తెలంగాణ

telangana

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. అప్పటివరకు విచారణ వాయిదా వేసిన సుప్రీం

By

Published : Mar 13, 2023, 12:47 PM IST

Updated : Mar 13, 2023, 6:16 PM IST

MLA's Poaching Case Update: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ విచారణపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాత మిస్‌ లేనియన్‌ పిటిషన్‌ కింద విచారణ జరుపుతామని స్పష్టం చేసిన ధర్మాసనం.. అప్పటి వరకు యథాతథస్థితి కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు విచారణను వాయిదా వేసింది.

MLA's Poaching Case Update
MLA's Poaching Case Update

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ విచారణపై స్టే ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాత జులై 31 నుంచి ప్రారంభమయ్యే వారంలో మిస్ లేనియస్ పిటిషన్ కింద విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. అప్పటి వరకు యథాతథస్థితి కొనసాగుతుందని ధర్మాసనం వెల్లడించింది. ఈ మేరకు కేసును వాయిదా వేసింది.

ఎమ్మెల్యేల ఎర కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది. అయితే విచారణ పారదర్శకంగా జరగడం లేదన్న ఆరోపణలతో సిట్‌ దర్యాప్తును రద్దు చేసిన హైకోర్టు సింగిల్‌ జడ్జి.. విచారణ జరపాలని సీబీఐని ఆదేశించారు. దీనిపై స్టే ఇవ్వాలంటూ ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం వద్దకు వెళ్లింది. వాదనల సందర్భంగా.. క్రిమినల్‌ కేసులకు సంబంధించి సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పులను విచారించే పరిధి ధర్మాసనానికి ఉండదని హైకోర్టు తెలిపింది. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించడంతో ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించడం అంటే కేసు అవసరం లేదన్నట్లేనని.. సీబీఐ విచారణపై స్టే ఇవ్వాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై గత నెలలో సుధీర్ఘ వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సీబీఐ బీజేపీ చేతిలో చిలుక లాంటిదని ప్రభుత్వం తరఫున జస్టిస్‌ దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. కేసులో బీజేపీకి చెందిన కీలక నేతలు నిందితులుగా ఉన్నారని.. అలాంటప్పుడు సీబీఐ కేసును నిష్పక్షపాతంగా.. పారదర్శకంగా విచారణ చేయగలదా అని ప్రశ్నించారు. నేరం జరిగింది తెలంగాణలో కాబట్టి.. సిట్‌ ద్వారానే విచారణ సాగాలని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి జోక్యం చేసుకున్నారు. ఈ కేసులోని ఆధారాలు ముఖ్యమంత్రి చేతికి ఎలా చేరాయని దవేను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన దవే.. సీఎం జోక్యం చేసుకోలేదని, పార్టీ అధినేతగా జరుగుతున్న కుట్రలను ప్రజలకు వివరించారని తెలిపారు. అయితే ఫిర్యాదుదారుడి ఇంట్లో దొరికిన సీడీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, హైకోర్టు న్యాయమూర్తులకు పంపడం సరైందేనా అని గవాయి ప్రశ్నించగా.. అది తప్పేనని.. సీఎంకు బదులుగా తాను క్షమాపణ చెబుతున్నానని దవే పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రే అలా చేయడంతో హైకోర్టు సింగిల్‌ జడ్జి కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ మేరకు కేసును నేటికి విచారణ వేశారు. నేడు మరోసారి విచారణకు రాగా.. వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇవీ చూడండి..

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి అప్పగింతపై సుప్రీంలో సవాల్

'బీజేపీ పంజరంలో సీబీఐ చిలుక'.. సుప్రీంలో ఎమ్మెల్యేలకు ఎర కేసు వాదనలు

Last Updated :Mar 13, 2023, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details