తెలంగాణ

telangana

'ఎక్స్​ఈ' వేరియంట్​ను తేలిగ్గా తీసుకోవద్దు.. మాస్కుతోనే వైరస్​ కట్టడి!

By

Published : Apr 13, 2022, 5:25 AM IST

Covid New Variant XE: మన దేశంలోనూ కొత్త వేరియంట్‌ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కొత్తగా బయటపడిన 'ఎక్స్‌ఈ' వేరియంట్‌ను తేలిగ్గా తీసుకోవద్దని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మనుసుఖ్​​ మాండవియా ప్రజలను హెచ్చరించారు. కాగా, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న క్రమంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులను వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు.

omicron new varaint
omicron new varaint

Covid New Variant XE: కొవిడ్​ మహమ్మారి ప్రభావం ఇంకా ముగియలేదని.. ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు తప్పక పాటించాలని కేంద్రం తెలిపింది. మరోవైపు మన దేశంలోనూ కొత్తగా బయటపడిన ఎక్స్‌ఈ వేరియంట్‌పై ఆందోళన నెలకొన్న తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైరస్ వ్యాప్తి, ప్రాబల్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణతోపాటు కేసులపై నిఘా పెంచాలని అధికారులకు సూచించారు. కొవిడ్‌ చికిత్సకు అవసరమైన ఔషధాల లభ్యతపై సమీక్షలు జరుపుతూ, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎక్స్​ఈ వేరియంట్​ను తేలిగ్గా తీసుకోవద్దని, తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు.

"12 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు ప్రారంభించే విషయంలో నిపుణులతో చర్చిస్తున్నాం. ఆ వయస్సు పిల్లలకు కొన్ని దేశాలు మాత్రమే వ్యాక్సిన్లు వేస్తున్నారు. భవిష్యత్తులో ఎక్కువ మంది వ్యాక్సిన్ తయారీదారులు మార్కెట్లోకి వస్తే టీకా ధర మరింత తగ్గే అవకాశం ఉంది. 60 ఏళ్ల పైబడిన వారికి ప్రభుత్వ కేంద్రాల్లో టీకా ఉచితంగా అందిస్తాం. మిగతా వారు మాత్రం ప్రైవేటు ఆసుపత్రుల్లో వేయించుకోవాలి. ప్రస్తుతం దేశంలో వైరస్​ వ్యాప్తి అదుపులో ఉన్నప్పటికీ.. మహమ్మారి పూర్తిగా అంతమవ్వనందున జాగ్రత్తలు తీసుకోవాలి. దేశంలో టీకాకు అర్హతగల ప్రజల్లో 97 శాతం మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చాం. 85 శాతం మందికి రెండు డోసుల టీకాను అందించాం. ఇక, ఒమిక్రాన్​ బారిన పడిన వారిలో వైరస్​ తీవ్రతను అరికట్టడంలో టీకాలు కీలక పాత్ర పోషించాయి" అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అన్నారు.

మాస్కులు తప్పనిసరి...కొవిడ్​ 19 కొత్త 'ఎక్స్​ఈ' వేరియంట్‌ను దృష్టిలో ఉంచుకుని మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరోనావైరస్ అన్ని వేరియంట్ల కన్నా 'ఎక్స్​ఈ' అత్యంత ప్రభావవంతమైనదని పేర్కొన్నారు. దేశ రాజధాని దిల్లీలో కొవిడ్ పరిస్థితిని తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, ప్రజలు భయాందోళనలకు గురి కావలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం అన్నారు. గత కొన్ని నెలలుగా దిల్లీలో 0.5 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. సోమవారం 2.70శాతానికి చేరింది. దీంతో ప్రజలు ఆందోళన చెందడం వల్ల సీఎం కేజ్రీవాల్​ స్పందించారు.

ఇదీ చదవండి: పఠాన్ కోట్​ సూత్రధారిని ఉగ్రవాదిగా ప్రకటించిన హోంశాఖ

ABOUT THE AUTHOR

...view details