానా

ఇదిలా ఉంటే కేరళకు చెందిన మరికొందరు అభ్యర్థులు కూడా సివిల్​ సర్వీసెస్​ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. వీఎం ఆర్య (36వ ర్యాంక్), అనూప్ దాస్ (38వ ర్యాంక్), ఎస్ గౌతమ్ రాజ్ (63వ ర్యాంక్) మెరిశారు.

UPSC Topper Ishita Kishore : 2022 సివిల్ సర్వీసెస్​లోని వివిధ విభాగాలకు నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 933 మంది అర్హత సాధించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకారం.. ఇందులో 613 మంది పురుషులు కాగా.. 320 మంది మహిళలు అర్హత సాధించారు. దిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఇషితా కిషోర్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. బిహార్​కు చెందిన గరిమా లోహియా, తెలంగాణకు చెందిన ఉమా హారతి, స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు సాధించారు.

ABOUT THE AUTHOR

...view details