తెలంగాణ

telangana

ఒడిశా దుర్ఘటన.. 43 రైళ్లు రద్దు.. అనేక రైళ్లు దారి మళ్లింపు

By

Published : Jun 3, 2023, 11:18 AM IST

Updated : Jun 3, 2023, 12:14 PM IST

Odisha Train Accident : ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. మొత్తం 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు, 38 రైళ్లను దారి మళ్లించినట్లు ప్రకటించింది. రద్దు, దారి మళ్లించిన రైళ్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

odisha-train-accident-several-trains-canceled-and-diverted
ఒడిశా రైలు ప్రమాదం రద్దైన 43 రైళ్లు 38 దారి మళ్లింపు

Train Cancelled : ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఘోర ప్రమాదానికి గురైన నేపథ్యంలో 43 రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. మరో 38 రైళ్లను అధికారులు దారి మళ్లించారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వేలాది మంది ప్రయాణికులు స్టేషన్‌లలోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టాటానగర్‌ స్టేషన్‌ మీదుగా మరో 7 రైళ్లను మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.

Train Diverted : రద్దైన రైళ్లలో.. హావ్‌డా- పూరీ సూపర్‌ఫాస్ట్‌, హావ్‌డా- బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌, హావ్‌డా- చెన్నై మెయిల్‌, హావ్‌డా- సికింద్రాబాద్‌, హావ్‌డా- హైదరాబాద్‌, హావ్‌డా- తిరుపతి, హావ్‌డా- పూరీ సూపర్‌ఫాస్ట్‌, హావ్‌డా- సంబల్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌, సంత్రగాచి- పూరీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు- గువాహటి రైలును విజయనగరం, టిట్లాగఢ్‌, జార్సుగుడా, టాటా మీదుగా దారి మళ్లించారు. ఖరగ్‌పుర్‌ డివిజన్‌లో ఉన్న చెన్నై సెంట్రల్‌- హావ్‌డా రైలును జరోలి మీదుగా... వాస్కోడగామా- షాలిమార్‌, సికింద్రాబాద్‌- షాలిమార్‌ వారాంతపు రైళ్లను కటక్‌, అంగోల్‌ మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 07029 అగర్తల- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, 12704 సికింద్రాబాద్- హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైళ్లతో మిగతా వాటిని కూడా దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రమాదం నేపథ్యంలో గోవా- ముంబయి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభాన్ని వాయిదా వేస్తూ కొంకణ్‌ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

రద్దు, దారి మళ్లించిన రైళ్ల వివరాలు
రద్దు, దారి మళ్లించిన రైళ్ల వివరాలు
రద్దు, దారి మళ్లించిన రైళ్ల వివరాలు

చివరగా ఒక్క బోగీ..
అన్ని బోగీల నుంచి క్షతగాత్రులను, మృతులను బయటకు తీసినట్లు ఒడిశా ముఖ్య కార్యదర్శి ప్రదీన్ జెన్​ వెల్లడించారు. చివరగా ఒక బోగీ మిగిలి ఉందని, ఆ బోగీ తీవ్ర స్థాయిలో దెబ్బతిందని.. నుజ్జు నుజ్జు అయిందని సీఎస్​ వివరించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ODRAF), ఫైర్ సర్వీస్ సిబ్బంది బోగీని కత్తిరిస్తున్నారని ఆయన తెలిపారు.

బాలేశ్వర్, మయూర్‌భంజ్, భద్రక్, జాజ్‌పుర్, కటక్ జిల్లాల్లో క్షతగాత్రులకు చికిత్స జరుగుతోందని సీఎస్​ వివరించారు. మృతులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నట్లు ఆయన తెలిపారు. సహాయక చర్యల కోసం 200 అంబులెన్స్​లను మోహరించినట్లు తెలిపిన సీఎస్​.. 50 మంది వైద్యులను ఘటన స్థలంలో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

ప్రమాదం జరిగింది ఇలా..
Train Accident Odisha : తాజాగా ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మంది మృతి చెందారు. 900 మందికి పైగా గాయాపడ్డారు. బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు ఏడు గంటల ప్రాంతంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. వాటిని షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దాంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పదిహేను బోగీలు బోల్తాపడ్డాయి. అనంతరం బోల్తాపడ్డ కోచ్‌లు గూడ్సు రైలును ఢీకొట్టాయి. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడం వల్ల ప్రమాదం తీవ్రత పెరిగింది. ఘటన జరిగిన గురైన సమయంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోల్‌కతా నుంచి చెన్నైకి వెళ్తోంది. ప్రస్తుతం క్షతగాత్రులందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఘటన పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Last Updated :Jun 3, 2023, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details