తెలంగాణ

telangana

సోనియాకు తొలిరోజు 20 ప్రశ్నలు.. ఈడీ అధికారులకు స్పెషల్​ రిక్వెస్ట్.. మళ్లీ సోమవారం విచారణ

By

Published : Jul 21, 2022, 12:11 PM IST

Updated : Jul 21, 2022, 3:57 PM IST

sonia gandhi
సోనియా గాంధీ

14:33 July 21

సోనియాను విచారించిన ఈడీ

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని గురువారం 2 గంటలు విచారించింది ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్. మొత్తం 20 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఆరోగ్య కారణాలతో ఆమె చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకుని.. తొలిరోజు విచారణను త్వరగానే ముగించారు. ఆమె ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు. మళ్లీ సోమవారం విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు.

12:26 July 21

సోనియా గాంధీకి మద్దతుగా నిరసన చేస్తున్న కాంగ్రెస్​ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు.. పలు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారు.

12:26 July 21

సోనియా గాంధీ ఈడీ విచారణను నిరసిస్తూ.. కాంగ్రెస్​ కార్యకర్తలు దిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు.

10:44 July 21

ఈడీ విచారణకు సోనియా.. తోడుగా ప్రియాంక.. దేశవ్యాప్తంగా నిరసనలు

Sonia Gandhi ED case: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) విచారణకు గురువారం హాజరయ్యారు. ఆమె కుమార్తె ప్రియాంక గాంధీతో కలిసి దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సోనియా ఆరోగ్య పరిస్థితుల మేరకు సహకారిగా ఉండేందుకు ప్రియాంకకు.. ఈడీ అనుమతి ఇచ్చింది. అయితే విచారణ గది కాకుండా.. మరో గదిలో ఉండేందుకు ప్రియాంకకు అనుమతి ఇచ్చింది.

మరోవైపు.. సోనియా గాంధీ ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ శ్రేణులు నిరసనలు చేస్తున్నాయి. పార్లమెంట్​ వెలుపల, లోపల కూడా సోనియా గాంధీ ప్లకార్డులు పట్టుకొని.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్​ ఎంపీలు. మరోవైపు.. విపక్షాలు కూడా దీనిపై ఓ ప్రకటన విడుదల చేశాయి. కొన్ని పార్టీల ప్రముఖ నేతలే లక్ష్యంగా ప్రయోగిస్తూ.. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డాయి.

''మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను ఉపయోగించి కక్ష సాధిస్తోంది. ఈడీ ద్వారా ప్రతిపక్షాలపై ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది. ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురి చేస్తోంది. భాజపా తీరును ఖండిస్తున్నాం. మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సమష్టిగా పోరాటం చేస్తాయి.''

-ప్రతిపక్షాలు

సోనియా ఈడీ విచారణ నేపథ్యంలో దిల్లీలో భద్రతను పెంచారు పోలీసులు. ఔరంగజేబ్ మార్గ్, మోతీలాల్ నెహ్రూ మార్గ్, జనపథ్ మార్గ్, అక్బర్ రోడ్​లను పూర్తిగా మూసివేశారు. కాంగ్రెస్ కార్యకర్తల నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ కేసులో జూన్​ 8నే సోనియా తొలుత విచారణకు హాజరుకావాల్సి ఉంది. జూన్​ 2న ఆమెకు కరోనా సోకిన నేపథ్యంలో కొన్నిరోజులు ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకున్నారు. అనంతరం.. జూన్​ 12న ఆస్పత్రిలో చేరారు. కరోనాతో బాధపడుతున్న కారణంగా విచారణకు హాజరుకాలేనని.. మూడు వారాల గడువు ఇవ్వాలని సోనియా ఈడీని కోరారు. దీంతో జూన్​ 23న త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాలని ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దీంతో పూర్తిగా కోలుకున్న తర్వాతే హాజరవుతానని ఆమె మరోసారి స్పష్టం చేశారు. సోనియా తనయుడు, కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీని ఇదే కేసు విషయంలో.. మొత్తం ఐదు రోజుల్లో సుమారు 55 గంటల పాటు ఈడీ విచారించింది. సోనియా, రాహుల్​ గాంధీని కావాలనే లక్ష్యంగా చేసుకున్నారని ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా అప్పుడు కూడా పెద్దఎత్తున నిరసనలు చేపట్టాయి.

ఏంటీ కేసు?:కాంగ్రెస్‌కు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను ఈడీ ప్రశ్నించింది.

Last Updated : Jul 21, 2022, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details