Supreme court Sedition case: దేశద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సెక్షన్ 124ఏ ప్రకారం కేసులు నమోదు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించింది. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్రం సోమవారం స్పష్టం చేసిన నేపథ్యంలో.. అప్పటివరకు కేసులు నిలిపివేత సాధ్యాసాధ్యాలపై ఆరా తీసింది. కేంద్రం తుది నిర్ణయం తీసుకునేలోపు పౌరుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. దేశద్రోహం చట్టం ప్రకారం చర్యలు తీసుకోకుండా చూడాలని పేర్కొంది.
Supreme court sedition law PIL: అదేసమయంలో, దేశద్రోహం చట్టంపై పునఃపరిశీలన ప్రక్రియను 3-4 నెలల్లోగా పూర్తి చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. దేశద్రోహం చట్టం కింద నమోదైన పెండింగ్ కేసులపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలని యోచిస్తోందనే విషయాన్ని వివరించాలని కోరింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి బుధవారం స్పందన సమర్పించనున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. కేంద్రం తరపున విచారణకు హాజరైన ఆయన.. కేసుల నమోదు తాత్కాలికంగా నిలిపివేయడంపై చర్చిస్తామని చెప్పారు. అనంతరం విచారణ బుధవారానికి వాయిదా పడింది.