తెలంగాణ

telangana

నేడు హైదరాబాద్​లో టీడీపీ ఆవిర్భావ సభ.. పసుపుమయమైన రహదారులు

By

Published : Mar 29, 2023, 9:31 AM IST

TDP Avirbhava Sabha in Hyderabad today : తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో ఊపిరిపోసుకున్న తెలుగు దేశం పార్టీ 42వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు నిర్వహిస్తున్న భారీ సభకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ వేదిక కానుంది. ఈ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు, పార్టీ కీలక నేతలు పాల్గొంటున్న ఈ సభ వేదికగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సహం నింపాలని టీడీపీ భావిస్తోంది.

TDP
TDP

TDP Avirbhava Sabha in Hyderabad today: తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ నేటితో 41 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌-నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఇవాళ ఆవిర్భావ సభ అట్టహాసంగా నిర్వహించనున్నారు. సభా ప్రాంగణం పరిసర ప్రాంతాలను తెలుగుదేశం ఫ్లెక్సీలు, బ్యానర్‌లతో అలంకరించారు. ఇవాళ మధ్యాహ్నం ఎన్టీఆర్ ఘాట్​లో నివాళులు అర్పించిన అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సభాస్థలికి చేరుకుని కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

300 మంది ఆశీనులయ్యేలా సభా వేదిక : తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 20 వేల మంది పార్టీ ప్రతినిధులు ఆవిర్భావ సభలో పాల్గొంటారని... తెలుగుదేశం వర్గాలు అంచనా వేశాయి. ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, పొలిట్ బ్యూరో సభ్యులు, నియోజక వర్గ ఇంఛార్జీలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది ఆశీనులయ్యేందుకు వీలుగా భారీ స్టేజ్ ని రూపొందించడం విశేషం. మరో వైపు సభకు వచ్చే వారికోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. ఇందుకోసం పార్టీ ప్రత్యేకంగా 11 కమిటీలను వేసి సభ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీడీపీ శ్రేణులు : సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న టీడీపీ ఆవిర్భావ సభలో పాల్గొనే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్టేజ్ ఎదురుగా వీఐపీలు కూర్చునేందుకు ప్రత్యేకంగా.. మండల స్థాయి నేతలకు మరో గ్యాలరీని ఏర్పాటు చేశారు. వేసవి కావడంతో సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ కూలర్లు, ఎల్ఈడీ స్క్రీన్లు సిద్ధం చేశారు. మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీ, ఎక్కడిక్కడ వాలంటీర్ల సహయంతో మంచినీటి పంపిణీ, ఆహారం అందించనున్నారు. ప్రతి గ్యాలరీకి వేరువేరు ఎంట్రీలు, సభకు వచ్చే వారికోసం విడిగా పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు పార్టీ శ్రేణులు వివరించాయి.

పార్టీ బలోపేతం దిశగా దిశానిర్ధేశం చేయనున్న పార్టీ అధ్యక్షుడు : మంగళవారం రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించిన అంశాలు సహా... పార్టీ శ్రేణులకు ఈ సభా వేదికగా కొత్త ఉత్సహం నింపేలా కార్యక్రమాలను రూపకల్పన చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా జరగనున్న ఈ పార్టీ ఆవిర్భావ సభ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం చేసే దిశగా జాతీయ అధ్యక్షుడు దిశా నిర్దేశం చేయనున్నారు. సభకు హాజరయ్యే వారికోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details