తెలంగాణ

telangana

'చట్ట ప్రకారమే ప్రత్యేక కోర్టుల పరిధి'

By

Published : Nov 16, 2021, 6:49 AM IST

Supreme Court

ప్రజాప్రతినిధులపై నమోదవుతున్న కేసుల విచారణ పరిధిపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్‌ దాఖలు చేసిన ఓ పిటీషన్​పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. 'చట్టసభ్యులపై కేసుల వ్యవహారం' చట్ట ప్రకారమో, లేదంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ప్రకారమో ఉండాలి కదా? అని సుప్రీంకోర్టు(supreme court of india) స్పష్టీకరించింది.

ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో విచారణ చేపడుతున్న 'ప్రత్యేక క్రిమినల్‌ కోర్టుల పరిధి' చట్ట ప్రకారమే ఉండాలనీ.. వీటి పరిధిని తాము నిర్ణయిస్తే చాలా తీవ్ర సమస్య ఉత్పన్నమవుతుందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది(supreme court on special courts). క్రిమినల్‌ కేసుల్లో దోషిగా తేలిన చట్టసభ్యులపై జీవితకాల నిషేధం విధించాలని, వారిపై ఉన్న కేసుల విచారణను త్వరగా ముగించాలని కోరుతూ 2016లో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్‌(samajwadi party azam khan) తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌(kapil sibal news) వాదనలు వినిపించారు.

"ఆజంఖాన్‌పై మేజిస్ట్రేట్‌ స్థాయిలో విచారించదగ్గ చిన్నపాటి ఆరోపణలున్నాయి. కానీ, వాటిపై సెషన్స్‌ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక న్యాయస్థానంతో విచారణ జరిపిస్తున్నారు. జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కంటే సెషన్స్‌ జడ్జి సీనియర్‌ అయినందున, ఆయా కేసుల్లో నిందితులు తమకు సహజంగా ఉండే అపీలు హక్కు కోల్పోతారా? కోర్టు స్థాయి పట్ల మాకేమీ అభ్యంతరం లేదు. కానీ, ఇది చట్ట ప్రకారమో, లేదంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ప్రకారమో ఉండాలి కదా?"

---కపిల్ సిబల్

ఈ ప్రశ్నను పరిశీలించేందుకు ధర్మాసనం అంగీకరిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. "ఇక్కడ రెండు భిన్న అంశాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని 142వ ఆర్టికల్‌ ప్రకారం సంక్రమించిన ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి.. నిర్దిష్ట రకానికి చెందిన కేసులపై విచారణ చేపట్టేందుకు ఒక నిర్దిష్ట న్యాయమూర్తి లేదా ట్రయల్‌ కోర్టు 'స్పెషల్‌ కోర్టు'గా ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించవచ్చు. దీన్నెవరకూ ప్రశ్నించలేరు.

ఇక ప్రత్యేక కోర్టుల అధికార పరిధి ఎలా ఉండాలన్నది మరో ప్రశ్న. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, లేదంటే.. ఎస్సీ/ఎస్టీ యాక్ట్‌ కింద ఉంటే, ఆ చట్టాలను అనుసరించే ప్రత్యేక కోర్టులు ఉండాలి. ఫలానా నేరంపై మేజిస్ట్రేట్‌ కోర్టుతో విచారణ జరపాలని చట్టం విస్పష్టంగా చెబుతున్నప్పుడు.. సుప్రీంకోర్టు(supreme court of india) ఆర్టికల్‌ 142ను అనుసరించి సెషన్స్‌ కోర్టుతో విచారణ చేపట్టాలని చెప్పలేదు. అలా చెప్తే చాలా తీవ్రమైన సమస్య తలెత్తుతుంది" అని వ్యాఖ్యానించింది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లు కూడా ఉన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details