తెలంగాణ

telangana

'అల్లర్లు వద్దనుకుంటే భాజపా అధికారంలోనే ఉండాలి'

By

Published : Feb 10, 2022, 3:06 PM IST

UP Polls Modi Campaign: ఉత్తర్​ప్రదేశ్​లో భాజపా అధికారంలో కొనసాగాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అల్లర్లు, నేరస్థులు లేని రాష్ట్రం కోసం భాజపాకు ఓటేయాలని కోరారు. మరోవైపు, రాజకీయాల కోసం జనరల్ బిపిన్ రావత్​ పేరును ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్​ను ఉద్దేశించి ధ్వజమెత్తారు.

Prime Minister Narenda Modi addressing a public rally
Prime Minister Narenda Modi addressing a public rally

UP Polls Modi Campaign: ఉత్తర్​ప్రదేశ్​ అల్లర్ల రహిత రాష్ట్రంగా ఉండాలంటే భాజపా అధికారంలో కొనసాగాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేరస్థులు జైళ్లకు వెళ్లాలన్నా.. మహిళలు ధైర్యంగా ఉండాలన్నా భాజపాను గెలిపించాలని కోరారు. సరహాన్​పుర్​లో ఎన్నికల ప్రచార సభకు ప్రత్యక్షంగా హాజరైన మోదీ.. విపక్షాలపై అస్త్రాలు ఎక్కుపెట్టారు.

మోదీ సభకు హాజరైన జనం
మోదీ- సహరాన్​పుర్​ ఎన్నికల ప్రచార సభకు భారీగా తరలివచ్చిన జనం

"పేద ప్రజలు మంచి ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం పొందాలన్నా.. చిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లోకి కిసాన్ యోజన నిధులు రావాలన్నా.. రాష్ట్రంలో భాజపా అధికారంలో ఉండాలి. సీఎం యోగి.. నేరస్థులను జైళ్లకు పంపించారు. వారిని జైళ్లకు పంపకూడదా? రాజభవనాల్లో ఉంచాలా?"

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

మరోవైపు, ఉత్తరాఖండ్​లోని శ్రీనగర్​లో నిర్వహించిన భాజపా ఎన్నికల సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. కాంగ్రెస్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం జనరల్ బిపిన్ రావత్ కటౌట్లను హస్తం పార్టీ ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. రాజకీయాల కోసం రావత్​ను ఉపయోగించుకున్న కాంగ్రెస్​కు తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉత్తరాఖండ్ ప్రజలపై ఉందని అన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు.. సర్జికల్ స్ట్రైక్స్​కు రుజువు కావాలని డిమాండ్ చేసిందని అన్నారు. జనరల్ రావత్​ను సైతం అవమానించిందని ఆరోపించారు. ఈ దశాబ్దం ఉత్తరాఖండ్​దే అన్న మోదీ.. భాజపా చేపట్టిన 'విజన్ 2022' దాన్ని సాకారం చేస్తుందని చెప్పుకొచ్చారు.

ఇవీ చూడండి:మహిళ ఘాతుకం- ఐదుగురిని చంపి.. అంత్యక్రియల్లో పాల్గొని..

కరోనా వేళ 'ఓట్ల' పండగ- ఉత్సాహంగా తరలిన ఓటర్లు

ABOUT THE AUTHOR

...view details