తెలంగాణ

telangana

త్వరలో రాజ్యసభ ఎన్నికలు.. కేంద్రమంత్రి జైశంకర్‌ నామినేషన్‌.. పోటీకి కాంగ్రెస్​ దూరం

By

Published : Jul 10, 2023, 3:41 PM IST

Updated : Jul 10, 2023, 4:10 PM IST

Jaishankar Rajya Sabha : త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు గుజరాత్ నుంచి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్​. జైశంకర్ నామినేషన్ దాఖలు చేశారు. గాంధీనగర్‌లోని అసెంబ్లీ కాంప్లెక్స్‌లో తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారిణి రీటా మెహతాకు సమర్పించారు. మరోవైపు.. డెరిక్‌ ఓబ్రియెన్‌, డోలా సేన్‌, సుఖేందు శేఖర్‌ రాయ్‌, సామ్రుల్‌ ఇస్లామ్‌, ప్రకాశ్‌ చిక్‌ బారాయిక్‌, సాకేత్‌ గోఖలేలను రాజ్యసభ ఎన్నికలో బరిలో నిలిపింది టీఎంసీ.

jaishankar rajya sabha
jaishankar rajya sabha

Jaishankar Rajya Sabha : త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్​ నామపత్రాలు దాఖలు చేశారు. గుజరాత్​ నుంచి ఆయన ఈ సారి కూడా బరిలోకి దిగారు. నామపత్రాలు దాఖలు సమయంలో జైశంకర్​ వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆ రాష్ట్ర​ బీజేపీ చీఫ్ సీఆర్​ పాటిల్ ఉన్నారు. గాంధీనగర్​లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రీటా మెహతాకు సోమవారం.. జైశంకర్ నామినేషన్​ పత్రాలు సమర్పించారు. ​

మరోసారి తనకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నాయకత్వానికి, గుజరాత్​ ప్రజలకు జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు. 'ఉగ్రవాదం పట్ల భారత్​ కఠినంగా వ్యవహరిస్తోంది. మోదీ ప్రభుత్వం దేశాన్ని సురక్షితంగా ఉంచుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత నాలుగేళ్లలో విదేశాంగ విధానంలో తీసుకొచ్చిన మార్పుల్లో భాగమయ్యే అవకాశం నాకు లభించింది. గుజరాత్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం నా అదృష్టం. భారత్​లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధికి గుజరాత్ మోడల్ రాష్ట్రంగా నిలిచింది' అని ప్రొఫెసర్ జైశంకర్ అన్నారు.

Rajya Sabha Election 2023 Gujarat : గుజరాత్‌కు సంబంధించి మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరిలో 8 మంది బీజేపీ నుంచి, ముగ్గురు కాంగ్రెస్ తరఫున ఉన్నారు. బీజేపీ నుంచి ఎనిమిది మంది సభ్యుల్లో జైశంకర్‌, జుగాలి ఠాకూర్‌, దినేశ్ అనవాడియా పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు 18తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు, ఈ మూడు స్థానాల్లో తాము అభ్యర్థులెవరినీ బరిలోకి దించడంలేదని కాంగ్రెస్‌ శుక్రవారం తెలిపింది. 182 మంది సభ్యులు కలిగిన గుజరాత్‌ అసెంబ్లీలో తమకు తగినంతమంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేదని పేర్కొంది. గతేడాది జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు స్థాయిలో 156 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్‌ 17 స్థానాలకే పరిమితమైంది. జులై 24న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఈ నెల 13తో ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణకు జులై 17వరకు గడువు విధించారు. నాలుగేళ్ల క్రితం జైశంకర్​ గుజరాత్​ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.

Rajya Sabha Election West Bengal : ఇదిలా ఉండగా.. రాజ్యసభ ఎన్నికల్లో బరిలో నిలిపే అభ్యర్థుల జాబితాను తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఖరారు చేసింది. డెరిక్‌ ఓబ్రియెన్‌, డోలా సేన్‌, సుఖేందు శేఖర్‌ రాయ్‌, సామ్రుల్‌ ఇస్లామ్‌, ప్రకాశ్‌ చిక్‌ బారాయిక్‌, సాకేత్‌ గోఖలేలను తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. జులై 24న బంగాల్‌లో ఆరు, గుజరాత్‌లో మూడు, గోవాలో ఒక రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Last Updated : Jul 10, 2023, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details