తెలంగాణ

telangana

సాగర్ వార్ - ఇరు రాష్ట్రాల ఖాకీల పహారాతో టెన్షన్ టెన్షన్ - ఏపీ పోలీసులపై కేసు నమోదు

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 12:38 PM IST

Updated : Dec 1, 2023, 12:49 PM IST

Police Security at Nagarjuna Sagar Dam : నాగార్జునసాగర్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు రాష్ట్రాల పోలీసులు పెద్ద సంఖ్యంలో మోహరించి.. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు అనుమతి లేకుండా డ్యామ్‌పైకి రావడమే గాక సీసీ కెమెరాలు ధ్వంసం చేయడంతో ఏపీ పోలీసులు, ఇరిగేషన్ అధికారులపై.. సాగర్ పోలీస్ స్టేషన్​లో కేసులు నమోదయ్యాయి.

Nagarjuna Sagar Dam Issue
Police Security at Nagarjuna Sagar Dam

Police Security at Nagarjuna Sagar Dam : నాగార్జునసాగర్ వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. సాగర్‌ డ్యామ్‌పై(Nagarjuna Sagar Issue) ముళ్లకంచెలు ఏర్పాటు చేసిన పోలీసులు.. పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏపీకి చెందిన సాగర్ గేట్లవైపు వైపు భారీగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మోహరించారు. మరోవైపు తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.

High Alert at Sagar Dam : తెలంగాణ సీఎం కార్యాలయ అధికారిణి స్మితా సభర్వాల్‌, నీటి పారుదలశాఖ అధికారులు శుక్రవారం అక్కడికి చేరుకుని సమీక్షించనున్నారు. నేడు ఉభయ రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేసే అవకాశముంది. ఇప్పటికే సుమారు 4వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకుంది. ప్రస్తుతం డ్యాంలో 522 అడుగుల నీటిమట్టం ఉండగా.. మరో 12 అడుగులకు చేరితే సాగర్ నీటిమట్టం డెడ్‌ స్టోరేజీకి చేరే అవకాశముంది. గత రెండు రోజులుగా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి సాగర్‌ వద్దే మకాం వేశారు.

అసలు ఈ వివాదం ఏంటంటే.. రాష్ట్ర విభజన సమయంలో గోదావరి, కృష్ణా నదీ జలాల బోర్డులు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో నాగార్జునసాగర్‌ను తెలంగాణ, శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించాలనే నిర్ణయం వెలువడింది. సదరు నిర్ణయం సరిగా అమలు కాలేదు. శ్రీశైలం డ్యామ్ ఎడమ విద్యుత్తు కేంద్రం నిర్వహణ, తదితరాలను తెలంగాణ రాష్ట్రమే చూసుకుంటోంది. అక్కడికి ఆంధ్రప్రదేశ్‌ అధికారులను రానివ్వడం లేదు. అదే సమయంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో ఉన్న 26 గేట్లకు గానూ.. 13 గేట్లు తెలంగాణ, మిగిలిన 13 గేట్లు ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఉంటాయి.

'మేడిగడ్డ బ్యారేజీ ఘటనలో నిజాలే చెప్పాం - నిరాధార ఆరోపణలు చేయలేదు'

సాగర్ కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు కూడా తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. గతంలో నీటి అవసరాలకు కృష్ణా బోర్డు ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. నీళ్లు విడుదల చేయని సందర్భాలు ఉండేవి. తాజాగా ఇలాంటి సమస్యలేవీ తలెత్తలేదు. ఈ నెలలో సాగర్‌ కుడికాలువ నుంచి తమకు నీళ్లు విడుదల చేయాలని.. తెలంగాణ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ ఇండెంటు పంపిన దాఖలాలూ కూడా లేవు.

సాగర్ నుంచి నీటి విడుదలకు ఈ రెండు నెలల్లో ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. అయితే గత కొంతకాలంగా ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్‌ డిమాండు చేస్తోంది. కానీ బుధవారం రాత్రి ఆకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెద్దసంఖ్యలో సాగర్​ను మోహరించి.. అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం తమ 13 గేట్ల నుంచి కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేశారు.

ఏపీ పోలీసులపై కేసు నమోదు.. మరోవైపు నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదలపై.. ఏపీ పోలీసులు, ఇరిగేషన్ అధికారులపై కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల ఫిర్యాదు మేరకు.. సాగర్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా డ్యామ్ పైకి వచ్చారని, అర్ధరాత్రి సీసీ ధ్వంసం చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

తెలంగాణ సెంటిమెంట్‌తో- ఎన్నికల్లో లబ్ధికి కేసీఆర్‌ పన్నాగాలు : రేవంత్‌

Last Updated : Dec 1, 2023, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details