తెలంగాణ

telangana

Psycho Son in law : అత్తమామను చంపడానికి ప్లాన్ వేస్తే.. భార్యాబిడ్డలు...!

By

Published : Apr 26, 2023, 9:57 AM IST

Updated : Apr 26, 2023, 10:08 AM IST

Man tried to kill In Laws in sangareddy : సంగారెడ్డి జిల్లాలో పిల్లను ఇచ్చిన అత్తమామలనే.. చంపడానికి ప్రయత్నించాడో ఓ ప్రబుద్ధుడు. కరెంట్ షాక్ పెట్టి హత్య చేయాలని పక్కా ప్రణాళిక వేశాడు. కానీ అనుకున్నది ఒకటి... అయినది మరొకటి. అత్తమామల్ని కాటికి పంపాలని కుట్ర చేసిన అల్లుడు.. చివరికి కటకటాల పాలయ్యాడు. ఎందుకు హత్య చేయాలనుకున్నాడనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు.. కారణం తెలుసుకుని అవాక్కయ్యారు.

Ramesh wanted to kill his in-laws
Ramesh wanted to kill his in-laws

Man tried to kill In Laws in sangareddy : కామారెడ్డి జిల్లా పిట్లంలో ఉండే రమేష్ అనే వ్యక్తి.. ఈ నెల 12న రాత్రి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్‌రావుపేటలోని తన భార్య పుట్టింటికి వచ్చాడు. ఇంటి ప్రధాన ద్వారం మూసి ఉండటంతో... బయటి నుంచి పిలవగా ఇంట్లో వాళ్లు పలకలేదు. దీనికితోడు రెండేళ్లుగా భార్యను సంసారానికి పంపట్లేదని... అత్తమామల మీద కోపం పెంచుకున్న రమేష్.. వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. దానికి ఉన్నపళంగా ఓ పథకం రచించాడు.

అత్త మామల ఇంటికి వచ్చిన రమేష్.. ప్రధాన ద్వారం పక్కన ఉన్న విద్యుత్ మీటర్ నుంచి.. ఓ తీగను తలుపులకు బిగించాడు. ఓ బకెట్లో నీళ్లు పెట్టి.. ఇనుప రాడ్డును నీళ్లలో పెట్టి తలుపులకు అనుసంధానించాడు. తెల్లవారుజామున తన అత్తామామలు తలుపులు తీసే సమయంలో.. విద్యుదాఘాతానికి గురై చనిపోతారని ఉహించుకున్నాడు. కానీ అత్తమామలు తలుపు తీస్తారనుకుంటే.. తన భార్య కూతుర్లు తీసి కరెంట్ షాక్‌కు గురయ్యారు. విలవిల్లాడుతూ కేకలు వేయడంతో.. గమనించిన ఇరుగుపోరుగు వెంటనే అప్రమత్తమై.. కరెంటు తీగలను తొలగించారు.

రమేష్ మామ... దన్యాల రాములు అదే రోజు తన పొలం వద్దకు వెళ్లి చూడగా.. తన పోలంలోని రెండు బోర్లు తగలబడిపోయి కనిపించాయి. బోర్లపై వరిగడ్డి వేసి వాటిని కాల్చి వేశారు. ఇంటికి విద్యుత్ షాక్‌తో తమపై హత్యాయత్నం చేయడం, బోర్లు కాల్చివేసిన ఘటనలపై రాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనలను పరిశీలించిన పోలీసులు.. ఈ వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రాములుకు స్థానికంగా ఎవరితోనూ వివాదాలు లేకపోడంతో పోలీసులు సాంకేతికత సాయంతో విచారణ ప్రారంభించారు. రాములు అల్లుడే ఈ ఘటనలకు కారణం అని వారు గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారిండంతో.. తానే తలుపులకు విద్యుత్ తీగలు పెట్టానని, వ్యవసాయ బోర్లు కాల్చి వేశానని అంగీకరించాడు. రమేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. తలుపులు తెరవలేదన్న కారణంతో.... ఏకంగా అత్తమామల్ని హత్య చేయడానికి ప్రయత్నించిన తీరును చూసి.. పోలీసులతో సహా స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

"కామారెడ్డికి చెందిన రమేష్ అర్ధరాత్రి తన అత్తగారి ఇంటికి వెళ్లాడు. భార్య భర్తల మధ్య రెండు సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈనెల 12న రాత్రి పూట అత్తగారింటికి వెళ్లిన రమేష్ తలుపుకొట్టగా వారు తీయలేదు. దీంతో వారిపై కోపం పెంచుకున్న రమేష్.. వాళ్లను చంపేందుకు కుట్ర పన్నాడు. తలుపులకు కరెంట్​ మీటర్​కు కనెక్షన్ ఇచ్చి.. డోర్ తీయగానే షాక్ వచ్చేలా ఏర్పాటు చేశాడు. కానీ తెల్లవారి లేచిన తర్వాత తలుపు తీసింది అతడి భార్యా బిడ్డలు. ఈ ఘటనలోవారు గాయపడ్డారు. అంతటితో ఆగకుండా అతడి మామ పొలంలో కరెంట్ మోటర్లు పేల్చాడు."- వెంకట్ రెడ్డి, నారాయణఖేడ్ ఎస్సై

ఇవీ చదవండి:

Last Updated : Apr 26, 2023, 10:08 AM IST

ABOUT THE AUTHOR

...view details