సినిమాల పైరసీని అడ్డుకునే విధంగా మార్పులు చేసిన 2023 సినిమాటోగ్రాఫ్ సవరణ చట్టానికి రాజ్యసభ ఆమోదం తెలిపింది. మణిపుర్ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు వాకౌట్ చేసిన నేపథ్యంలో.. బిల్లుకు రాజ్యసభ మూజువాణి ఓటుతో పచ్చజెండా ఊపింది. 1952 సినిమాటోగ్రాఫ్ చట్టానికి సవరణగా ఈ బిల్లును తీసుకొచ్చారు. సినిమాలను పైరసీ చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ సవరణ బిల్లు రూపొందించారు. దీని ప్రకారం.. సినిమాల పైరసీ కాపీలను రూపొందించే వారికి మూడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. అంతేకాకుండా.. సినిమా వ్యయంలో ఐదు శాతాన్ని నిందితులకు జరిమానాగా విధించనున్నారు.
దీంతో పాటు సినిమాలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ఇచ్చే ధ్రువీకరణను ప్రస్తుతం ఉన్న పదేళ్ల కాలానికి బదులుగా.. శాశ్వతంగా కొనసాగేలా చట్ట సవరణ చేశారు. వయసు ఆధారంగా ఇచ్చే సెన్సార్ సర్టిఫికేషన్లో కేటగిరీలు తీసుకురావాలని ప్రతిపాదనలు చేశారు. 'యూఏ7 ప్లస్', 'యూఏ 13 ప్లస్', 'యూఏ 16ప్లస్' కేటగిరీలను తీసుకురావాలని ప్రతిపాదించారు. టీవీలు, ఇతర మాధ్యమాల కోసం ప్రత్యేక సర్టిఫికేట్ జారీ చేసే అధికారాన్ని సీబీఎఫ్సీకి కట్టబెడుతూ చట్టంలో సవరణ చేశారు. అనధికారంగా సినిమా రికార్డ్ చేయడాన్ని నిషేధిస్తూ ఈ బిల్లులో కొత్త నిబంధన చేర్చారు. వాటిని ప్రదర్శించడాన్నీ నిషేధించారు. పైరసీ వల్ల సినీ పరిశ్రమకు రూ.20 వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని, దాన్ని అరికట్టేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని సభలో ఓ ప్రశ్నకు బదులుగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
లోక్సభలో మరో బిల్లు పాస్..
దీంతో పాటు వ్యాపార నిర్వహణకు సంబంధించి పలు చిన్న దోషాలను నేరజాబితాలో నుంచి తొలగించేందుకు తీసుకొచ్చిన 2023-ది జన్ విశ్వాస్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. 42 చట్టాల్లోని 183 నిబంధనలను ఇది సవరించనుంది. ఈ బిల్లు సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. విపక్షాల నినాదాల మధ్య మూజువాణి ఓటుతో ఈ బిల్లు గట్టెక్కింది. మరోవైపు, ఆఫ్షోర్ ఏరియాస్ మినరల్ సవరణ చట్టాన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు.