దేశ రాజధాని దిల్లీలో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మాలివాల్ను ఓ వ్యక్తి మద్యం మత్తులో వేధింపులకు గురిచేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దిల్లీలో మహిళా భద్రతను పరిశీలించేందుకు స్వాతి మాలివాల్ గురువారం తెల్లవారుజామున నగరంలోని కొన్ని ప్రదేశాల్లో తన బృందంతో పాటు పర్యటించారు. సుమారు 3 గంటల 5 నిమిషాల సమయంలో ఎయిమ్స్ బస్టాండు దగ్గర ఉండగా ఓ కారు వచ్చి ఆమె ముందు ఆగింది. వచ్చి కార్లో కూర్చోమని ఆ వ్యక్తి స్వాతిని అడిగాడు. దీనికి ఆమె బదులిస్తూ.. నాకు వినిపించట్లేదు. ఎక్కడ డ్రాప్ చేస్తారు? నేను మా ఇంటికి వెళ్లాలి. మా బంధువులు వస్తున్నారు అని స్వాతి చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కాసేపటికే మళ్లీ యూటర్న్ తీసుకుని వచ్చి ఆమెను మళ్లీ కారులో కూర్చోమని అడిగాడు. దీంతో స్వాతి ఆగ్రహానికి గురయ్యారు. నన్ను ఎక్కడకు తీసుకెళ్లాలనుకుంటున్నావ్? నువ్వు రావడం ఇది రెండోసారి. ఇలాంటివి వద్దని పదే పదే చెబుతున్నా అంటూ కారు డ్రైవర్ వద్దకు వెళ్లారు. నిందితుడిని పట్టుకోవడానికి స్వాతి కారు లోపలకు చేయి పెట్టగా అతడు కారు అద్దాన్ని పైకి వేసేశాడు. ఈ క్రమంలో ఆమె చెయ్యి ఇరుక్కుపోయింది. అలానే కారును ముందుకు పోనిచ్చి సుమారు 15 మీటర్లు స్వాతి మాలివాల్ను ఈడ్చుకెళ్లాడు. ఆమె నొప్పితో కేకలు వేయడం వీడియోలో వినిపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని 47ఏళ్ల హరీశ్ చంద్రగా గుర్తించారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా నిందితుడ్ని న్యాయస్థానం 14 రోజుల కస్టడీకి అప్పగించింది.