తెలంగాణ

telangana

కాంగ్రెస్ ఎంపీ మృతికి మోదీ సంతాపం.. భారత్ జోడో యాత్ర వాయిదా

By

Published : Jan 14, 2023, 1:18 PM IST

Updated : Jan 14, 2023, 1:54 PM IST

తమ పార్టీ ఎంపీ అకాల మరణంతో భారత్ జోడో యాత్రకు ఒకరోజు విరామం ప్రకటించింది కాంగ్రెస్. ఆదివారం మధ్యాహ్నం యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని తెలిపింది. మరోవైపు, ఎంపీ సంతోఖ్ సింగ్ మృతిపై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

santokh choudhary death bjy suspend
santokh choudhary death bjy suspend

కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి హఠాన్మరణం నేపథ్యంలో భారత్ జోడో యాత్రకు విరామం ప్రకటించింది హస్తం పార్టీ. ఎంపీ మృతికి సంతాపంగా 24 గంటల పాటు యాత్రను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. పంజాబ్​లోని జలంధర్​లో ఆదివారం జరగాల్సి ఉన్న రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్​ను సైతం వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. జనవరి 15కు బదులు జనవరి 17న హోశియార్పుర్​లో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. జోడో యాత్ర ఆదివారం మధ్యాహ్నం జలంధర్​లోని ఖాల్సా కళాశాల గ్రౌండ్ నుంచి తిరిగి ప్రారంభమవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు.

ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి

శనివారం ఉదయం భారత్ జోడో యాత్రలో పాల్గొన్న జలంధర్‌ ఎంపీ సంతోఖ్ చౌదరికి.. ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. రాహుల్‌ గాంధీతో కలిసి నడిచిన ఆయన.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయనను లుధియానాలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎంపీ మరణవార్త తెలియగానే రాహుల్‌ గాంధీ యాత్రను నిలిపివేసి హుటాహుటిన ఆసుపత్రికి బయల్దేరారు.

ఎంపీ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న రాహుల్ గాంధీ

రాహుల్ విచారం..
పార్టీ ఎంపీ మరణంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. చౌదరి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన కష్టపడి పనిచేసే వ్యక్తి అని, కాంగ్రెస్​కు మూలస్తంభం లాంటివారని పేర్కొన్నారు. చిన్న వయసు నుంచే కాంగ్రెస్​ తరఫున పనిచేస్తూ ప్రజాసేవకు అంకితమయ్యారని గుర్తు చేసుకున్నారు.

ఎంపీ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న రాహుల్ గాంధీ

మోదీ ట్వీట్
కాంగ్రెస్ ఎంపీ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఆయన మరణ వార్త తనకు బాధ కలిగించిందని మోదీ పేర్కొన్నారు. పంజాబ్ ప్రజలకు ఆయన చేసిన సేవలు గుర్తుండిపోతాయని అన్నారు. చౌదరి కుటుంబానికి, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

మోదీ ట్వీట్
Last Updated :Jan 14, 2023, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details