తెలంగాణ

telangana

కాంగ్రెస్​కు షాక్​.. పార్టీ వీడనున్న మాజీ సీఎం!

By

Published : Sep 27, 2021, 10:34 AM IST

గోవా అసెంబ్లీ ఎన్నికలు (Goa Polls 2022) సమీపిస్తున్న వేళ రాష్ట్ర కాంగ్రెస్​లో (Congress) భారీ కుదుపు వచ్చే అవకాశం కనబడుతోంది. గోవా మాజీ ముఖ్యమంత్రి ఫలేరో.. కాంగ్రెస్​ను​ వీడనున్నారని సమాచారం. దీనిపై ఆయన సోమవారం కీలక ప్రకటన చేయనున్నారు.

Goa Congress
గోవా కాంగ్రెస్

కాంగ్రెస్​ పార్టీకి (Congress) గోవాలో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే లుయీజిన్హో ఫలేరో (Goa Ex CM) తృణమూల్ కాంగ్రెస్​లో సోమవారం చేరతారని సమాచారం. అయితే దీనిపై ఆయన స్పష్టతనివ్వలేదు.

"నేను లోతుగా ఆలోచిస్తున్నా. అన్నీ పరిశీస్తున్నా. ఒక్కటి మాత్రం చెప్పగలను. గోవా ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వారి కోసం ఎవరో ఒకరు నిలబడాలి. సరైన సమయంలో (టీఎంసీలో చేరికపై) స్పందిస్తా" అని ఫలేరో అన్నారు.

లుయీజిన్హో ఫలేరో

కీలక ప్రకటన..

వచ్చే ఏడాది జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో (Goa Polls 2022) పోటీచేయనున్నట్లు టీఎంసీ ఇదివరకే ప్రకటించింది. మమత బెనర్జీ నేతృత్వంలోని పార్టీలో చేరనున్నారనే ఊహాగానాల నడుమ ఫలేరో నేడు (సోమవారం) కీలక ప్రకటన చేయనున్నారు.

వ్యూహాల దిట్ట..

గోవా రాజకీయాల్లో ఫలేరో బలమైన నేత. కాంగ్రెస్ (Goa Congress)​ కంచుకోటగా ఉన్న నవేలిమ్​ నుంచి ప్రస్తుతం ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు.

మిజోరాం, మేఘాలయా, అరుణాచల్​ప్రదేశ్, మణిపుర్​లలో కాంగ్రెస్​ అధికారంలోకి రావడానికి వ్యూహాలు, పొత్తుల వెనుక ఫలేరోదే కీలకపాత్ర. 2013లో కర్ణాటక ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్​గానూ ఆయన వ్యవహరించారు. గోవా ఎన్నికల సమన్వయ కమిటీకి ఈ వారమే ఫలేరోను అధ్యక్షుడిగా నియమించింది కాంగ్రెస్.

టీఎంసీ సన్నాహాలు..

అసెంబ్లీ ఎన్నికల (Assembly Polls in 2022) నేపథ్యంలో గోవాలోని స్థానిక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ శనివారం తెలిపారు. త్వరలోనే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడించారు.

రాహుల్​ గాంధీతో ఫలేరో

గోవాలో టీఎంసీ (TMC Goa) పోటీకి దిగడంపై కాంగ్రెస్ స్పందించింది. అయితే రాష్ట్ర ప్రజలకు తమ​పై పూర్తి విశ్వాసముందని, ఇతర పార్టీల రాజకీయ గిమ్మిక్కులకు వారు ప్రభావితంకారని చెప్పింది.

ముందే ఖర్చీఫ్ వేసిన ఆప్..

గోవాపై ఇదివరకే కన్నేసింది ఆమ్​ఆద్మీ పార్టీ (AAP in Goa). ఇటీవలే పనాజీలో పర్యటించిన ఆ పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఎన్నికలే లక్ష్యంగా పలు హామీలిచ్చారు. గోవాలో తమను అధికారంలోకి తీసుకొస్తే నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు.

కాంగ్రెస్​కు ఎదురుదెబ్బ..

2017 గోవా శాసనసభ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాలకు గానూ కాంగ్రెస్ (Goa Congress News) అత్యధికంగా 17 సీట్లను కైవసం చేసుకుంది. భాజపాకు 13 స్థానాలు దక్కాయి. అయితే స్థానిక పార్టీలతో పొత్తుతో మనోహర్ పారికర్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్​కు షాకిచ్చింది కమలం పార్టీ.

ఫిరాయింపుల అనంతరం ప్రస్తుతం కాంగ్రెస్​లో (Congress News Goa) కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. 2012 నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలో లేదు. ఇప్పుడు ఫలేరో నిష్క్రమిస్తే ఆ పార్టీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:Assembly Election 2022: నాయకత్వ మార్పుతో ఎన్నికలకు సన్నద్ధం!

ABOUT THE AUTHOR

...view details