తెలంగాణ

telangana

అదుపు తప్పి లోయలో పడ్డ బస్సు.. 13 మంది మృతి.. 29 మందికి గాయాలు

By

Published : Apr 15, 2023, 8:09 AM IST

Updated : Apr 15, 2023, 1:44 PM IST

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 13 మంది మృతి చెందగా.. మరో 29 మంది గాయపడ్డారు. రాయగడలో శనివారం జరిగిందీ ఘటన. మరోవైపు.. ఓ ఇన్నోవా కారు చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 8 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

maharashtra-road -accident
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్​ బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 13 మంది మృతి చెందగా.. మరో 29 మంది గాయపడ్డారు. రాయ్​గడ్​లో శనివారం జరిగిందీ ఘటన. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సంప్రదాయ సంగీత కచేరి బృందం ఒకటి పుణె నుంచి ముంబయి వెళుతుండగా.. పాత ముంబయి-పుణె జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు షింగ్రోబా ఆలయం వద్ద.. బస్సు లోయలో పడిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. ఇందుకోసం స్థానికంగా ఉండే ట్రెక్కింగ్‌ గ్రూపు సభ్యుల సాయం తీసుకున్నారు. బస్సులో ఉన్నవారు గోరెగావ్‌కు చెందిన బాజి ప్రభు వాదక్ గ్రూపు సభ్యులని గుర్తించారు. గాయపడిన 29 మందిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. చనిపోయినవారు 18 నుంచి 25 ఏళ్ల వయసు మధ్యవారేనని పోలీసులు తెలిపారు.

'బస్సులో దాదాపు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నాం. బాధితుల్లో కొంతమంది ముంబయిలోని సియోన్, గోరెగావ్ ప్రాంతానికి చెందినవారు. మరికొందరు పాల్ఘర్ జిల్లాకు చెందినవారు. వీరంతా పుణెలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం కార్యక్రమాన్ని ముగించుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత ముంబయికి బయలుదేరారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది.'

--పోలీసులు

మరోవైపు.. బస్సు లోయలో బోల్తా కొట్టిన ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని అధికారులను శిందే ఆదేశించారు.

చెట్టును ఢీ కొట్టిన ఇన్నోవా వాహనం..
ఉత్తర్​ప్రదేశ్​లోని శ్రావస్తి జిల్లాలో ఓ ఇన్నోవా కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఇకౌనా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 14 మంది ఉన్నారు. వీరంతా లుథియానాలో ఓ సంతాప సభకు హాజరై వస్తుండగా ఘటన జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టు​మార్టం పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కారు ఢీ కొని బైకర్​ మృతి..
ఉత్తర్​ప్రదేశ్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఓ కారు ఢీ కొట్టింది. ఘటనలో బైకర్​ మృతి చెందాడు. పిలిభిత్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్​పై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని అన్నారు. ప్రస్తుతం కారు డ్రైవర్​ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. మృతుడిని 25 ఏళ్ల పరితోష్​గా పోలీసులు గుర్తించారు. అతడు మజోలా ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలిపారు.

Last Updated : Apr 15, 2023, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details