తెలంగాణ

telangana

'భారత్​-చైనా సరిహద్దు సమస్యపై మౌనమెందుకు'.. పార్లమెంట్ ఎదుట విపక్షాల ఆందోళన

By

Published : Dec 21, 2022, 12:25 PM IST

Updated : Dec 21, 2022, 12:55 PM IST

భారత్‌- చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై పార్లమెంట్‌లో చర్చకు అనుమతించకపోవడంపై కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ మండిపడ్డారు. అలాంటి తీవ్రమైన సమస్యపై పార్లమెంట్​లో చర్చకు అనుమతి నిరాకరించడం.. మన ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమే అని ఆమె విమర్శించారు. మరోవైపు, బుధవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద విపక్షాలు ఆందోళనకు దిగాయి.

ccp sonia fired on centre for india china border issue
ccp sonia fired on centre for india china border issue

భారత్‌-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీస్తున్న వేళ.. సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. పార్లమెంటు సెంట్రల్‌ హాల్​లో జరిగిన ఈ భేటీకి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరీ సహా ఇతర ఎంపీలు హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం సోనియా మీడియాతో మాట్లాడారు.

భారత్‌- చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంట్‌లో చర్చకు అనుమతించకపోవడంపై సోనియాగాంధీ తీవ్రంగా మండిపడ్డారు. "మనపై దాడి చేయడానికి చైనా ఎందుకు ధైర్యంగా ఉంది? ఈ దాడులను తిప్పికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సన్నాహాలు చేపట్టింది? ఇంకా ఏం చేయాలి? భవిష్యత్తులో చొరబడకుండా చైనాను నిరోధించడానికి ప్రభుత్వ విధానం ఏమిటి? మనం తీవ్రమైన వాణిజ్య లోటు కలిగి ఉన్నాం. చైనాకు మనం ఎగుమతి చేసే దానికంటే దిగుమతులు ఎక్కువ చేసుకుంటున్నాం. చైనా సైనిక శత్రుత్వానికి ఆర్థిక ప్రతిస్పందన ఎందుకు ఇవ్వడం లేదు? భారత్​- చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంట్​లో చర్చకు అనుమతి నిరాకరించడం.. మన ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమే. తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం పట్ల కేంద్రం ఎందుకు మౌనం వహిస్తోంది?" అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సోనియా ప్రశ్నించారు.

పార్లమెంట్​లో చర్చను అడ్డుకుంటూ, ప్రతిపక్షాల గొంతును అణిచివేయడంలో కేంద్రప్రభుత్వం నిమగ్నమైందని సోనియా ఆరోపించారు. భాజపా అధికారంలో ఉన్నప్రతీ రాష్ట్రంలో ఇదే జరుగుతోందని ఆమె అన్నారు. న్యాయవ్యవస్థ స్థాయిని కూడా తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని సోనియా ఆరోపణలు చేశారు.

పార్లమెంట్​ పరిసరాల్లో విపక్షాల ఆందోళన..
భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చ జరపాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బుధవారం ఉదయం విపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్‌, శివసేన, డీఎంకే, ఎన్‌సీపీ సహా 12 విపక్ష పార్టీలు గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టాయి. సోనియా గాంధీ ఆధ్వర్యంలో విపక్షాలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. సరిహద్దు వివాదంపై మౌనాన్ని వీడాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించాయి. చైనా దురాక్రమణపై సభలో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు కేంద్రం జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశాయి. అంతకుముందు చైనాతో ఉద్రిక్తలపై చర్చకు డిమాండ్‌ చేస్తూ పలువురు విపక్ష పార్టీల ఎంపీలు ఉభయ సభలకు వాయిదా తీర్మానాలు అందజేశారు.

Last Updated : Dec 21, 2022, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details